24, ఏప్రిల్ 2023, సోమవారం

***గాంధీ గారిని కలిసిన ప్రముఖ వ్యక్తి రావూరి అర్జునరావుగారు - 81*** 103 సంవత్సరాల ఆ పెద్దమనిషిని కలవడం ఆనందంగా అనిపించింది

***గాంధీ గారిని కలిసిన ప్రముఖ వ్యక్తి రావూరి అర్జునరావుగారు  - 81***

103 సంవత్సరాల ఆ పెద్దమనిషిని కలవడం ఆనందంగా అనిపించింది



*** గాంధీజీ తో కొంతకాలం గడిపి, గాంధీజీ ఆశయాలే జీవితధ్యేయం అనుకున్న శ్రీ రావూరి అర్జునరావు (103 సంవత్సరాలు), వారి సతీమణి మనోరమగారు (93 సంవత్సరాలు). ఈరోజు వారిని కలవడం ముఖ్యవిశేషం. ***

రావూరి అర్జున రావుగారు నరిసెట్టి ఇన్నయ్యగారి ఆప్తమిత్రులు. హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఇద్దరూ కలుసుకుంటూ వుండేవారు. ఇప్పటికీ ఇన్నయ్యగారిని మర్చిపోలేదు. అన్ని విషయాలు చెప్పారు.

ఒకరోజు ఇన్నయ్యగారు ఫోన్ చేసి అర్జున్ రావుగారు, మనోరమ హైదరాబాదు వచ్చారట వెళ్ళి కలవమని చెప్పారు. అలాగే సాక్షి సిఇఓ గా చేసిన ప్రముఖ పాత్రికేయులు కొండుభట్ల రామచంద్రమూర్తిగారికి కూడా చెప్పారు. ఈ రోజు రామచంద్రమూర్తిగారు మా ఇంటికి వచ్చారు. మేము అర్జున్ రావుగారి ఆఖరి అబ్బారి పవర్ (రేడియోలజిస్ట్) ఇంటికి వెళ్ళాం. రామచంద్రమూర్తిగారు కెమెరా మెన్ ని తీసుకువచ్చి, ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశారు.

నరిసెట్టి ఇన్నయ్యగారు, అర్జున్ రావుగారు విజయవాడలో కలిసినప్పుడు

మనోరమ అర్జున్ రావు దంపతులతో వారి కుమారుడు పవర్, నేను, రామచంద్రమూర్తిగారు


సేవాగ్రామ్ లో వారి వివాహం జరిగిన సందర్భం. 
మనోరమ, అర్జున్ రావుగార్ల మధ్య ప్రధానమంత్రి, నెహ్రూ, కుడిచేతి వైపు చివర ప్రభాకర్ జీ

అర్జున్ రావుగారి కొడుకు, కోడలు, మనవరాలితో మేము
ఎడమ నుంచి మొదటగా కూర్చున్నవారు వారి రెండవ కుమారుడు, మనవరాళ్ళు
*****

మనోరమగారు 93 సంవత్సరాల వయసులో కూడా చాలా హుషారుగా వున్నారు. స్పష్టంగా మాట్లాడుతున్నారు. అర్జున్ రావుగారు కరోనా వచ్చి తగ్గడం వల్ల కొంత నీరసపడ్డారు. ఇద్దరూ బాగా మాట్లాడారు.

వీరిద్దరి గురించి తెలుసుకోవాలంటే చాలా చరిత్రే వుంది. ఇక్కడ నేను సంక్షిప్తంగా తెలియచేస్తున్నాను.

అర్జున్ రావుగారు ప్రముఖహేతువాది గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి అల్లుడు. గోరాగారి కుమార్తె మనోరమగారిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గాంధీజీ సమ్మతి మీద జరిగిన తీరు, అర్జున్ రావుగారు గాంధీగారి ఆశ్రమానికి వెళ్ళిన వైనం మాతో పంచుకున్నారు.

ఎడమవైపు అర్జునరావుగారు, పక్కన గోరాగారు
సదాచారసంపన్నులైన బ్రాహ్మణ కుటుంబంలో నాస్తికుడుగా మారి బయటికి తరిమివేయబడిన నాస్తికుడు గోపరాజు రామచంద్రరావు (ఎమ్మెస్సీ బోటనీ). వీరి సతీమణి సరస్వతి. వీరి 9మంది సంతానంలో కుమార్తె ***మనోరమ***. గోరాగారు గాంధీ గారి ఆశ్రమానికి తరచు వెడుతుండేవారు. గాంధీజీ ఆస్తికులు, గోరా గారు నాస్తికులు అయినప్పటికీ – గాంధీగారు అవి మనకి అడ్డుకాదు. మన కర్తవ్యనిర్వహణ దేశానికి స్వాతంత్ర్యం రావడం అని చెప్పారట. గాంధీజీతో గోరా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు.

