25, జులై 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 22 - తాడేపల్లిగూడెం - మేడ మెట్లు, మెట్ల కింద గదులు - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 6

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 22 -  తాడేపల్లిగూడెం  - మేడ మెట్లు, మెట్ల కింద గదులు  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 6  


ఇదిగో ఈ కనిపిస్తున్న మెట్లపక్కన దిగడానికి ఉన్న గోడమీద నేను మా చెల్లెలు ప్రభావతి ఎన్నోసార్లు జారుడుబల్లలాగా పై నుంచి కింద వరకూ జారేవాళ్ళం.  అప్పట్లో ఇవే ఆటలు.


ఈ మెట్ల పైన కూచుని మా చిన్న చెల్లెలు గాయత్రికి ఎక్కాలు నేర్పించేవాళ్ళం. అది ముద్దు ముద్దుగా చెప్తుంటే విని ఆనందించేవాళ్ళం.

మాకు అప్పట్లో పైకి నీళ్ళు వచ్చేందుకు పైపు లైన్లు వుండేవి కాదు.  నర్సింహులు అనే అతను మా నాన్నగారికి నమ్మిన బంటు. కాలవ నుంచి కావిడితో మోసుకుని, ఈ మెట్లన్నీ ఎక్కి వచ్చి నీళ్ళు తొట్లనిండా నింపేవాడు. ఇంటికి కావలసిన నీళ్ళన్నీ పోసేవాడు. అంత కష్టపడతాడని నాన్నగారికి చాలా జాలిగా వుండేది. సాయంత్రం బ్యాంకి నుంచి వచ్చాక అమ్మ ఏదైనా తినడానికి పెడితే నర్సింహులు కోసం సగం తీసి పెట్టేవారు.

ఇంక మెట్లు దిగాక పొడుగ్గా కనిపిస్తున్న వరండా లో మూడు రూములున్నాయి. పెద్దక్క బియస్సీ చదువుతోంది. అక్క చదువుకుంటుందని  నాన్నగారు చివరగా ఉన్న రూము ఖాళీగా వుంటే తీసుకున్నారు.  అక్క రోజూ రాత్రి, పగలు అక్కడ కూచుని చదువుకునేది. తినడానికి, పడుకోవడానికి మాత్రమే పైకి వచ్చేది.

 

ఇప్పుడు కింద రూములు ఎవరికో అద్దెకి ఇచ్చారు. వాళ్ళిలా వాడుకుంటున్నారు


ఇలా మా ఇంటి గుమ్మం నుంచి రోడ్డు మీద నుంచి మా వెనక కనిపిస్తున్న గేటులోకి వెళ్ళాల్సి వచ్చేది.

అంతా బాగానే వుంది కానీ మాకు నెంబర్ 2కి వెళ్ళాలంటే ఈ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో   వుండేది. దానికి వేరే గేటు వుండేది. మా ఇంటి మెయిన్ డోర్ నుంచి రోడ్డు మీంచీ వెళ్ళి ఆ గేటు తాళం తీసుకుని వెళ్ళాల్సి వచ్చేది. ఇది చాలా ఇబ్బందిగా వుండేది. 



ఇది మెట్లపక్కన రూము  వెనకవైపుకి దారి

అయితే మెట్లపక్కనే వున్న రూములో అజ్జరపు బ్రదర్స్ అనే కిరాణాషాపు ఆయన వాళ్ళ షాపుకి సంబంధించిన సరుకులన్నీ స్టాకు పెట్టుకునేవారు. అప్పుడప్పుడు వచ్చి లెక్కలు రాసుకునేవారు. ఆ రూముకి అవతలి స్థలానికి  వెళ్ళడానికి వేరే గుమ్మం వుండేది.  నాన్నగారు ఆయన్ని బతిమాలి ఆయన్ని చివరి రూములోకి మారమని,  మెట్లపక్క రూము అక్కకోసం తీసుకున్నారు. ఇప్పుడు సమస్య పరిష్కారం అయ్యింది.  మేము కూడా రోడ్డు మీంచి తిరిగి వెళ్ళక్కరలేకుండా. ఈ రూములోంచి అటువైపుకి వెళ్ళడానికి వీలుకలిగింది.


