అమ్మా ఎలావున్నారు...
నా జీవిత కదంబం. నా జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు, వివిధ ప్రదేశాలకి నేను వెళ్ళిన స్థలాలలో అనుభూతుల, అనుభవాల, జ్ఞాపకాల సమాహారం.
31, అక్టోబర్ 2020, శనివారం
అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు - 6
27, అక్టోబర్ 2020, మంగళవారం
అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరం -5
అమ్మా... ఎలా వున్నావు.
ఎన్నిరోజులైందమ్మా నీకు ఉత్తరం రాసి. రోజులు తొందరగా గడిచిపోతున్నాయి. కానీ పాతజ్ఞాపకాలు తవ్వుకుంటూ వస్తున్నాయి. మొన్న నువ్వు నీ టైమ్ లైన్ లో నవంబర్ 14న మా పాత జ్ఞాపకాల ఫొటోలు పెట్టావు కదా... అవి చూడగానే నాకు బలే సంతోషంతా అనిపించింది.చిన్నుగాడు, నేను ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నాం.
25, అక్టోబర్ 2020, ఆదివారం
అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు ప్రేమతో రాసిన ఉత్తరం - 4
మా అమ్మాయి వీణాధరి నాకు ప్రేమతో రాసిన ఉత్తరాలు
అమ్మా...
21, అక్టోబర్ 2020, బుధవారం
అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు - 4
అమ్మా!
అక్కడ ఎంతమంది పిల్లలున్నా తాత నన్ను మాత్రమే ఎత్తుకుని తిప్పేవారని, నన్ను తన పక్కనే మంచం మీద పడుకోపెట్టుకునేవారని, తనే అన్నం తినిపించేవారని నువ్వు చెప్పింది మాత్రం బాగా గుర్తుంది. సీత ఆంటీ కూడా బాగా ఆడించేవారని చెప్పావు. ఒకసారి నాకు వాకర్ కొని దానితో నన్ను నడిపిద్దామని అందులో నిలబెడితే నేను పడిపోయి నా మూతికి దెబ్బ తగిలితే, సాయంత్రం నువ్వు వచ్చేసరికి ఆంటీ ఏడుస్తూ చెప్పారని చెప్పావు. పాపం భయపడినట్లున్నారు. ఏంటో అమ్మా ఇవన్నీ తలుచుకుంటుంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయినట్లుంది.
15, అక్టోబర్ 2020, గురువారం
అమ్మకు ప్రేమతో.... 2 వ ఉత్తరం
అమ్మా!
14, అక్టోబర్ 2020, బుధవారం
అమ్మకు ప్రేమతో..... పిల్లలు రాసిన ఉత్తరాలు
పిల్లలు దూర దేశాలకి వెళ్ళినప్పుడు అమ్మకి ప్రేమతో రాసిన ఉత్తరాలు ఇవి....
పిల్లలు పుట్టిన దగ్గరనుంచీ వాళ్ళ అల్లర్లు, పేచీలతో ఎన్నో ముచ్చట్లు ఉంటాయి. ఆ ముచ్చట్లలో ప్రేమ వుంటుంది, మనం తట్టుకోలేని నవ్వు వుంటుంది, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారనే ఆలోచన, దాంట్లో మనం నేర్చుకునే పాఠం వుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్ళ వృత్తి రీత్యా కానీ, వివాహం అయి కానీ దూరంగా వున్నప్పుడు వాళ్ళు వాళ్ల చిన్నప్పటి విషయాలన్నీ తల్లితండ్రులతో పంచుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? దాన్నే ఈ రకంగా ప్రారంభించి వీలైనప్పుడల్లా మా పిల్లల ముచ్చట్లు మీతో పంచుకుందామనుకుంటున్నాను!
10, అక్టోబర్ 2020, శనివారం
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 6
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 6
ఇప్పటి వరకూ అమ్మ చెప్పిన సంక్రాంతి పండుగ
చూశారు కదా…
మరి ఈ సంక్రాంతి పండుగ ఏలేటిపాడులో చూడడానికి అమ్మ మేనమామ పట్టెయ్య శాస్త్రులు గారి అబ్బాయి కృష్ణశాస్త్రి గారింటికి నేను, మా వారు వెళ్ళాం. మా వారికి పల్లెటూళ్ళో భోగిమంటలు, పండగ చూడాలని వుందంటే వెళ్ళాం.
కృష్ణశాస్త్రి వారి సతీమణి మమ్మల్ని సాదరంగా
ఆహ్వానించారు. భోగి రోజు పొద్దున్నే లేచి భోగిమంట వేశారు. మేము కూడా ఆ కార్యక్రమంలో
పాల్గొన్నాం. తర్వాత కాసేపు తెలిమంచు అందాలు చూడడానికి వారి మేడపైకి వెళ్ళాం. మసక
మసకగా చెట్ల నిండా మంచు పడి, చలి చలిగా చాలా
బావుంది.