ఆంధ్రప్రదేశ్ ముదునూరులో గోరా, సరస్వతీ గోరా నడిపిన వయోజన పాఠశాలలో ***అర్జున్ రావు***గారు కార్యకర్తగా చేరి నిస్వార్థ సేవలో వారి మన్ననలు పొందారు. గోరా గాంధీగారిని కలిసినప్పుడు తన కుమార్తె మనోరమకి అర్జున్ రావుని ఇచ్చి పెళ్ళిచేద్దామనుకుంటున్నానని గాంధీగారికి చెప్పారట.

గాంధీగారు గోరా గారికి - నేను 1945 సంవత్సరం డిసెంబరు చివరలో మద్రాసు వస్తున్నాను. అప్పుడు మనోరమ, అర్జున్ రావులని తీసుకురమ్మని చెప్పారట. గోరాగారు డిసెంబరులో వీరిద్దరినీ తీసుకుని మద్రాసు వెళ్ళారు. అక్కడ గాంధీగారు ప్రముఖ న్యాయవాది బులుసు సాంబమూర్తిగారిని మనోరమకి ఈ వివాహం ఇష్టమా కాదా అడగమన్నారు. మనోరమ అంగీకారం చెప్పారు. గోరా అప్పుడే వివాహం చేద్దామని గాంధీగారితో అంటే -

గాంధీగారు - “***కులాంతర వివాహం అనేది సాంఘిక మార్పుతో కూడినదని***, మనోరమని బొబ్బిలిలో కస్తూరిబా గాంధీ శిక్షణా కార్యక్రమంలో ఉండమనీ - అర్జున్ రావుని తనతోబాటు 1946 ఫిబ్రవరి 5న గాంధీజీ ప్రయాణించే ప్రత్యేక రైలులో వార్దా దగ్గరలో ఉన్న సేవాగ్రాం కి తీసుకుని వెళ్ళారు. ఇద్దరి ఆలోచనలలో ఎటువంటి మార్పూ రాకపోతే రెండు సంవత్సరాల తర్వాత తనే వారి వివాహం చేస్తానని, వారు తన పిల్లల”ని గాంధీగారు చెప్పారట.

ఆశ్రమంలో చేరిన మూడవ రోజున గాంధీజీని కలవమని ప్రభాకర్ జీ (గాంధీగారికి ప్రియమైన వ్యక్తి) ద్వారా పిలుపు వచ్చింది. గాంధీజీని కలిశారు అర్జున్ రావుగారు. వెంటనే కలవనందుకు గాంధీజీ అర్జున్ రావు గారి బుజాన్ని తట్టి నవ్వుతూ - ‘’చోర్ లడకా’’ అని - ఆశ్రమంలో అందరితో కలిసి పనిచెయ్యమని, హిందీ నేర్చుకోమని చెప్పారు. అర్జున్ రావు హిందీ సరిగా రాకపోవడంతో మూడుసార్లు గాంధీగారితో మాట్లాడారట. హిందీ నేర్చుకుని ఆయనకి ఉత్తరాలు రాసేవారట.

సేవాగ్రాంలో రోడ్లు తుడవడం, తిరగలి తిప్పడం, పరిసరాల పరిశుభ్రత, పత్తి వడకడం, 80 సంవత్సరాల వయస్సులో బౌద్ధమతస్తుడైన కోసంబి మరణించేవరకు గాంధీగారి ఆశ్రమంలోనే వుంటానంటే అర్జునరావుగారు ఆయనకి సేవలు చేశారు. ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఉదయం 5 గం. లకి జరిగే ప్రార్థనకి వెళ్ళకుండా సాయంత్రం జరిగే ప్రార్థనలో అందరినీ పరిశీలించడానికి వెళ్ళేవారట.

*** గోరాగారు పిల్లలందరినీ తీసుకుని ఒకసారి సేవాగ్రాంకి వెళ్ళారట. మనోరమగారు అది మొదటిసారి గాంధీగారిని చూడడం. మనోరమ బొబ్బిలిలో కస్తూరిబా గాంధీ శిక్షణా కార్యక్రమానికి వెళ్ళిపోయింది.***

1946లో గాంధీగారి దగ్గరికి వెళ్ళిన అర్జునరావు నడత నచ్చిన గాంధీజీ వారి వివాహం తన ఆశ్రమంలోనే చేస్తానన్నారట. ***1948***లో గాంధీగారి చేతుల మీదుగా వీరి వివాహం జరగవలసి వుంది. కానీ ***30 జనవరి 1948***లో గాంధీగారి హత్య జరగడం వలన వీరి వివాహం అనుకున్నట్లు జరగలేదు.

***1948 మార్చి 13వ*** తేదీన ఉదయం 8 గంటలకి మహాత్ముని అభీష్టం నెరవేర్చాలని భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో థక్కర్ బాబా, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య వినోబాభావే, ప్రభాకర్ జీల సమక్షంలో అర్జున్ రావు, మనోరమల వివాహం జరిగింది. గాంధీగారు వీరి వివాహానికి తయారు చేసిన నూలుదండలు మార్చుకున్నారు. వచ్చిన వారందరికీ తెలుగువారైన కమలగారు బెల్లం, వేరుశనగపప్పు కలిపి అందరికీ ఇచ్చారు. ఈ వివాహం గురించి జాతీయ పత్రికలు ప్రముఖంగా ముద్రించాయి. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ***మార్చి 18***వ తేదీన విజయవాడ నాస్తిక కేంద్రానికి వచ్చేశారు.