అజ్జరపు బ్రదర్స్ కిరాణాషాపు ఆయన మాకోసం సబ్బుల అడ్వర్ టైజ్ మెంట్ పేపర్లు, వేరే అడ్వర్ టైజ్ మెంట్ పేపర్లు వుంటే అవన్నీ పుస్తకాలకి అట్టలు వేసుకోవడానికి ఇచ్చేవారు. ఒకసారి ఆయన రూములో ఏదో పని చూసుకుంటున్నారు. నాకు, మా చెల్లెలు ప్రభావతికి మెట్ల పక్కన బొగ్గుల బస్తామీద మాకు ఏవేవో పేపర్లు కనిపించాయి. ఇద్దరం కలిసి అవి తీసుకుని మేడమీదకి వెళ్ళి మా పెద్దక్కకి అవి దొరికాయని చూపించాం. అక్క అవి చూసి అయ్యయ్యో ఇవన్నీ ఆయన బిల్లులు పొండి పొండి ఇచ్చేసి రండి అని అంది. ఇద్దరం అవన్నీ తీసుకుని కిందకి వెళ్ళేసరికి ఆయన పాపం అంతా వెతికేసుకుంటూ తిరిగేస్తున్నారు. ఇద్దరం మాట్లాడకుండా అక్కడ పెట్టేసి వచ్చేశాం.  అప్పుడు చాలా చిన్నపిల్లలం, ఇప్పటి పిల్లలంత తెలివితేటలు లేవు.  తల్చుకుంటే - అయ్యో ఇలా ఎలా చేశాం. పాపం ఆయన ఏమనుకున్నారో అనిపిస్తుంది.

 

ఇంక ఆ రూమ్ తీసుకున్నాక అక్క రాత్రి 12 నుంచి 1 వరకు రూములో కూచుని చదువుకుంటూ వుండేది.  నాన్నగారు మధ్యలో వెళ్ళి పూర్ణమ్మా ఇంక పడుకో అనేవారు.  కాసేపటికి అక్క పైకి వచ్చి పడుకునేది.  మేము 8 గంటలకల్లా నిద్రపోయేవాళ్ళం.

(ఇంకా వుంది)

 


18, జులై 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 21 - తాడేపల్లిగూడెం - ఇంటి ముందు ఖాళీ స్థలం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 5 -

   జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 21 -  తాడేపల్లిగూడెం  - ఇంటి ముందు ఖాళీ స్థలం - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 5  




 

వేసవికాలం వస్తే అందరం ఆరుబయట వెన్నెల్లో భోజనం చెయ్యడం ఒక చక్కని అనుభూతి.  అమ్మ వంట చాలా బాగా చేసేది. ఊరగాయలు కాకుండా ఎప్పటికప్పుడు రోటి పచ్చడి ఏదో ఒకటి వుండేది.    చుట్టూరా మా పిల్లలందరినీ కూచోపెట్టుకుని  పెద్ద కంచంలో అందరికీ కలిపి పెట్టేది. 

 

అలా తినేటప్పుడు అందరం ఏవో ఒకటి మాట్లాడుతూ తినేవాళ్ళం.  మధ్యమధ్యలో జోకులు వేసుకుంటూ... ఆ జోకులకి అందరికీ బాగా నవ్వు వచ్చేది. పొట్టలు పట్టుకుని నవ్వేవాళ్ళం. చిన్నప్పుడు ఎందుకో  ప్రతి దానికీ నవ్వు వచ్చేది. 

 

అన్నం తింటూ నవ్వితే అమ్మకి భయం పొరమారుతుందేమో... అని.  కానీ నవ్వు ఆగేది కాదు.  అమ్మతిడుతూ వుండేది. గొంతుకి అడ్డం పడి ప్రాణాలు పోతాయి అని. కానీ తనూ నవ్వకుండా వుండలేకపోయేది. అమ్మకి అప్పటికి  37 ఏళ్ళు.  పదకొండు సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. మాతో బాగా ఎంజాయ్ చేసేది.   అది ఒక మరిచిపోలేని అనుభూతి.


***


ఈ ఇంటి ముందు ఏవైనా ఎండపెట్టుకోవాలన్నా బాగుచేసుకోవాలన్నా అమ్మకి చాలా వీలుగా వుండేది. 

 

అక్కడ కూచుకుని అమ్మ బియ్యం ఏరుతుండేది. అప్పట్లో బియ్యం బస్తా 100 కిలోలు 70 రూపాయలు.  మేము ఆరుగురు (చిన్నపిల్లలం) అమ్మాయిలం, అమ్మ, నాన్న కలిపి ఎనిమిది మంది కదా... పైగా అప్పట్లో టిఫిన్లు లేవు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అన్నమే.

 

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే ఆ బస్తాలో వడ్లు, నూకలు, నల్లమట్టి రాళ్ళు వుండేవి.  అమ్మ బియ్యం ఏరి వడ్లు రాళ్ళు బయట పడేసేది. ఆ వడ్లు తినడానికి పిచుకలు వచ్చేవి. ఒక నాలుగైదు పిచుకలు వచ్చి తినేవి. మేము దూరం నుంచీ వాటిని చూస్తూ వుండేవాళ్ళం.

 

ఒకసారి మా బామ్మ వచ్చింది.  బామ్మయినా అలా పిలిచేవాళ్ళం కాదు. మా అమ్మకి (మేనరికం)  అమ్మమ్మ కాబట్టి మేమూ అమ్మమ్మ అనే వాళ్ళం. వాళ్ళూ ఏమీ పట్టించుకునేవారు కాదు.  

 

ఆవిడ సంగతి ఏమిటంటే...  అమ్మకి అన్ని పనుల్లో సాయం చేసేది.

 

ఆవిడకి చాలా పొదుపు ఎక్కువ.  అందుకని వడ్లు అన్నీ ఒకచోట పోగు పెట్టి  బియ్యం కొలతకి ఒక పావు కిలో బియ్యం పట్టే రేకు డబ్బా వుండేది. అది కొంచెం గరుకుగా వుండేది. ఆ డబ్బా నిండా వడ్లు అవగానే... వాటిని చాటలో పోసి ఆ డబ్బాతో వడ్లని (పైన రుద్దడం) ఎనిపేది.  అప్పుడు ఆ పొట్టు వూడి వచ్చేసేది. వాటిని బియ్యంలో కలిపేది.

 

ఆవిడ ఉన్నన్నాళ్ళూ పాపం  పిచుకలు కాసేపు దూరంగా గోడమీద కూచుని నిరాశగా వెళ్ళిపోయేవి.


ఆవిడ ఊరు వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చేవి.  మాకు బాగా కాలక్షేపం అయ్యేది. 

 

 

 




12, జులై 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 4 - ఎదురుగా తాళం వేసి ఉన్న ఆ గది చిన్న వంటిల్లు.

 

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 4

ఎదురుగా తాళం వేసి ఉన్న ఆ గది చిన్న వంటిల్లు.

 





అమ్మ దేవుడి మందిరం అక్కడ పెట్టించుకుంది. నాన్నగారు రామభక్తులు. రోజూ రాత్రిపూట ఒక పావుగంట రామజపం చేసుకునేవారు. మల్లె మొగ్గలు తెచ్చి జపానికి నన్ను లెక్కపెట్టి ఇమ్మనేవారు. పెద్ద రాముడి ఫోటో వుండేది. శ్రీరామనవమికి ఆ ఫోటోనే పెట్టేవాళ్ళం.

 

అమ్మ వంట బయట కుంపటి, పొట్టు పొయ్యి, పెట్టుకుని వంటచేసేది. వంట చేసిన తర్వాత అవన్నీ లోపల పెట్టేది. ఆ బాల్కనీ నించీ కోతులు అవీ రాకుండా నాన్నగారు వెదురు బద్దలతో చేసిన పెద్ద పెద్ద కర్టెన్లలాంటివి అడ్డాలు కట్టించారు.  అందుకని అమ్మ వంటకి పెద్ద ఇబ్బంది వుండేది కాదు.  కుడివైపున ఉన్న గుమ్మం హాలులోకి దారి. అందుకని వంట చేశాక అందరం హాలులో కూచుని భోజనం చేసేవాళ్ళం.  


అమ్మ వంటచేసే చోటు నుంచి కొంచెం ఇవతలకి ఒక స్తంభం దగ్గిర పొద్దున్నే మాకోసం చద్దన్నం గిన్నెలో పెట్టి వుంచేది. మేము ఏదోఒక ఊరగాయ, మజ్జిగ వేసుకుని తినేసి స్కూలుకి వెళ్ళిపోయేవాళ్ళం.  పొద్దున్న 7.30 నుంచి 11 గంటల వరకు స్కూలు వుండేది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్కూలు వుండేది. అందుకని 11 గంటలకి వచ్చేసరికి అమ్మ వంట చేసేది అప్పుడు అన్నీ వేసుకుని అన్నం తినేవాళ్ళం.

 

అట్లతద్ది, ఉండ్రాళ్ళ తద్ది వస్తే ఆ స్తంభం దగ్గిరే మాకు పొద్దున్నే 5 గంటలకి గోంగూర పచ్చడి, పెరుగు వేసి అన్నం పెట్టి ఆడుకోవడానికి పంపించేది. 


హాలులోనుంచి ఈ గుమ్మం బయటికి వెడితే అక్కడ ఒక స్టూలు మీద మంచినీళ్ళ కుండ వుండేది. దానికి టాప్ వుండేది. దాన్నించి నీళ్ళు కిందపడితే తడి అయి జారుతుందని నాన్నగారు ఒక వెడల్పాటి  మట్టి కుండీ తీసుకువచ్చి దాని కింద పెట్టేవారు. ఒకవేళ గ్లాసు కడిగినా నీళ్ళు అందులోనే పోసేవాళ్ళం.

నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎవరో పెద్ద బెల్లం బుట్ట ఇచ్చారు. అమ్మ జీళ్ళు ఎక్సపరిమెంట్  చేసింది. పాకం కొంచెం చల్లారడానికి ఆ నీళ్ళలో ఒక ప్లేటులో పెట్టింది. ఆ ప్లేటు మునిగి పోయి దాన్నిండా నీళ్ళు వచ్చి ఇంకొంచెం పలచబడింది. ఇంకేం చెయ్యలేక దాన్ని అవతల పోసేసింది. 



 


ఆ బాల్కనీలో పైన కనిపిస్తున్న ఖాళీ పైన మేడమీదకి వెళ్ళడానికి చెక్కమెట్లు వుండేవి. అవి సగం సగం విరిగిపోతే నాన్నగారు ఒక నిచ్చెన కొనుక్కుని వచ్చి దాని మీద వేశారు. అప్పుడు పైకి ఎక్కడానికి వీలుగా వుండేది.

 

నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి దసరా వస్తే ఆయుధ పూజకోసం పుల్లలతో బాణాలు చేసుకుని ఆ చెక్క నిచ్చెన మీద పెట్టుకున్నాం. మర్నాటికి అవి మాయం. ఏమయ్యోయో అనుకుంటే నాన్నగారు బయట పడేశారని తెలిసింది. మా ఇద్దరికీ కోపం వచ్చింది. కానీ నాన్నగారంటే గౌరవం కాబట్టి కొంచెం బాధపడి వూరుకున్నాం.   పుల్లలతో కళ్ళలో పొడుచుకుంటామని ఎంత భయపడ్డారో ఇప్పుడు అర్థం అవుతుంది.

 

(ఇలా ఎన్నో ఆ ఇంట్లో జ్ఞాపకాలు. ఇంకా వున్నాయి. )

 

 

 

 

 

10, జులై 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 4

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 4


(గత భాగం తరువాయి)




మేము మేడ మీదకి వెళ్ళి కొత్తలో పక్కనే బాల్కనీని ఆనుకుని పెద్ద నారింజ చెట్టు వుండేది. నారింజ కాయలు అంటే ఇప్పటి పిల్లలకి కమలా పళ్లు (సంత్రాలు). కానీ అవి అసలు సిసలైన నారింజ కాయలు. ఆ చెట్టు  పక్కింట్లో ఉన్న మా ఫ్రెండు వాళ్ళింట్లోంచి బాగా విస్తరించి, పై వరకు వుండేది. కాయలు కూడా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో వుండేవి. రుచి చాలా బావుండేది.

 

ఎన్ని కాయలు కోసుకున్నా వాళ్ళు ఏమీ అనేవారు కాదు.  పైగా మా ఫ్రెండ్స్ కి కూడా ఇచ్చేవాళ్ళం.

 

బాల్కనీలోకి చెట్టు వాలి వుండడం వలన చాలా కాయలే కోసుకునే వాళ్లం. వాటిల్లో ఉప్పూ కారం వేసుకుని తింటే బలేవుండేది. అంతే కాకుండా ఆకులు కోసి మా అమ్మ పల్చటి మజ్జిగలో వేసి, సాయంత్రానికి ఉప్పు వేసి ఇచ్చేది. వాసన పట్టి మజ్జిగ చాలా రుచిగా అనిపించేది.

 

మేము అక్కడ ఉన్న ఒక రెండేళ్ళ తర్వాత ఎందుకో ఆ చెట్టు బెరడు అంతా ఊడిపోవడం మొదలు పెట్టి ఉన్నట్టుండి ఎండిపోయింది. చాలా బాధగా అనిపించింది.

 

ఇప్పుడు దాని చోటులో పెద్ జామ చెట్టు వుంది. మేము  ఆ ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు నారింజ కాయల్ని గుర్తు చేసుకుంటూ జామకాయలు కోసుకుని తిన్నాం.

ఎడమవైపున కనిపిస్తున్న జామ చెట్టు స్థలంలో నారింజ చెట్టు వుండేది.

 


 

చిన్న  డాబా  కథ

 


మేడ ఎక్కే మెట్లకి వర్షం రాకుండా అనుకుంట ఒక చిన్న డాబా కట్టారు. దానికి మెట్లుండేవి కాదు.  దాని పక్కనే మా నాన్నగారు తడికలతో ఒక బాత్రూంలాగా కట్టించారు. మా అమ్మ అందులో నీళ్ళు కాచుకోవడానికి ఒక బాయిలర్ పెట్టేది. 


దాంట్లోకి ఇంధనం వుండాలిగా.... అందుకని పనిమనిషి చేత పేడ తెప్పించి, అప్పట్లో కుంపట్ల మీద వంట కాబట్టి బొగ్గు రజను కలిపి ఉండలు చేసి తను స్టూలు మీద నుంచుని మమ్మల్ని బుజాల మీద ఎక్కించుకుని,  మా కాళ్ళు పట్టుకుని పైకి ఎక్కించేది. అలా ఎక్కినప్పుడు ఒకోసారి మా పొట్టలకి గోడ గీసుకుని చర్మం లేచి మంట పుట్టేది.  తను తయారు చేసిన ఆ పేడ వుండలని ఇచ్చి మమ్మల్ని పైన పెట్టమనేది.  అదేంటో ఇంటిముందంతా స్థలం వుండేది అలా ఎందుకు చేసేదో తెలియదు.

 

అమ్మ ఆ వుండలు చేసినప్పుడల్లా మేమో పెద్ద సాహసం చెయ్యాల్సి వచ్చేది.

 


1, జులై 2021, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 19 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 3

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 19 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు - 3


(గతభాగం తరువాయి)




మేడ మెట్లపక్కనే ఒక చక్కటి డిజైన్ తో ఒక గోడ వుండేది. అది ఇప్పుడు లేదు అక్కడ ఒక చిన్న కిటికీ లాగ వుండి మిగిలినది గోడ కట్టేశారు. అక్కడి నుంచి మాకు వచ్చేపోయే రైళ్ళన్నీ కనిపించేవి. రోజూ అక్కడ నుంచుని రైళ్ళలో వాళ్ళకి టాటా చెప్పేవాళ్లం.  మాకు అక్కడ నుంచీ వెళ్ళేరైలు, వచ్చే రైలు కనిపిస్తుంటే బలే ఆనందంగా వుండేది.


ప్రతి శుక్రవారం ఆకుపచ్చ రంగులో ఉన్న  స్పెషల్ ట్రైన్ వచ్చేది. సరిగ్గా రాత్రి 7.30 కి. మేము భోజనాలు చేసే టైమ్. అయినా సరే తింటూ తింటూ స్పెషల్........ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేవాళ్ళం.


అప్పట్లో కొత్తగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. అది చాలా స్పీడుగా వెళ్ళేది. అది వెళ్తుంటే మేమున్న చోటు అదురుతూ వుండేది. అదో అనుభూతి.

 

మేము ట్రైన్ లో వాళ్ళకి టాటా చెప్పడం బాగానే వుండేది కానీ, అలా చెప్పకూడదని తెలియదు. ఒకసారి మెడికల్ షాపాయన పాపా అలా ట్రైన్ లో వెళ్ళేవాళ్ళకి టాటా చెప్పకూడదు అన్నారు అప్పటి నుంచీ ఊరికే చూసేవాళ్ళం.

 

ఏ రైలు ఎప్పుడొస్తుందో.... ఎప్పుడు వెడుతుందో టైము బాగా తెలుస్తుండేది. అప్పుడప్పుడు మా ఇంటి ఎదురుగా రైలు ఇంజను ఆగి వుండేది. మేడ మించి కిందకి దిగి ఆ రైల్వే ట్రాక్ మించి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని గ్రీజు అడిగి తీసుకునేవాళ్ళం. వాళ్ళదగ్గిర అభ్రకం కూడా వుండేది. అది కూడా ఇచ్చేవారు.

  

ఒకసారి నేను మా ఫ్రండ్ సరస్వతి వెళ్ళాం. ఇంజన్ డ్రైవర్ ఏం చదువుతున్నారు అనిఅడిగారు. 5వ తరగతి అని చెప్పాం.  ఆ అమ్మాయి నాకన్నా చాలా పొడుగ్గా వుండేది. నేను చిన్నపిల్లలా వుండేదాన్ని. ఇంత పెద్దగా వున్నావు. ఇంకా ఐదేనా అన్నాడు. పాపం ఆ అమ్మాయి చాలా బాధపడింది.