పండగ రోజు చక్కగా మంచి పిండి వంటలతో భోజనం
పెట్టారు. వారి మర్యాదలు, ఆప్యాయతలు పెద్దల నుంచి పుణికి పుచ్చుకున్నారు.
చాలా సంతోషంగా అనిపించింది.
మళ్ళా రెండోసారి పిల్లలని తీసుకుని వెళ్ళాము.
వాళ్ళ నుంచి అవే మర్యాదలు, అవే ఆప్యాయతలు. వీధులలో వేసిన ముగ్గులు
సంక్రాంతి హడావుడి చూసి పిల్లలు చాలా సంతోషించారు. అక్కడ పొలాల గట్లమీద, చెరువుల
దగ్గిరికి వెళ్ళి వాటి అందాలని ఆస్వాదించి వచ్చారు. పెద్దపండగ రోజు ఊరంతా ఒకటే హడావిడి. ప్రభల
ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు. ఇది మూడు సంవత్సరాలకి
ఒకసారి జరుగుతుందిటి. పుట్టింటి ఆడబడుచులు తప్పనిసరిగా వస్తారు.
రకరకాల వింత వింత వేషాలతో, డప్పుల ధ్వనులతో మాకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తానికి
పాతకాలంలో జరిగినట్లు కాకపోయినా పల్లెటూరులో సంక్రాంతికి వెళ్ళి ఆనందించాం.
7, అక్టోబర్ 2020, బుధవారం
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 4 ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి -1
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 4
ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి -1
అమ్మావాళ్ళ చిన్నప్పుడు సంక్రాంతి వస్తోందంటే ఒకటే సందడి హడావుడి వుండేదిట. డిసెంబరు 15వ తేదీ నుంచి నెల పట్టడం అని చేసేవారుట. అంటే కేవలం సంక్రాంతి పండగ మీదే దృష్టి పెట్టేవారు. ఇలా చెప్పింది అమ్మ -
అందరిళ్ళలో పశుసంపద బాగా వుండేది. అందుకని నెల పట్టినప్పటి నుంచి ఆవుపేడతో రోజూ గొబ్బిళ్ళు పెట్టేవారు. వాటిని గోడకి పిడకలుగా కొట్టి వాటి మధ్య చిల్లు పెట్టేవారు. ఎందుకంటే భోగి రోజున మంటలో దండలుగా గుచ్చి వేసేవారు. ఒకళ్ళమీద పోటీగా ఒకళ్ళు గొబ్బిళ్ళతో పిడకలు చేసి దండలు రెడీ చేసుకునేవారు. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి గొప్పగా వుండేది.
అమ్మ చక్కటి ముగ్గులు పెట్టేది. అప్పట్లో ఇంటిముందు పేడనీళ్ళు చల్లి తెల్లటి బియ్యపు పిండితో ముత్యాల ముగ్గులు పెట్టేవారు. గీతల ముగ్గులు చాలా తక్కువ. బియ్యపు పిండితో ముగ్గులు ఎందుకంటే చీమలకి ఆహారం వేసినట్లు అనుకునేవారు. నెల రోజులు రకరకాల ముగ్గులతో వాకిళ్ళు శోభాయమానంగా వుండేవి. అందరిళ్ళలో పిల్లలు అందరిళ్లకి పరుగులు పెట్టుకుంటూ ఎవరి ముగ్గు బావుందో చూసి వచ్చేవారు.
ఈ నెల రోజులు హరిదాసు కీర్తనలతో, జంగమదేవరల గంటల సవ్వడితో చాలా సందడిగా వుండేది. హరిదాసు వస్తున్నాడనగానే పిల్లలు చిట్టి చిట్టి చేతులతో బియ్యం తీసుకుని గుమ్మం ముందు నుంచునేవారు. పెద్దవాళ్ళు హరిదాసుకి కొత్త బట్టలు ఇచ్చేవారు. మధ్యాహ్నం వరకు తిరిగి హరిదాసు ఇంటిదారి పట్టేవాడు.
జోలె తగిలించుకుని, గంట వాయించుకుంటూ, శంఖం వూదుతూ వచ్చే జంగమ దేవరని పిల్లలు, పెద్దలు చాలా ఆసక్తిగా చూసేవారు. వీళ్ళు శైవారాధకులు. రకరకాల కథలు, శైవ కథలు చెపుతూ ప్రచారం చేస్తూ తిరుగుతుండేవారు. జంగమ దేవర చెప్పే కథలంటే అప్పట్లో అందరికీ చాలా ఆసక్తిగా, కాలక్షేపంగా వుండేది. జంగమ దేవరలని కూడా కొత్తబట్టలు, బియ్యం, పప్పులు ఇచ్చి గౌరవించేవారు.
గంగిరెద్దు వాళ్ళు ఎద్దుని చక్కగా అలంకరించి ఇంటి ముందుకు వచ్చేవారు. ఎద్దుని అయ్యగారికి దణ్ణంపెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టి అనగానే అది వంగి దణ్ణం పెట్టేది.
వాళ్లకి డబ్బులు వేస్తే పిల్లల పేరు అడిగి -
“మహలక్షమ్మగారి ఆరుగురు మగపిల్లలు ఐదుగురు మగపిల్లలు పదకొండు మంది సంతానంతో ఇల్లంతా కళకళలాడుతుందని” ఆశీర్వదించేవారు.
వాళ్ళ ఆశీర్వాదానికి పిల్లలు సిగ్గుపడుతూ నవ్వుకునేవారు. వీళ్ళకి కూడా బట్టలిచ్చి, కొత్తధాన్యం ఇచ్చి పంపేవారు.
అందరిళ్ళలో పెద్ద పెద్ద పెరడ్లు వుండడంతో అందరూ రకరకాల పువ్వుల మొక్కలని పెంచేవారు. రంగు రంగుల బంతిపువ్వులతో గొబ్బిళ్ళని, దండలు గుచ్చి గుమ్మాలని అలంకరించేవారు.
అమ్మావాళ్ళు రోజూ పెట్టే గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాడే పాట -
సుబ్బీ గొబ్బెమ్మ
సుఖమూ నియ్యావే
చామంతి పువ్వుంటి
చెల్లెలినియ్యావే
గుమ్మడి పువ్వంటి
కూతుర్నియ్యావే
తామర పువ్వుంటి
తమ్ముడినియ్యావే
మొగలి పువ్వంటి
మొగుడ్నియ్యావే
ఇలా పాడి చివరికి మొగుడు అనగానే సిగ్గుపడి పాడేవారు.
ఇలా రోజూ పెట్టడం వుంటూండగానే…. పండగ దగ్గిర పడుతుంటేే ఏదో ఒక రోజు సందె గొబ్బీ అని సాయంత్రమప్పుడు పెద్ద పెద్ద గొబ్బెమ్మలని తయారు చేసి వాటిని పువ్వులతో బాగా అలంకరించి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి వాళ్ళతో కలిసి వాటి చుట్టూరా తిరుగుతూ పాటలు పాడి వాటిని దగ్గరలో ఉన్న కాలవలో కలిపేవారు.
సందె గొబ్బీ దగ్గర
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఉట్లమీద పాలు పెరుగు ఎట్ల దించెను
నే కొట్ట బోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు
అంటూ తిరుగు తిరుగుతూ వున్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని అటూ ఇటూ చెల్లా చెదురై గలగలా నవ్వుకునేవారు.
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
రవికలన్ని మూట కట్టి రమణ కృష్ణుడు
ఆ చెట్టు మీద దాచెనమ్మ చిన్ని కృష్ణుడు
ఆ మూట కట్టడం చెప్పేటప్పుడు వాళ్ళు కట్టుకునన పట్టు లంగాలని ముందుకు తీసుకుని చేత్తోమూటలుగా చేసి తిరిగేవారు.
గొబ్బీయళ్ళో గొబ్బీయళ్లో
తోట తోటా వేసేరంటా
ఏమీ తోటా వేసేరంటా
రాజుగారీ తోటలో
జామీ తోటా వేసేరంటా - ఇలా వుండేవి ఆ పాటలు
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 5 - ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి - 2
జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు - 5
ఏలేటిపాడులో అమ్మ చెప్పిన సంక్రాంతి సందడి - 2
పండగ ముందు వారం రోజులనుంచీ ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తుండేవారు - జంతికలు, కజ్జికాయలు, కరకజ్జం, చిట్టి గారెలు, బూందీ లడ్డూలు, అరిసెలు ఇలా ఎన్నో రకాలు డబ్బాలలో నింపి పెట్టేవారు.
పెద్ద పండగ అవడంతో అందరూ కొత్త బట్టలు వేసుకునేవారు. ఆడపిల్లలకి ముచ్చటగా పట్టు లంగాలు, జడగంటలు పెట్టిన పువ్వుల జడలు తప్పనిసరిగా వుండేవి. ఊరంతా పరుగులు పెట్టుకుంటూ తిరుగుతుంటే కళకళలాడుతుండేది.
మొదటి పండగ భోగి రోజు -
భోగిరోజు తెల్లవారు జామున ఇన్నిరోజులు దాచిపెట్టిన గొబ్బీ పిడకలు, పెద్ద పెద్ద చెట్ల్ మానులు వేసి భోగిమంట వేస్తారు. ఆవు పేడతో చేసిన పిడకలు కావడం వల్ల వాటి నుంచి వచ్చే పొగ కూడా ఆరోగ్యానికి మంచిది. ప్రతి నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వేస్తారు. ఆ మంట మీద చాలా మంది స్నానానికి నీళ్లుకాచుకుంటారు.
భోగిమంట తర్వాత తలస్నానం ఒక పెద్ద పనిగా వుండేది. ఒంటికి నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండితో నలుగు పెట్టుకుని, కుంకుడు కాయలతో మాత్రమే తలస్నానాలు చేసేవారు. ఒకవేళ ఆ కుంకుడు రసం కంట్లో పడి కన్ను మండితే… రాళ్ళ ఉప్పు నోట్లో వేసుకోమనేవారు. ఎందుకో తెలియదు. ఇదంతా అయ్యాక దేవుడి దగ్గిర పెట్టిన కొత్త బట్టలు కట్టుకుని హరిదాసుకోసం ఎదురు చూసేవారు. హరిదాసుకి బియ్యం వేసి ఎవరి దారిన వాళ్ళు స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళేవారు. సాయంత్రం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పేరంటం పెట్టి - పువ్వులు, రేగిపళ్ళు, రాగి పైసాలు కలిపి అందరికీ ఇచ్చి దిష్టి తీసి నెత్తిమీద పోయించేవారు. ఆ వేడుక అయిన తర్వాత కిందపడిన పైసాలు చాకలి అమ్మాయినో, పని మనుషులనో తీసుకోమనేవారు.
రెండవ రోజు సంక్రాంతి - పెద్ద పండగ
ఆరోజు నింజంగానే పెద్ద పండగ. ఆరోజు కుటుంబంలో ముందు తరాల పెద్ద వాళ్ళన గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన రకరకాల పిండి వంటలు చేస్తారు. పులిహోర, బూరెలు, బొబ్బట్లు ఒకరకం కాదు చాలా రకాలు చేస్తారు. పిల్లలూ పెద్ద వాళ్ళూ కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా గడుపుతారు. సంక్రాంతికి బొమ్మల కొలువులు ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టి పేరంటానికి పిలుస్తుండేవారు. కొంతమంది మూడు రోజులు, కొంతమంది తొమ్మిది రోజులు వుంచుతారు. రకరకాల పెద్ద, చిన్న బొమ్మల దగ్గర నుంచీ ఎన్నో బొమ్మలు వుంటాయి. బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళు పేరంటానికి పిలిచి - అలా అందరినీ ఆరోజు కలుస్తారు. ఇదొక పెద్ద సందడిగా వుంటుంది.
మూడవరోజు కనుమ
సంక్రమణం జరిగిన మరుసటిరోజుని కనుమ అంటారు. ఈ రోజు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోరు. కనుమునాడు కాకి కూడా కదలదనీ నానుడి. ఈ రోజు తల స్నానం చేసితీరాలట. కనుము నాడు మినుము తినాలని అనేవారు. కనుక కనుమునాడు సాధారణముగా మినపగారెలు తింటారు. భోజనం లో ప్రత్యేకత గారెలు. ఈ రోజు ఊరి అమ్మవారికి నైవేద్యం చెల్లించడం ఆచారం. ఊరి అమ్మవారి సంబరం జరగడం కూడా వేడుకే.
ఈ రోజు పశువులను కడిగి అలంకారం చేసి హారతిస్తారు. ఎడ్ల పోటీలు, కోడి పందాలతో ఊరంతా హడావుడిగా వుంటుంది. కనుము పూర్తిగా రైతుల పండుగ. ఈరోజు రైతులు ఉదయమే పశువుల పాకలని శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టి, అక్కడ పాలతో పొంగలి వండుతారు. దీనిని పాన పొంగలి లేదా పశుల పొంగలి అంటారు. పనిముట్లను, పశువులను కడిగి, కుంకుమాదులతో అలంకరించి పూజిస్తారు. పొంగలిని నైవేద్యముగా పెట్టిన తరువాత ఆ మెతుకులను పసుపు, కుంకుమలతో కలిపి పొలాలలో చల్లుతారు. దేనిని ‘పోలిచల్లడం’ అంటారు.
కనుము నాడు కొన్ని ప్రాంతాలలో జరిగే ప్రభల తీర్థం చాలా బావుండేది. చక్కగా అలంకరించబడిన ప్రభలలో తమ తమ శివాలయాలలోని ఉత్సవ మూర్తులని ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ఒక చోట సమావేశ పరుస్తారు. ఎక్కడెక్కడి నుండో బంధువులు, మిత్రులు అంతా కలిసి ఆనందంగా గడుపుతారు.
నాలుగవ రోజు జరుపుకొనేది ముక్కనుమ. ఇలా ఊళ్ళో సంక్రాంతి పండగ జరుగుతుందని చాలా బాగా గడిపేవాళ్ళమని అమ్మ చెప్పింది.