గాంధీగారి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి అదే మాట మీద వుండి ఈరోజు వరకూ ఆయన ఖద్దరు వస్త్రాలనే ధరిస్తున్నారు. ఎంతమంది అడిగినా రాజకీయాలకి దూరంగా వున్నారు.

మనోరమ గారు గుడివాడలో ఎమ్.ఎల్.ఎ. వేమూరి కూర్మయ్యగారి సహాయంతో ఏర్పాటుచేసిన బాలికల హాస్టల్ కి మేనేజర్ గా వుండి సుమారు 100 మంది బాలికలకి జీవితంలో నేర్చుకోవలసిన అనేకవిషయాలు నేర్పించారు.

వీరిద్దరూ ఇప్పటివరకూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని, ఎందరికో చెయ్యగలిగినంత సేవ చేస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా వున్నారు. అర్జున్ రావుగారు పుట్టిన వానపాముల అనే వూరులో మార్పు అనే సేవాసంస్థని స్థాపించి, వాళ్ళ పిల్లలందరూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సైన్సు, విద్య, శాస్త్రీయదృష్టి, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వంతో నిరంతరం ముందుకు సాగాలని యువతకి తెలియజేస్తున్నారు.

వీరికి 5గురు పిల్లలు – మిలావ్, చునావ్, సాదిక్, సూయజ్, పవర్ – వీరందరూ తల్లితండ్రుల్సి అపురూపంగా చూసుకుంటున్నారు. వీరి తరం వచ్చేసరికి నాస్తికత్వం, హేతువాదం కొంత సడలిందని వారి చివరి అబ్బాయి పవర్ చెప్పారు.

ఏది ఏమైనా అర్జున్ రావుగారు, మనోరమ గారు పిల్లల ఆలనలో సుఖంగా వున్నారు. వీరి చరిత్ర చెప్పాలంటే ఇప్పటితో అయ్యేది కాదు.

అర్జున రావుగారు వారి 104 సంవత్సరాల వయసులో ప్రపంచానికి దూరమయ్యారు.



మనోరమ, అర్జునరావుగారు, నేను, మావారు





21, ఏప్రిల్ 2023, శుక్రవారం

ప్రముఖులతో మా కుటుంబం - 80

 ప్రముఖులతో మా కుటుంబం - 80 


సి. భాస్కర రావుగారు, వెనిగళ్ళ వెంకటరత్నం గారు, కె. సదాశివరావుగారు - నరిసెట్టి ఇన్నయ్యగారికి చిరకాల మిత్రులు.



*** (ఈ ప్రముఖులందరూ మా అమ్మాయి ఎంగేజ్ మెంట్ కి వచ్చినప్పటి ఫోటో. ఎడమ నుంచి మొదటివారు భాస్కరరావుగారు, తర్వాత వెంకటరత్నంగారు, పక్కన ఎక్స్ ఎంపి (లేట్) లక్ష్మన్నగారు, చివరగా (లేట్) సదాశివరావుగారు.)***

భాస్కరరావుగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదవీవిరమణ చేసిన తర్వాత సమయాన్ని వివిధ కార్యక్రమాలతో సద్వినియోగం చేసుకుంటున్నారు. నాకు ఇన్నయ్యగారితో పరిచయం అయిన తర్వాత కంప్యూటర్ కి సంబంధించిన ఏ సమస్య అయినా భాస్కరరావుగారిని అడిగితే చాలా ఓపికగా చెప్పేవారు. ఆ విషయంలో ఆయన చాలా విజ్ఞానవంతులు. నాతో అప్పుడప్పుడు కొన్ని వ్యాసాలు టైపు చేయించుకుంటారు.

భాస్కరరావుగారు సంజీవరెడ్డి నగర్ లో వున్నప్పుడు వాళ్ళింటికి తరచు వెడుతుండేదాన్ని. కూకట్ పల్లి బస్ స్టాప్ కి వెనక వున్న నందనవనం అపార్ట్ మెంట్ లో వారి స్వంత ఫ్లాట్ లో వుండేవారు. 2010లో etelugu.org లో ప్రముఖ వ్యక్తిగా వుంటూ... "మీ కంప్యూటర్ కు తెలుగు నేర్పించడం ఎలా?"


https://deeptidhaara.blogspot.com/2010/12/1_17.html అనే విషయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎంతో మంది కంప్యూటర్ లో తెలుగు నేర్చుకునేలా చేశారు. అప్పటి వరకూ ఇంగ్లీషులోనే ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తూ వుండేవి. ఎంతోమంది జర్నలిస్టులకి కూడా ఇది బాగా ఉపయోగపడిందని తెలియజేశారు.

2015 అక్టోబరులో వేదిక సాహిత్యసమావేశం - తెలుగు కథల చర్చా కార్యక్రమం చేశారు. వికీపీడియాకి కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ ఉన్నారు. సంజీవదేవ్ వెబ్ సైట్, నరిసెట్టి ఇన్నయ్యగారి వెబ్ సైట్ ని, సంజీవదేవ్ pageని నిర్వహిస్తున్నారు. ***దీప్తిధార*** వీరి స్వంత బ్లాగ్. 2005 నుంచి నిర్వహిస్తున్నారు. సాహిత్య, సమీక్షలు, శాస్త్రీయ విషయాలు ఇలాంటి ఎన్నోకొత్త విషయాలు తెలుసుకోగలిగిన సమాహారం ఈ బ్లాగ్. చాలా విషయాల పరిశోధనకి ఇది ఉపయోగపడేవిధంగా వుంది.

ప్రతినెల బ్లాగర్ల సమావేశాలు నిర్వహించేవారు.


ఒకసారి
*** ప్రొఫెసర్.జయధీర్ తిరుమలరావు Ph.D. వీరు A.P.Govt Oriental Manuscripts Library & Research Institute లో director గా పనిచేస్తున్నారు.ఇక్కడ ఎన్నో తాళపత్ర గ్రంధాలు, రాగిరేకులపై గల పుస్తకాలను digitalize చేస్తున్నారు. తాటాకులపై గల తిక్కన భారతం లోని భీష్మ పర్వం,పోతన భాగవతము, ఛత్రపతి శివాజి ఫర్మానా వగైరాలు వీరివద్ద ఉన్న కొన్ని ఆకర్షణీయ సంగ్రహాలు. ఇంకా అరబిక్, పారశీక భాషల్లో గల గ్రంధాలు కూడా ఉన్నాయి. ఈ digitization కు ఇరాన్ ప్రభుత్వము వారు సహాయమందిస్తున్నారు. *** https://deeptidhaara.blogspot.com/2007/04/e-april-2007.html
జయధీర్ (భాస్కరరావుగారి పక్కన ఫోటోలో)గారిని గురించి తెలుసుకోవాలంటే పై లింకులో చూడచ్చు.


భాస్కరరావుగారు ***పక్షుల ప్రియులు***. రకరకాల పక్షుల గురించి తెలుసుకోవడానికి అన్వేషణ చేస్తుంటారు. దీనికోసం ఆయన స్నేహితులతో కలసి వివిధ ప్రదేశాల్లో ఉన్న అడవులు, కొండలు, అడవులు ఉన్న ప్రదేశాలలో పర్యటిస్తుంటారు. దీనికి సంబంధించిన రకరకాల పుస్తకాల సేకరణ కూడా చేస్తుంటారు.

వారి శ్రీమతి రమణగారు చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ ఇంటి ముందు ఉన్న ఖాళీస్థలంలో రకరకాల పువ్వుల, కూరగాయల మొక్కలు పెంచేవారు. మొక్కలంటే ఇష్టమైన నాకు అదో కాలక్షేపంగా వుండేది. ఆవిడ మంచి స్నేహశీలి. వాళ్ళు దూరం వెళ్ళిపోయాక చాలాసార్లు రమ్మన్నారు కానీ, నాకు వెళ్ళడానికి కుదరలేదు.

***
***

వెనిగళ్ళ వెంకటరత్నంగారు ఇన్నయ్యగారి పుస్తకాలు కొన్ని చేయించేటప్పుడు నా దగ్గిరకి వచ్చేవారు. ఆయనతో అలా పరిచయం. ఆయనకి చాలా ఓపిక ఎక్కువ. వెంకటరత్నం గారు *** కోరమాండల్ ఫెర్టిలైజర్స్, సికిందరాబాద్ లో అడ్మినిస్ట్రేషన్ లో డెప్యూటీ మేనేజర్*** గా పనిచేసి, పదవీవిరమణ చేశారు.

వీరిని పాత్రికేయులు కూడా. చాలామందికి అలాగే తెలుసు. వీరు చాలా సంవత్సరాలుగా ఆంధ్రప్రభ, ఈనాడు దినపత్రికలకి వ్యాసాలు రాశారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ వ్యాసాలు రాస్తుంటారు. వెంకటరత్నం గారు రచించిన ‘ఆంధ్రాపారిస్’ తెనాలి చరిత్ర ఎంతోమంది మన్ననలు పొందింది. ఎంతోమంది ప్రముఖులని ప్రపంచానికి అందించిన తెనాలిని గురించి తెలుసుకోవాలంటే ఇద చదవాల్సిందే.


*** నార్మన్ ఇ బోర్లాగ్ అధిక దిగుబడి వరివంగడాన్ని సృష్టించి వుండకపోతే ప్రపంచంలో చాలా దేశాలు ఆకలితో అలమటించేవి. ఆయన చేసిన ఈ విశేష కృషికి 1970లో నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఇంత గొప్ప వ్యక్తి మన దేశానికి దాదాపు 20సార్లు వచ్చివుంటారు. 1983 నవంబరులో భారతీయ విద్యాలయం ఆహ్వానం మీద వచ్చిన నార్మన్ ఇ బోర్లాగ్ ను వెనిగళ్ళ వెంకటరత్నం గారు ఇంటర్వ్వూచేశారు. ఇలాంటి ఇంటర్వ్వూ ఇప్పటి వరకూ ఎవరూ చెయ్యలేదని తెలుస్తోంది. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారు బోర్లాగ్ గౌరవార్థం ఒక బంగారు పతకాన్ని, పదివేలరూపాయల నగదును ఢిల్లీలో జరిగే ‘కోరమాండల్ లెక్చర్’ నాడు బహూకరించారు. ***

కొంతమంది రచయితలని కలవడానికి, సమావేశాలకి వెంకటరత్నంగారు మేమూ కలిసి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళినవాళ్ళలో కథా రచయిత, నవలా రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు ఒకరు. ఒకరోజు ఉదయం పదిగంటలకి కోడూరు పుల్లారెడ్డిగారు, వెనిగళ్ళ వెంకటరత్నం గారు, మావారు జానకిరాం గారు, నేను కలవడానికివెళ్ళాం.

******
******

****** ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు (Appellate Collector of Customs and Central Excise, Madras – ఆయన రచనలు ఆకులు రాలే కాలం, చేదు కూడా ఒక రుచే, వానజల్లు, ఎదురద్దాలు). 86 సంవత్సరాల జగన్నాథరావుగారు నరిసెట్టి ఇన్నయ్యగారికి చిరకాల మిత్రులు, సన్నిహితులు. జగన్నాథరావుగారి మాటలలో ఆప్యాయత, కొత్తవారిని కలిశాననే ఆనందం చూస్తుంటే చాలా సంతోషమనిపించింది.


ఎడమ నుంచి మొదటి వ్యక్తి ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు, రెండవవారు కోడూరు పుల్లారెడ్డి గారు, మూడు వెనిగళ్ళ వెంకటరత్నం గారు
ఆయన ఒక యువకుడిలాగా ఆయన జీవిత వివరాలు ఉత్సాహంగా మాట్లాడారు. మళ్ళీ ఇంకొకసారి ఒక చక్కని సాహితీ సమావేశం పెట్టుకుందామన్నారు. అందరం కలిసి ఎక్కడైనా హోటల్లో భోజనం చేద్దాం అన్నారు. ఆయనని కలిసి రావడం మాకు ఒక చక్కని జ్ఞాపకం అనుకుంటుండగానే.... 2017 డిసెంబరు 15 తేదీన ఆయన చాలా సునాయాసంగా నిద్రలోనే కనుమూశారు. ******


10, ఏప్రిల్ 2023, సోమవారం

***(మొన్నటి భాగం తరువాయి) ప్రముఖ సాహితీవేత్త, చిత్రకారులు సదాశివరావుగారితో... ***

***(మొన్నటి భాగం తరువాయి)

 ప్రముఖ సాహితీవేత్త, చిత్రకారులు సదాశివరావుగారితో... ***


Flat 408 అనేది ఆయన పుస్తకాలు చదువుకోవడానికి, పెయింటింగ్స్ వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది. బీరువాల నిండా పుస్తకాలే. వాళ్ళబ్బాయి కూడా ఇక్కడే వుండడంతో అతను ఒకరూంలో తన పని చేసుకుంటాడు. ఆయన ఫ్రెండ్స్ ని కూడా అక్కడే కలుస్తుంటారు. ఆయనకి తోడు కుక్కపిల్ల.


నేను రెండు నెలలుగా వస్తానని చెప్తున్నాను కానీ, కరోనా మూలంగా పెద్ద వాళ్ళ దగ్గిరకి ఎందుకని వెళ్ళలేదు. ఇంక ఆయన ఫోన్ చేసిన రోజు సాయంత్రం 4 గంటలకి వెళ్ళాను. సోఫాలో పడుకుని హాయిగా పుస్తకం చదువుకుంటున్నారు. కుక్కపిల్ల తోకాడించుకుంటూ వచ్చింది. నన్ను చూసి నవ్వుతూ ఓ మాస్కు పెట్టుకుని వచ్చావా.... బాగానే ఫాలో అవుతున్నావుగా అన్నారు. అప్పటికింకా కరోనా పూర్తిగా తగ్గలేదు. 


జేబులోంచి మడత పెట్టిన ఓ చెక్కు తీసి ఊ... ఏదీ లెక్క తెచ్చావా... ఎంతిమ్మంటావు... అంటూ నాకిప్పుడేం చెప్పద్దు. అంటూ రు.15,000/- చెక్కు రాసి ఇచ్చారు. ఆయన ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చారు. ‘’గీతాని రమ్మంటే రాలేదు. మాట్టాడదామనుకున్నాను. ఇదిగో ఈ పుస్తకాలన్నీ చదవడానికి తెప్పించుకున్నాను. చాలా పని వుంది నువ్వు చెయ్యాల్సింది. నా పుస్తకాలన్నీ నువ్వే చెయ్యాలి. కానీ గుర్తు పెట్టుకో... నాకు మాత్రం ఎవరో ఒకళ్ళతో టైంకి పంపించుఅన్నారు. చెక్కు క్లియర్ అయిందా అని ఫోన్ చేస్తూనే వున్నారు. ఆయన నా పేరు డి. నాగలక్ష్మి అనికాకుండా... దామరాజు నాగలక్ష్మి అని రాశారు. రెగ్యులర్ గా వేసే బ్యాంక్ లో అది క్లియర్ అవలేదు. ఆంధ్రాబ్యాంక్ లో దామరాజు నాగలక్ష్మి అని ఉంది. క్లియర్ అయ్యింది. అది కూడా అవకపోతే చూద్దాం అనుకున్నాను. మళ్ళీ వెడదాం అనుకున్నాను.

 

 

తర్వాత డిసెంబరు 7వ తేదీన రాత్రి 9 గంటలకి వెంకటరత్నంగారు ఫోన్ చేసి – “నాగలక్ష్మీ సదాశివరావరావుగారు పోయారుటఅన్నారు.


నేను షాక్. వారం కిందట కలిసిన వ్యక్తి మరి లేడంటే ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒక కొత్త వ్యక్తి తనని కలవడానికి వస్తున్నాడని తెలిసి రోడ్డుమీదకి వెళ్ళి తీసుకువద్దామనుకుని, అతనితో కలిసి కొంతదూరం వచ్చి పేవ్ మెంట్ మీద అతని ఒళ్ళోనే కళ్ళుమూసారని తెలిసి చాలా బాధ కలిగింది. మర్నాడు ప్రపంచంతో సంబంధం లేదనట్టు గాజు పెట్టెలో కళ్ళుమూసుకుని పడుకున్న ఆయన్ని చూడడానికి వెళ్ళాను. కానీ 5 నిమిషాలకన్నా వుండలేక తిరిగి వచ్చేశాను.


***

***


ఒక్కసారి అర్థంకాని ఆయన చేతిరాతతో మేము చేసి పెట్టిన పుస్తకాలు వాటి వెనక జరిగిన విషయాలూ కళ్ళముందు ఒక రీలులా తిరిగాయి.


మొదట్లో కొన్ని వ్యాసాలు ఇచ్చారు. అసలు ఆ రాత చూస్తే భయం వేసింది. కాకపోతే ఒకేలా వుండేది.


ఆయన నోబెల్ బహుమతి విజేతల గురించి అనువాదం చేసి ఇచ్చేవారు. మధ్యలో ఇంగ్లీషు మాటలు కాపిటల్ లెటర్స్ లో రాసేవారు. కొన్ని కొటేషన్స్ కూడా వుండేవి. ఆయన చేతి రాత చాలా అస్సలు అర్థమయ్యేది కాదు. అది చాలా ఇబ్బందిగా వుండేది.


తెలుగు అక్షరాలు పక్షులు ఎగురుతున్నట్లు వుండేవి. ఆయనతో అలాగే అంటే హ్హ హ్హ హ్హా అని నవ్వి చెయ్యి నెప్పమ్మా... అనేవారు.అక్షరం తలకట్టులా వుండేది.అయితే ఒక చిన్న సున్నా తలకట్టు వుండేవి. ఇంకా ఇలాంటివి చాలా వుండేవి. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుని రాసేవాళ్ళం.


ఆయన ఇచ్చిన మేటర్ ని నేను, మా చెల్లెలు గీతా వెల్లంకి చేసేవాళ్ళం. అయితే గీతా ఆయన రాసిన ఇంగ్లీష్ కొటేషన్స్ నెట్ లో కొట్టి చూస్తే మొత్తం వచ్చేది. దాన్ని చూసి చేసేవాళ్ళం. అలా తప్పులు లేకుండా చెయ్యగలిగేవాళ్ళం. నోబెల్ బహుమతి గ్రహీతల వికీపీడియాలు చూసి ఆయన రాసిన వాటిని కొన్నిటిని అర్థం చేసుకునేవాళ్ళం. అయితే ఆయన అమెజాన్ నుంచి పెద్ద పుస్తకాలు తెప్పించుకుని వాటి నుంచీ మేటర్ తయారు చేసి ఇచ్చేవారు. ఇవి కాకుండా ఆయన సైన్స్ ఫిక్షన్ రచనలు కలిపి చాలా మేటర్ - ఎన్ని పేజీలు టైప్ చేశామేమో.... తెలియదు. లక్షరూపాయల పైనే ఆయన పని చేశాం. డబ్బుల విషయంలో లెక్క చెప్పమని ఇచ్చేసేవారు.


ఒకసారి ప్రింట్స్ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. వాచ్ మెన్ ఎవరు కావాలమ్మా!అన్నాడు. సదాశివరావుగారని చెప్పి, “పేపర్లు ఆయనకి ఇచ్చేస్తావా?” అన్నాను.బాబోయ్ ఆయన దగ్గిరకా మేం పోము. నువ్వే పో అమ్మా... పోఅన్నాడు. నేనే వెళ్ళి పేపర్లు ఇచ్చేశాను.


మేము శ్రీనగర్ కాలనీ వచ్చేశాక. ఆయన పుస్తకాలు కొనసాగుతూనే వున్నాయి. ప్రింట్స్ పంపించమని అప్పటికప్పుడు ఫోన్ చేసేవారు. కానీ నేను ఏదైనా అర్జంట్ పనిలో వుంటే వెళ్ళడానికి కుదిరేది కాదు. దానికి ఆయనకి చాలా కోపం వచ్చేది. అప్పట్లో స్విగ్గీలో పేపర్లు పంపే పద్ధతి వుండేది కాదు. మీరే ఎవరినైనా ఏర్పాటు చెయ్యండి అంటే ఎవరూ లేరు అనేవారు. కొన్నిసార్లు ఆయన రైటింగ్ అర్థం కాక తప్పులు వచ్చేవి. అవి మేము అండర్ లైన్ చేసేవాళ్ళం. వాటిని మళ్ళీ రాసి ఇచ్చేవారు.


 పేపర్లు ఆయన ఇంటికి పంపే విషయంలో మాత్రం మా అబ్బాయికి ఇచ్చి పంపమనేవారు. పిల్లలు వాళ్ళపనుల మీద వెళ్ళినప్పుడు ఇచ్చేవారు. చాలా చిరాకు పడిపోతూ నేను ఇంకెవరిచేతైనా చేయించుకుంటాను. మా ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుంటాను. ఒకబ్బాయి వచ్చి చేస్తాడుఅనేవారు. ఆ వాదన తెగేది కాదు. నేను సరే సర్ చేయించుకోండిఅనేదాన్ని. ఆయన చివరికి నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నేనంటే భయంలేదుఅనేవారు.


నెలలో కనీసం నాలుగైదుసార్లన్నా పొద్దున్న 6.30కి ఫోన్ చేసేవారు. అప్పుడప్పుడు ఫోన్ తియ్యడం లేటయితే ఏమ్మా ఇంకా లేవలేదా...? ఇవాళ చాలా పేపర్లు రాశాను. తీసుకెళ్ళు. అలాగే ఇప్పటి వరకూ చేసినవాటికి లెక్క చెప్పు. రాత్రంతా... నేను పుస్తకం చదవడం రాయడం, పుస్తకం చదవడం రాయడం తెలుసా... ఇవాళ వాకింగ్ కి వెళ్ళినప్పుడు మా టింకూ (కుక్కపిల్ల) ని చూసి పిల్లలు భయపడ్డారు అంటూ... పుస్తకాలలోంచి బయట ప్రపంచంలో విషయాలు చాలా మాట్లాడేవారు. ఆయన మాట్లాడేవాటిల్లో రకరకాల ఇంగ్లీషు పుస్తకాలు, తెలుగు రచనలు, పాటల గురించి, తన ఫ్రెండ్స్ గురించి వుంటూ వుండేవి.


గన్అని ఆయన అమెరికా ఫ్రెండ్ గురించి నాకు, చెల్లెలు గీతాకి చెప్పి, ఆయన, ఈయన కలిసి ఒక పుస్తకం రాస్తున్నామని చెప్పారు. ఆయన రాసిన లెటర్లు చూపించేవారు. శనివారం శలవు కాబట్టి గీతాని రమ్మని తను కొన్న పుస్తకాలు చూపించేవారు.


ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆయన లేకపోతే ఆవిడ కాసేపు కబుర్లు చెప్పి, వెనకవైపు పెద్ద పెద్ద సిమెంటు తొట్లలో పెంచిన పాలకూర, సిమెంటు తొట్లలోనే పెరిగిన నిమ్మ చెట్లకి కాసిన అతి పెద్ద నిమ్మకాయలు ఇచ్చేవారు. చెట్టు నిండా పసుపు రంగులో బలే వుండేవి.


వాళ్ళు తీసుకున్న ఫ్లాట్ మూడు డబల్ బెడ్ రూములు కలిపినంత వుంటుంది. వెనకవైపు మొక్కలు కూడా చాలా వుండేవి. ఒకవైపు మూల - ***ఒక అందమైన అద్దాల గది వుంది. అక్కడ రచయితలని, సాహితీవేత్తలని పిలిచి సమావేశాలు జరుపుకునేవారు*** - అని ఆవిడ చెప్పారు. ఆవిడతో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా వుండేది. ఆయన ఒకోసారి ఆవిడకి పేపర్లు ఇచ్చేసి వెళ్ళినప్పుడే ఆవిడ మాట్లాడేవారు.


ఆయన దగ్గిర హిందీ, తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు ఎప్పెటెప్పటివో సినిమాల సిడిలు - పాటల సిడిలు ఇంటినిండా రాక్స్ లో వుంటాయి. ఆయన ఎవరైనా తనకి సంబంధించిన వాళ్ళు వస్తే కూచోపెట్టుకోవడానికి ఒక డ్రాయింగ్ రూం వుంది. బహుశ అక్కడికి పనివాళ్ళని ఎవరినీ రానిచ్చేవారు కాదనుకుంట కొంచెం దుమ్ము దుమ్ముగా వుండేది. అక్కడ సోఫాలో కూచుని ఆయన నాతో మాట్లాడుతుంటే వాళ్ళ కుక్కపిల్ల మధ్యలో నేల మీద కూచుని నావంక ఆయన వంకా చూస్తుండేది. దానికి ఏం అర్థమయ్యేదో తెలియదు. ఆయన పక్కకి వెళ్ళగానే నా దగ్గరికి వచ్చి ఒకసారి కాళ్ళతో నన్ను ఆనుకుని నిలబడి, మళ్ళీ ఆయన రాగానే కదలకుండా కూచునేది. దాని చేష్టలు తమాషాగా వుండేవి.


ఆయన రాసిన పుస్తకాలు పాలపిట్ట వెంకట్ గారు ప్రింట్ చేశారు. ఆయన నోట్లోంచి ఎప్పుడూ వెంకట్ అని వినిపిస్తూనే వుండేది.


సదాశివరావుగారు రచనలే కాకుండా.... మంచి మంచి పాటలు వింటూవుండేవారు. పెయింటింగ్స్ అంటే ఇష్టం. *** లిథోగ్రఫీ *** నేర్చుకున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప చిత్రకారుల దగ్గిర వాళ్ళ పెయింటింగ్స్ కొని ఆర్థికంగా వాళ్ళకి ఎంతో సహాయపడ్డారు. ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. ఆయన నేర్చుకోని విషయంలేదు.


***

***


*** లిథోగ్రఫీ అనేది ఒక ప్రింటింగ్ విధానం - మొదట, లితోగ్రాఫిక్ రాయిపై (సాధారణంగా సున్నపురాయి) ఒక చిత్రం గీస్తారు లేదా చెక్కుతారు.






లితోగ్రఫీ

ఈ రాయిని నైట్రిక్ ఆమ్లం. అరబిక్ గమ్ అనే పలుచని పొరతో కప్పబడి ఉంటుంది. దీనిమీద డ్రా అయిన భాగాలు మాత్రమే కనిపిస్తాయి. గీసిన భాగాలకి సిరా పూస్తారు. ప్రతి రంగుకీ వేరే రాయి వాడతారు. దీనిమీద పేపరు పెట్టి ఒత్తిడి చెయ్యడం ద్వారా పేపరు మీద బొమ్మ వస్తుంది.


ఇంచుమించు ఇది ఇప్పటి స్క్రీన్ ప్రింటింగ్ లాగే వుంటుంది. ఇప్పుడు వచ్చిన ఆఫ్ సెట్ ప్రింటింగ్ వలన ఇది మరుగున పడిపోయింది.***

***

***


ఇన్ని తెలిసిన సదాశివరావుగారు ఒక్కసారి మాయమవడం చాలా ఆశ్చర్యాన్ని బాధని కలిగించింది. అప్పుడు నేను రాసిన కవిత


*** ఇంతేనేమో... ***

అంతా నిశ్శబ్దం

ఇల్లంతా నిశ్శబ్దం

సగం రాసిన కాయితాలు

ఇక నింపేదెవరో తెలియక రెపరెపలాడాయి

అరుపుల్లాంటి మాటలు అక్కడ లేవు

అడుగుల చప్పుడుకు గడగడలాడే సేవకులు

ధైర్యంగా నిలబడ్డారు

లాఠీలాంటి చేతి వూతపు కర్ర

విశ్రాంతిగా మూలకూచుంది

తొలి పొద్దునుంచీ మలిపొద్దు దాకా

అంటి పెట్టుకుని తిరిగే కుక్కపిల్లకి

తన మిత్రుడిని మృత్యువు కౌగిలిలోకి తీసుకుని

కదలనీయట్లేదని తెలియక

ఇల్లంతా కుయ్ కుయ్ మంటూ

కలయతిరుగుతోంది

ఏదో చెయ్యాలని, ఇంకా ఏవో సాధించాలనే

తాపత్రయాలు ఎటుపోయాయో ఆ మనిషికి

తనకేమీ పట్టనట్లున్న ఆ నిస్తేజపు శరీరం

కొద్ది గంటలలో బూడిద కాబోతోందని మాత్రం

అందరికీ తెలుసు

అశ్రునివాళిని అందించారు

రేపు మళ్ళీ వస్తుంది

కాలచక్రం తిరిగిపోతుంది

ఆనవాళ్ళు చెరిగిపోతాయి

(ఇవాళ సదాశివరావుగారిని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ శ్రీమతిని, అబ్బాయిని పలకరించి ఆ శరీరాన్ని చూడలేక 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేశాను)