జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 4
ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి -1
అమ్మావాళ్ళ చిన్నప్పుడు సంక్రాంతి వస్తోందంటే ఒకటే సందడి హడావుడి వుండేదిట. డిసెంబరు 15వ తేదీ నుంచి నెల పట్టడం అని చేసేవారుట. అంటే కేవలం సంక్రాంతి పండగ మీదే దృష్టి పెట్టేవారు. ఇలా చెప్పింది అమ్మ -
అందరిళ్ళలో పశుసంపద బాగా వుండేది. అందుకని నెల పట్టినప్పటి నుంచి ఆవుపేడతో రోజూ గొబ్బిళ్ళు పెట్టేవారు. వాటిని గోడకి పిడకలుగా కొట్టి వాటి మధ్య చిల్లు పెట్టేవారు. ఎందుకంటే భోగి రోజున మంటలో దండలుగా గుచ్చి వేసేవారు. ఒకళ్ళమీద పోటీగా ఒకళ్ళు గొబ్బిళ్ళతో పిడకలు చేసి దండలు రెడీ చేసుకునేవారు. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి గొప్పగా వుండేది.
అమ్మ చక్కటి ముగ్గులు పెట్టేది. అప్పట్లో ఇంటిముందు పేడనీళ్ళు చల్లి తెల్లటి బియ్యపు పిండితో ముత్యాల ముగ్గులు పెట్టేవారు. గీతల ముగ్గులు చాలా తక్కువ. బియ్యపు పిండితో ముగ్గులు ఎందుకంటే చీమలకి ఆహారం వేసినట్లు అనుకునేవారు. నెల రోజులు రకరకాల ముగ్గులతో వాకిళ్ళు శోభాయమానంగా వుండేవి. అందరిళ్ళలో పిల్లలు అందరిళ్లకి పరుగులు పెట్టుకుంటూ ఎవరి ముగ్గు బావుందో చూసి వచ్చేవారు.
ఈ నెల రోజులు హరిదాసు కీర్తనలతో, జంగమదేవరల గంటల సవ్వడితో చాలా సందడిగా వుండేది. హరిదాసు వస్తున్నాడనగానే పిల్లలు చిట్టి చిట్టి చేతులతో బియ్యం తీసుకుని గుమ్మం ముందు నుంచునేవారు. పెద్దవాళ్ళు హరిదాసుకి కొత్త బట్టలు ఇచ్చేవారు. మధ్యాహ్నం వరకు తిరిగి హరిదాసు ఇంటిదారి పట్టేవాడు.
జోలె తగిలించుకుని, గంట వాయించుకుంటూ, శంఖం వూదుతూ వచ్చే జంగమ దేవరని పిల్లలు, పెద్దలు చాలా ఆసక్తిగా చూసేవారు. వీళ్ళు శైవారాధకులు. రకరకాల కథలు, శైవ కథలు చెపుతూ ప్రచారం చేస్తూ తిరుగుతుండేవారు. జంగమ దేవర చెప్పే కథలంటే అప్పట్లో అందరికీ చాలా ఆసక్తిగా, కాలక్షేపంగా వుండేది. జంగమ దేవరలని కూడా కొత్తబట్టలు, బియ్యం, పప్పులు ఇచ్చి గౌరవించేవారు.
గంగిరెద్దు వాళ్ళు ఎద్దుని చక్కగా అలంకరించి ఇంటి ముందుకు వచ్చేవారు. ఎద్దుని అయ్యగారికి దణ్ణంపెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టి అనగానే అది వంగి దణ్ణం పెట్టేది.
వాళ్లకి డబ్బులు వేస్తే పిల్లల పేరు అడిగి -
“మహలక్షమ్మగారి ఆరుగురు మగపిల్లలు ఐదుగురు మగపిల్లలు పదకొండు మంది సంతానంతో ఇల్లంతా కళకళలాడుతుందని” ఆశీర్వదించేవారు.
వాళ్ళ ఆశీర్వాదానికి పిల్లలు సిగ్గుపడుతూ నవ్వుకునేవారు. వీళ్ళకి కూడా బట్టలిచ్చి, కొత్తధాన్యం ఇచ్చి పంపేవారు.
అందరిళ్ళలో పెద్ద పెద్ద పెరడ్లు వుండడంతో అందరూ రకరకాల పువ్వుల మొక్కలని పెంచేవారు. రంగు రంగుల బంతిపువ్వులతో గొబ్బిళ్ళని, దండలు గుచ్చి గుమ్మాలని అలంకరించేవారు.
అమ్మావాళ్ళు రోజూ పెట్టే గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాడే పాట -
సుబ్బీ గొబ్బెమ్మ
సుఖమూ నియ్యావే
చామంతి పువ్వుంటి
చెల్లెలినియ్యావే
గుమ్మడి పువ్వంటి
కూతుర్నియ్యావే
తామర పువ్వుంటి
తమ్ముడినియ్యావే
మొగలి పువ్వంటి
మొగుడ్నియ్యావే
ఇలా పాడి చివరికి మొగుడు అనగానే సిగ్గుపడి పాడేవారు.
ఇలా రోజూ పెట్టడం వుంటూండగానే…. పండగ దగ్గిర పడుతుంటేే ఏదో ఒక రోజు సందె గొబ్బీ అని సాయంత్రమప్పుడు పెద్ద పెద్ద గొబ్బెమ్మలని తయారు చేసి వాటిని పువ్వులతో బాగా అలంకరించి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి వాళ్ళతో కలిసి వాటి చుట్టూరా తిరుగుతూ పాటలు పాడి వాటిని దగ్గరలో ఉన్న కాలవలో కలిపేవారు.
సందె గొబ్బీ దగ్గర
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఉట్లమీద పాలు పెరుగు ఎట్ల దించెను
నే కొట్ట బోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు
అంటూ తిరుగు తిరుగుతూ వున్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని అటూ ఇటూ చెల్లా చెదురై గలగలా నవ్వుకునేవారు.
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
రవికలన్ని మూట కట్టి రమణ కృష్ణుడు
ఆ చెట్టు మీద దాచెనమ్మ చిన్ని కృష్ణుడు
ఆ మూట కట్టడం చెప్పేటప్పుడు వాళ్ళు కట్టుకునన పట్టు లంగాలని ముందుకు తీసుకుని చేత్తోమూటలుగా చేసి తిరిగేవారు.
గొబ్బీయళ్ళో గొబ్బీయళ్లో
తోట తోటా వేసేరంటా
ఏమీ తోటా వేసేరంటా
రాజుగారీ తోటలో
జామీ తోటా వేసేరంటా - ఇలా వుండేవి ఆ పాటలు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి