23, నవంబర్ 2022, బుధవారం

*** అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ - పెళ్ళి పెద్దనయ్యాను *** 61

 

*** అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ - పెళ్ళి పెద్దనయ్యాను *** 61



నేను ఇంక ఇంటి పట్టునే వర్కు చేసుకుంటున్నాను. నాకు చాలా హాయిగా, ప్రశాంతంగా వుంది. పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ చదువులు, వాళ్ళ హడావుడి వాళ్ళకి సరిపోతోంది.

ఇంచుమించు నాలుగైదురోజులకి ఒకసారి మా ఇంటి దగ్గరికి సేల్స్ ఆవిడ పద్మ వస్తూ వుంటుంది. చూడడానికి చాలా సన్నగా వుంటుంది కానీ చకచకా నడుచుకుంటూ తిరిగేస్తుంది. దూరాలు మాత్రం బస్సుల్లో వెడుతుంది. ఆవిడ తీసుకు వచ్చేవాటిల్లో రకరకాలు వుండేవి. వాటిల్లో తినే చెక్కలు, స్వీట్స్ అన్నీ వుండేవి. పిల్లలకోసం ఏదోఒకటి తీసుకునేదాన్ని. అలా వచ్చినప్పుడు నేను ఖాళీగా వుంటే కాసేపు కూచుని కబుర్లు చెపుతూ వుండేది. ఆవిడకి రకరకాల కష్టాలు. ఎవరి కష్టాలు తీర్చలేం కానీ, ఒకోసారి ఇలాంటి వాళ్ళకి కొందరితో చెప్పుకుంటే వూరటగా వుంటుంది. అలాంటి వాళ్ళలో నేనొకదాన్ని అయ్యాను.

సరే మాటల మధ్యన మా అమ్మాయి వుంది. ఉద్యోగం చేస్తోంది. ఏదైనా సంబంధం వుంటే చెప్పమంది. సరే అనేసి వూరుకున్నాను. అలాగే వచ్చినప్పుడల్లా చెప్తోంది. అసలే నాకు టైం వుండదు. సంబంధాలు ఎక్కడ చెప్పాలి అనుకున్నాను.

ఎక్కడవాళ్ళు ఎలా కలుస్తారో తెలియదు.

నేను తెలుగు అకాడమీలో టెంపరరీగా చేసినప్పుడు అక్కడికి ప్రసాద్ అని ఒక అబ్బాయి వచ్చేవాడు. డిగ్రీ తెలుగు మీడియంలో చదివాడు. ఎవరి ద్వారా వచ్చాడో తెలియదు కానీ... మేడమ్ నాకు వర్కు నేర్పిస్తారా... సుధామేడమ్ (తెన్నేటి సుధాదేవిగారు) మిమ్మల్ని కలవమన్నారు అన్నాడు. అలా పరిచయం అయిన ప్రసాద్ నా దగ్గిర వర్కు నేర్చుకున్నాడు. ప్రసాద్ వంట చాలా బాగా చేస్తాడు. ఒకసారి బిర్యాని చేసి అందరికీ తెచ్చి పెట్టాడు.

అప్పుడప్పుడు నన్ను ఇంటికి వచ్చి కలుస్తుండేవాడు. ఏవైనా డౌట్స్ వస్తే తెలుసుకునేవాడు. తనకి అమ్మా, నాన్న లేరు. ఒక అన్నయ్య ఉన్నాడు. వాళ్ళెక్కడో కడపలో వుంటారు. పెద్ద కాంటాక్ట్స్ లేవు. హైదరాబాద్లో వాళ్ళ అక్క వుంటారు. వాళ్ళ దగ్గిర వుంటున్నానని చెప్పాడు. నా దగ్గిర వర్కు నేర్చుకుని ఆంధ్ర సారస్వత పరిషత్ (తెలంగాణ విడిపోకముందు) లో సి నారాయణ రెడ్డిగారి దగ్గిర జాబ్ చేస్తున్నాడు. ఒకసారి వచ్చినప్పుడు నేను జ్యోతి అని ఒక అమ్మాయి వుంది. మా ఇంటికి వచ్చే సేల్స్ ఆవిడ కూతురు అని వివరాలన్నీ చెప్పాను. వాళ్ళ అక్కావాళ్ళకి చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నన్ను రమ్మని తీసుకుని వెళ్ళాడు. మొత్తానికి అన్ని మాటలూ అయ్యాయి. మా ఇంట్లో పెళ్లి చూపులు. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ మాట్లాడుకున్నారు.

నేను ప్రసాద్ కి ముందరే చెప్పాను. పెళ్ళి అంటే ఎక్కడెక్కడ వాళ్ళమో కలుస్తాము. కొత్తలో బాగానే వుంటుంది. కానీ మెల్లి మెల్లిగా ఇద్దరి ఆలోచనలు తేడాలు వస్తాయి. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అర్థం అవుతుంది. పెద్దవాళ్ళు కుదర్చినా, ప్రేమించి పెళ్ళి చేసుకున్నా ఇది మాత్రం తప్పకుండా వుంటుంది. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి – “ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయిని విడిచిపెట్టను. ఇద్దరం కలిసే వుంటామనిఅన్నాను. ఎందుకంటే ఆ అమ్మయి వాళ్లు కూడా చాలా కష్టపడ్డారు. నువ్వు అంతేఅన్నాను.

అయ్యో అదేం లేదు. అలాగే మేడమ్ అన్నాడు.

తమ్ముడికి పెళ్ళి కుదిరినందుకు వాళ్ళ అక్కావాళ్ళు చాలా సంతోషించారు. నన్ను బాగా పొగిడారు. నేను చెప్పాను. అలా కుదిరింది. వాళ్ళు సుఖంగా వుండడమే మనం కోరుకుందాంఅని చెప్పాను.

మొత్తానికి సింపుల్ గా సనత్ నగర్ లో పెళ్ళయ్యింది. ఇలా నేను వాళ్ళ పెళ్ళి పెద్దనయ్యాను. ఇద్దరివీ వేరే కులాలు. అయినా పెద్దవాళ్ళు ఇష్టపడి చేశారు. ఆ పెళ్ళికి నేను పిల్లలతో వెళ్ళాను. సి. నారాయణరెడ్డిగారు ప్రసాద్ మీద అభిమానంతో పెళ్ళికి వచ్చారు. ఆశ్చర్యంగా ఆయన పెళ్ళి అయేవరకు ఉండి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి వెళ్ళారు. మొత్తానికి ప్రసాద్ ఒక ఇంటివాడయ్యాడు. ఇద్దరూ సనత్ నగర్ లో జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇల్లు తీసుకుని వుంటున్నారు. వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు.

ఒక రోజు జ్యోతి వాళ్ళ అమ్మ పద్మ వచ్చి మా వారు ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని ఏడుస్తూ చెప్పింది. చివరికి అర్థం అయ్యింది ఏమిటంటే విజయవాడ వెళ్ళిపోయాడని, అక్కడ ఇంకో పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది. ఇంక జ్యోతి తమ్ముడిని పెట్టుకుని ఉంటోంది. ఒకోసారి ఆడవాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయో తెలియదు. రోజులు గడిచిపోతున్నాయి. పద్మగారికి ఏదో అసంతృప్తి మొదలైంది. ఆవిడ వుండేది అతి చిన్న సొంత ఇల్లు. ఆవిడకి వచ్చేది సరిపోతుంది.

ఏదో చిన్న చిన్న విషయాల్లో కూతురికి, అల్లుడికి గొడవలకి కారణమైంది. మెల్లి మెల్లిగా అన్నీ రాజుకుంటున్నాయి. ప్రసాద్ పాపం వచ్చి అన్నీ చెప్తుండేవాడు. నేను ఎక్కువ మాట్లాడకు అని చెప్పేదాన్ని. ఇలా ఇలా వుంటూనే రోజులు గడిచిపోతున్నాయి. జ్యోతి చాలా తెలివైనది. తను చేసే ఉద్యోగంలో మంచి పేరుంది. ధైర్యం చేసి ఆఫీసుకి దగ్గరలో ఒక చిన్న డబల్ బెడ్ రూం ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇనీషియల్ పే మెంట్ కి ఆఫీసు వాళ్ళు 5 లక్షలు వడ్డీ లేకుండా ఇచ్చారు. మిగిలినది ఇద్దరూ కలిసి ఏవో చిట్స్ వేసి అప్పు అనేది ఎక్కువ లేకుండా కొనుక్కున్నారు.

ప్రసాద్ వచ్చి చెపితే చాలా సంతోషమనిపించింది. ఎందుకంటే ఇద్దరివీ ప్రైవేట్ ఉద్యోగాలు. ఎంత గొడవలు అవుతున్నా ఈ విషయంలో ఒక మాట మీద నిలబడ్డారు. సొంతింటి వాడయ్యాడు ప్రసాద్. ప్రసాద్ కూడా ఇంట్లోనే వుంటూ పది మందితో పరిచయాలు పెంచుకుని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్.డి చేసే వాళ్ళ పేపర్లు టైప్ చెయ్యడం, పుస్తకాలు చెయ్యడం చేస్తున్నాడు.

మెల్లి మెల్లిగా తెలుగు యూనివర్సిటీ నుంచి నాటక రంగంలోనూ, తెలుగులోనూ ఎం.ఎ. చేశాడు. తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పిహెచ్.డి. చేసి డాక్టరేట్ సంపాదించుకున్నాడు. నాకు చాలా సంతోషమనిపించింది. జ్యోతి కరోనా టైంలో పిల్లలు ఇంట్లో వుంటే వాళ్ళని చదివించుకోవాలని ఉద్యోగం మానేసింది.

నేను అనుకోకుండా ఒక రోజు వాళ్ళింటి వైపు వెళ్ళి వాళ్ళిల్లు చూసి, పిల్లలతో కొంతసేపు గడిపి వచ్చాను. అపార్ట్ మెంట్ పాతదే అయినా ముచ్చటగా వుంది. జ్యోతి అప్పటికప్పుడు వేసిన వేడివేడి పకోడీ, స్వీట్ పెట్టింది.

అప్పుడప్పుడు సంసారంలో జరిగే చిన్న చిన్న విషయాల గురించి నాకు వచ్చి చెప్తుంటాడు. నేను సంసారంలో ఇలాంటివి తప్పవు ప్రసాద్. ఎలాంటి వాళ్ళకయినా ఏదో ఒక విషయంలో అవుతూనే వుంటాయి.

సద్దుకున్నామా... సద్దుకున్నట్లు. ఒకళ్ళు ఎక్కువ మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు తక్కువ మాట్లాడితే అయిపోతుంది. ఇంక పరిస్థితులు మితిమీరినప్పుడు ఇంక కలిసి వుండలేం అనుకుంటే... బయట విడిగా బతక గలిగే ధైర్యం ఇద్దరికీ ఉండాలి. 70 సంవత్సరాలు వచ్చినా దెబ్బలాడుకునే భార్యాభర్తలు వున్నారు. ఇద్దరూ ఇద్దరు పిల్లలతో ముచ్చటగా వున్నారు. నువ్వు బాగా పైకి వచ్చావుసంతోషంగా వుండండి అని చెప్పాను.

కానీ నా చేతుల మీదుగా పెళ్ళి చేసుకున్న వీళ్లు ఏవో చిన్న చిన్నవి ఉన్నా, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నా బాగా సెటిల్ అయినందుకు సంతోషంగా అనిపించింది. జ్యోతికి మేనేజ్ మెంట్ బాగా తెలుసు. ప్రసాద్ కి ఓపిక ఎక్కువ. తన పని తను చూసుకుంటూ గడిపేస్తాడు.

ఈమధ్య పిహెచ్.డి. చేసి డాక్టరేట్ కూడా సంపాదించుకున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలయ్యాయి. ఓ పెద్దమనిషిగా పేరు తెచ్చుకున్నాడు.

19, నవంబర్ 2022, శనివారం

*** టెక్నికల్ గురువు సి. భాస్కరరావుగారు - యూనీకోడ్ ఫాంట్ కొత్తగా నేర్చుకోవడం, ఇన్నయ్యగారి కుటుంబంతో పెరిగిన సన్నిహితత్వంతో ఉపరాష్ట్రపతి భవన్ కి *** 60

 *** టెక్నికల్ గురువు సి. భాస్కరరావుగారు - యూనీకోడ్ ఫాంట్ కొత్తగా నేర్చుకోవడం - ఇన్నయ్యగారి కుటుంబంతో పెరిగిన సన్నిహితత్వంతో ఉపరాష్ట్రపతి భవన్ కి *** 60

***
ఎస్ ఆర్ నగర్ నుంచి కూకట్ పల్లి వెళ్ళే బస్ స్టాప్ వెనకవైపున అపార్ట్ మెంట్ లో ఉన్న సి. భాస్కర రావుగారు నేను ఇన్నయ్యగారింటి వెళ్తుండడం తెలుసుకుని, నాతో - “నరిసెట్టి ఇన్నయ్యగారి ఇంటికి వెళ్ళేముందు మా ఇంటికి వచ్చి వెళ్ళండి” అన్నారు. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆయన నాతో – “మీరు కొన్ని వెబ్ సైట్లకి, న్యూస్ పేపర్లకి ఇన్నయ్యగారి మేటర్ ఇవ్వాలంటే (ఇప్పుడు ఫేస్ బుక్, బ్లాగ్ లలో, ఫోన్ లలో వస్తున్న తెలుగు) మీరు యూనికోడ్ ఫాంట్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. తెలుగు అనుఫాంట్స్ పనికిరావు. మా ఇంటికి వచ్చి మీరు రెండు రోజులు ప్రాక్టీస్ చెయ్యండి” అన్నారు. ఆయన చెప్పినట్టు కీ బోర్డు ప్రాక్టీస్ చేశాను కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది.

***
*** ఒకే కీబోర్డు మీద అను, యూనీకోడ్ తెలుగు టైపింగ్ ***

*** తెలుగు టైపింగ్ లో మరో అడుగు ముందుకి – కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త గురువు అన్వేషణ ***
***

ఇన్నయ్యగారు నాకు చెప్పే లెటర్లు కానీ, ఏదైనా న్యూస్ పేపర్ కి ఇవ్వాల్సిన మేటర్ కానీ యూనీకోడ్ (అంటే ఇప్పుడు చేస్తున్న తెలుగు ఫాంట్) లోనే వుండేది. నేను తెలుగు ఆపిల్ కీబోర్డు మీద చేసేదాన్ని. ఈ కీబోర్డుతో యూనీకోడ్ ఫాంట్ రాదు. ఏంచేస్తే నేను అనుఫాంట్స్, యూనికోడ్ కూడా చెయ్యగలనని ఆలోచించాను.

నాకు ముందు ఇన్నయ్యగారి ఇంటికి ఒకబ్బాయి వచ్చి వర్కు చేస్తుండేవాడు. అతనికి ఫోన్ చేసి అడిగాను. అతను మీరు DOE Phonetic keyboard లో practice చేస్తే కానీ మీరు అనుయూనీకోడ్ చెయ్యలేరు. మీరు పేజి మేకర్ లో తెలుగు చేసేటప్పుడు ఆపిల్ కీబోర్డు మానేసి డిఒఇ ఫొనెటిక్ కీబోర్డు ప్రాక్టీస్ చెయ్యండి అన్నాడు. *** అను స్క్రిప్ట్ మేనేజర్ లో - మోడ్యులర్, రోమా, యాపిల్, డిఒఇ ఫొనెటిక్*** - ఈ నాలుగు కీబోర్డులు వుంటాయి.

నేను ఇన్నయ్యగారి దగ్గర పనిచెయ్యాలంటే అనుఫాంట్స్ లోనూ, యూనీకోడ్ ఫాంట్ లోనూ రెండింట్లో వర్కు చెయ్యాలి. ఇంక తప్పనిసరి అనుకున్నాను. ఇన్నయ్యగారిని నాకు ఒక నాలుగు రోజులు టైం ఇమ్మని అడిగాను. యాపిల్ కీబోర్డులో shift లో ఉన్న కొన్ని అక్షరాలు DOE Phonetic keyboard లో unshift లో వుంటాయి. అందుకని వేళ్ళు కొంచెం మొరాయించాయి.

ఇంక అదేపనిగా రెండురోజులు మేటర్ ప్రాక్టీస్ చెయ్యడం మొదలు పెట్టాను. మొత్తానికి మూడోరోజుకి DOE Phonetic keyboard నా చెప్పుచేతల్లోకి వచ్చింది. ఇప్పుడు నేను అనుఫాంట్స్ లోనూ, యూనీకోడ్ ఫాంట్ లోనూ యూనీకోడ్ ఫాంట్స్ లోనూ రెండింట్లోనూ వర్కు చెయ్యగలుగుతున్నాను. కీబోర్డు మీద విజయపతాకం ఎగరేశాను. ఇంక ఇన్నయ్యగారు ఎలా చెప్పినా నేను చెయ్యగలుగుతున్నాను. ఇదొక కొత్త అడుగు.

***
*** Gmail లో అకౌంట్ – Google documents లో పరిశోధన
***

నేను భాస్కరరావు గారి దగ్గిరకి వెళ్ళినప్పుడు మీకు gmail ఉందా అని అడిగారు. అప్పటి వరకూ జిమెయిల్ అంటే నాకు తెలియదు. యాహూ వుంది. ఇది లేదని చెప్పాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. *** 1998 సెప్టెంబర్ 4 న గూగుల్ ప్రారంభమయితే, 2004 ఏప్రిల్ 1న gmail*** ని ప్రారంభించారు. నాకు gmail కొత్తేమరి. అంతే నేను వెంటనే gmail లో ఎకౌంట్ create చేశాను.
***
*** skype లో వీడియో కాల్ - గూగుల్ డాక్యుమెంట్ లో టైపింగ్ - టెక్నాలజీలో మరో ముందడుగు వేశాం ***

*** కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి అవతలి వ్యక్తి మనం చేస్తున్న మేటర్ చూడగలిగే టెక్నాలజీ***
***

ఇన్నయ్యగారూ వాళ్ళు ఇండియా వదిలే టైముకి నేను యూనీకోడ్ ఫాంట్ లో పర్ఫెక్ట్ అయిపోయాను. ఇన్నయ్యగారు వాళ్ళు 2010లో పూర్తిగా అమెరికా వెళ్లిపోయారు. నాకు ఆయన అక్కడ నుంచీ మేటర్ డిక్టేట్ చేస్తుండేవారు. ఇద్దరం skype లోకి వచ్చేవాళ్ళం.

లేకపోతే gmail వీడియో ఛాట్ లోకి వచ్చేవాళ్ళం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళకి కనిపిస్తాయి. నా ఎదురుగా కూచుని చెప్తున్నట్లే వుండేది. నేను గూగుల్ డాక్యుమెంట్స్ లో టైప్ చేసేదాన్ని. ఎందుకంటే అందులో టైప్ చేస్తే auto save అవుతుంది. మనకి మేటర్ పోతుందని భయం వుండదు. నేను ఆయనకి గూగుల్ డాక్యుమెంట్స్ లో share చేసేదాన్ని.

ఒకరోజు నేను ఇన్నయ్యగారు చెప్పిన మేటర్ నేను సరిగ్గా వచ్చిందో లేదో చూస్తున్నాను. నేను షేర్ చేసిన మేటర్ ని ఆయన చూస్తున్నట్టు నాకు కనిపించింది. ఓహ్.... అనుకుంటూ... నేను ఆయనకి ఫోన్ చేసి సర్ మీరు నాకు చెప్పబోయే మేటర్ హెడ్డింగ్ పెట్టాక నేను మీకు ఫైల్ share చేస్తాను. అప్పుడు నేను చేసేది మీకు కనిపిస్తుంది. తప్పులు వుంటే అక్కడే చెప్పచ్చు అని చెప్పాను.

ఆశ్చర్యపోవడం ఆయన వంతయ్యింది. వర్కు మొదలు పెట్టాక నేను షేర్ చేసిన ఫైల్ ఓపెన్ చేసి – నేను టైప్ ఆయన చూడ్డం మొదలు పెట్టారు. అప్పటికప్పుడు కరక్షన్స్, మార్పులు అయిపోయేవి. ఇన్నయ్యగారు చాలా సంతోషించారు. ఇద్దరం అలా కొన్ని పుస్తకాలు, లెక్కలేనన్ని వ్యాసాలు చేశాం.

***

ఇన్నయ్యగారి పుస్తకాలన్నీ మా ఇంట్లోనే వున్నాయి. ఆయన పుస్తకాలు ఈ మధ్య ప్రజాశక్తి వాళ్ళు ఆయన పుస్తకాలు అమ్మిన డబ్బు 5000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా కావాలంటే మమ్మల్ని అడుగుతుంటారు. వాటిని మేము పంపిస్తాము. అన్ని పుస్తకాలు అన్ని కాపీలు లేవు. ఈమధ్య ఒక 25 సంవత్సరాల అబ్బాయి రాజమండ్రి నుంచి ఏ పుస్తకాలు కావాలంటే అవి ఇమ్మని అడిగాడు. పంపించే ప్రయత్నంలో ఉన్నాం. డబ్బులు గూగుల్ పే చేస్తానని చెప్పాడు.

***

వాళ్ళ కుటుంబం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇన్నయ్యగారు, కోమల గారూ ఎంత ప్రేమగా వుంటారో... వాళ్ళమ్మాయి నవీన ఇంకా... ఓపికగా వుంటారు. తన మొహం మీద చిరునవ్వు, ఓపికగా ఆచితూచి మాట్లాడే మాటలు చూస్తే ఎవరికైనా గౌరవం కలుగుతుంది.

వాళ్ళ అబ్బాయి రాజు నరిసెట్టి కూడా నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఎటువంటి గర్వం లేకుండా మాట్లాడటం నాకు సంతోషంగా అనిపించింది.




రాజు నరిసెట్టితో నేను

ప్రముఖులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారితో నేను

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారి శ్రీమతి ఉషాగారితో


ఉపరాష్ట్రపతి భవన్ లో మురళీధర్, రాజు నరిసెట్టి, వెంకటరత్నం, ఇన్నయ్యగార్లతో నేను

పర్వతారోహకురాలు నీలిమ పూదోట

ఇన్నయ్యగారి కుమార్తె నవీన ప్రముఖ చిల్డ్రన్స్ సైక్రియాటిస్ట్, అమెరికా

ఉపరాష్ట్రపతి భవన్ బయట

రాజు నరిసెట్టికి అవార్డుని అందిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు


రాజుకి ***ఎన్.ఆర్. చందూర్ అవార్డు*** ఇచ్చినప్పుడు నేను ***ఉపరాష్ట్రపతి భవన్*** కి వెళ్ళే అవకాశం వచ్చింది.

నరిసెట్టి రాజు అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలైన - మింట్,మేనేజింగ్ డైరెక్టర్ - వాషింగ్టన్ పోస్ట్, మేనేజింగ్ ఎడిటర్ - వాల్ స్ట్రీట్ జర్నల్, వైస్ ప్రెసిడెంట్ - న్యూస్ కార్పొరేషన్, న్యూయార్క్ సంస్థలలో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ తెలుగుతేజం అమెరికాకు చెందిన ప్రముఖ గిజిమోడో మీడియా గ్రూప్ సంస్థ సి.ఇ.ఓ. పీఠాన్ని అలంకరించారు. తెలుగుజాతి గర్వించదగిన ప్రముఖ జర్నలిస్టు రాజు నరిసెట్టికి ఉపరాష్ట్రపతి ఐన వెంకయ్యనాయుడు గారు ఈ ఏడాదికి గాను ఎన్.ఆర్. చందూర్ జగతి పురస్కారాన్ని ఢిల్లీలోని వారి కార్యాలయంలో అందించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు ఈ పురస్కారాన్ని అందిస్తుంది.


ఈ కార్యక్రమానికి నేను హాజరవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.
అక్కడ మాకు - ఇన్నయ్యగారి స్నేహితులు వెంకటరత్నంగారు, చంద్రశేఖర్, నేను, హిమాలయపర్వాతాల్ని అధిరోహించిన పూదోట నీలిమ- ఢిల్లీ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట్రావుగారు, వారి సతీమణి మాకు వారి ఇంటికి ఆహ్వానించి చక్కటి ఆతిథ్యాన్ని అందించారు.

సాయంత్రం 5.30 గంటలకి ఉపరాష్ట్రపతి కార్యాలయంలో కన్నుల పండువుగా జరిగిన పురస్కార కార్యక్రమానికి హాజరయ్యాం. వెంకయ్యనాయుడుగారి సతీమణి ఉషా గారు ఒక సామాన్య వ్యక్తిగా మాతో కలిసిపోవడం ఆనందించదగ్గ విషయం. తదనంతరం జరిగిన తేనీటి విందుకు ఆవిడ అందర్నీ ఆహ్వానించి ప్రతి వ్యక్తినీ పలకరిస్తూ అతిథి మర్యాదలు పాటించడం చెప్పుకోదగ్గవిషయం.


రాత్రి 9.00 గంటలకు ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ రచయిత, మాజీ ఎం.పి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వారు అతిథులని ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారికి కావలసిన పదార్థాలు ఆయనే అందించడం గర్వించదగ్గ విషయం. నేను ఆయన రచించిన 'ఆవేదనాభరితం - అబలా జీవితం' అనే పుస్తకాన్ని డిటిపి చేసి ఇచ్చాను. అది ఆయన గుర్తు చేసుకున్నారు.


పూదోట నీలిమ చిన్నవయసులోనే మొదటగా హిమాలయ పర్వతాల్ని అధిరోహించింది. ప్రపంచంలో పర్వత శ్రేణులన్నింటిని అవలీలగా అధిరోహిస్తున్న నీలిమ తెలుగుజాతి గర్వించదగ్గ అమ్మాయి.


ఈ కార్యక్రమంలో ఇన్నయ్యగారు, వారి కుమార్తె నవీన, అవార్డు గ్రహీత రాజు నరిసెట్టి చాలా చక్కగా మమ్మల్ని ఆదరించడం ఆనందాన్ని కలిగించింది. మొత్తానికి ఢిల్లీ 21వ తేదీ ఉదయం విమానంలో వెళ్ళి 22వ తేదీ ఉదయం విమానంలో హైదరాబాదుకు విజయవంతంగా చేరుకున్నాం.


ఇన్నయ్యగారి ద్వారా హేతువాదులు కాని వాళ్ళు కూడా ఎంతోమంది మహామహులు పరిచయం అయ్యారు. నాకు వాళ్ళని కలిసే అవకాశం కలిగింది.


వాళ్ళు అనుకోకుండా అమెరికా వెళ్ళినప్పుడు ఇండియాలో వాళ్ళకి సంబంధించిన పనులు చేసిపెట్టాను. కోమల గారు, ఇన్నయ్య గారు నాకు పుస్తకాలు చేసినందుకు ఇచ్చిన డబ్బులు కన్నా వాళ్ళు చేసిన సాయం చాలా ఎక్కువ. మా, మా పిల్లల అభివృద్ధిని చూసిన వాళ్ళలో ఇన్నయ్యగారి కుటుంబం ఒకటి.

వాళ్ళు కూడా ఎన్నో ఒడుదుడుకులని తట్టుకుని సెటిల్ అయివాళ్ళే. వాళ్ళ అమ్మాయి నవీన ఛిల్డ్రన్స్ సైక్రియాట్రిస్ట్ గా, అబ్బాయి ఒక గొప్ప జర్నలిస్టుగా అమెరికాలో బాగా సెటిల్ అవడానికి వాళ్ళ కృషిని మనం అంచనా వెయ్యలేం. ఇన్నయ్యగారి కుటుంబంతో నాకున్న అనుబంధం, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి రాయాలంటే చాలానే వుంది.

11, నవంబర్ 2022, శుక్రవారం

*** ఇన్నయ్యగారి ఇంట్లో అందమైన జ్ఞాపకాలు *** - 59

 *** ఇన్నయ్యగారి ఇంట్లో అందమైన జ్ఞాపకాలు *** - 59


ఇన్నయ్యగారు, కోమల గారు (ప్రపంచాన్ని వీడి డిసెబరుకి సంవత్సరం)

ఇన్నయ్యగారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను పైన రూంలో వర్కు చేస్తుంటే మధ్యాహ్నం ఆయన చెరోచేత్తో చెరో టీ కప్పు పట్టుకుని కాలుతో మెయిన్ డోర్ తోసుకుని వచ్చేవారు. నేను వర్కులో ఉన్నప్పుడు చూసేదాన్ని కాదు. రెండు మూడుసార్లు అలా జరిగింది. ఒకసారి తలుపుకొట్టిన చప్పుడయ్యిందని చూద్దును కదా ఆ దృశ్యం కళ్ళబడింది. నాకన్నా దాదాపు 26 సంవత్సరాలు పెద్దాయన అలా తేవడం చూసి ఇబ్బంది పడ్డాను.

అప్పటి నుంచీ “కింద నుంచీ ఫోన్ లో పిలవండి సర్ నేను వచ్చి తీసుకుంటాను” అని చెప్పాను. కోమల గారు రోజూ ఏదో ఒక చిరుతిండి టీతో బాటు ఇచ్చేవారు. నాకు ఒక విషయం నవ్వు తెప్పిస్తుంది. ఒకరోజు ఇన్నయ్యగారు నా చేతిలో ఒక కాయితం పొట్లం పెట్టారు. నేను బయటికి వెళ్ళాక చూశాను. అందులో ఖర్జూరపు పళ్ళున్నాయి. ఒక్కసారి చిన్న పిల్ల చేతిలో పెట్టినట్లు అనిపించింది. ఒకరకమైన అనుభూతి. వాళ్ళిద్దరూ కూడా నన్ను చిన్నపిల్లలాగే చూసేవారు.

నేను కిందకి వెళ్ళి టీ తీసుకుని పైకి వచ్చినప్పుడు. ఇంటిని ఆనుకుని చెట్లకిందకి వచ్చేలా ఒక అరుగు వుండేది. ఆ అరుగు మీద కూచుని టీ తాగేదాన్ని. అలా కూచున్నప్పుడు ఎండిన చెట్ల ఆకుల మీద ఉడతలు పరుగులు తీస్తుంటే ఆ శబ్దం చాలా వింతగా, వినసొంపుగా వుండేది. అప్పుడప్పుడు ఎండిన ఆకులు గాలికి సుడులు తిరుగుతూ రాలుతుండేవి. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి చిన్న చిన్న పక్షులు ఎగురుతూ ఆటలాడుతుండేవి. మల్లెపందిరి మీద విచ్చుకున్న పువ్వుల వాసన గాలితో అలా అలా ముక్కుపుటాలని తాకి వెళ్ళేది. చెట్ల చాటు నుంచి సూర్యకిరణాలు పచ్చటి ఆకుల మీద పడి అకుల పచ్చదనం మరింత ఎక్కువగా కనిపించేది.

గోడపక్కన ఉన్న కుంకుడు చెట్టు మీద నుంచీ కాయలు టపటపలాడుతూ కిందపడుతుండేవి. ఆ చప్పుళ్ళకి చెట్టుకింద ఉన్న ఉడతలు పరుగులు పెట్టేవి. ఆ చప్పుళ్ళు విని నాకు – కృష్ణదేవరాయలు పూరించమని ఇచ్చిన పద్యపాదం “జంబూఫలాని పక్వాని - పతంతి విమలే జలే – కపికంపితశాఖాభ్యో - గుళు గుగ్గుళు గుగ్గుళు” గుర్తుకు వచ్చింది.

కుంకుడు చెట్టు పక్కనే ఒక ఔట్ హౌస్ వుండేది. అందులో వాళ్ళ పనిమనిషి వుంటుంది. ఆ ఔట్ హౌస్ పక్కన మెట్లున్నాయి. ఆ మెట్ల మీద నుంచి పైకి వెడితే కొండ బల్లపరుపుగా వుండేవి. రకరకాల మొక్కలు వుండేవి. అక్కడ నుంచీ కొంచెం ముందుకి వెడితే కొంతదూరం వెళ్ళి అగిపోయిన ఒక కొండ దారి, ఆ కొండని మలిచారా అన్నట్టు చిన్న చిన్న కొండలు కూచునేందుకు వీలుగా వున్నాయి. అక్కడ కూచుని టీ తాగుతూ, ఒక పుస్తకం చదువుకుంటూ వుంటే ఎంత బావుంటుంది అనిపించింది.

నాకయితే ఒక రోజు రాత్రి ఆ ఇంట్లో వుండి పొద్దున్న ఆ చెట్ల కింద కూచుని ఉదయపు అందాలు ఆస్వాదించాలనిపించేది. వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆ చెట్ల అందాలు ఆస్వాదించేదాన్ని.
వాళ్ళు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కోమలగారు అనువదించిన “కాళరాత్రి” పుస్తకం ఇన్నయ్యగారి ఇంటి పైన స్థలంలోనే జరిగింది. – ప్రస్తుతం వాళ్ళ ఇల్లు కొనుక్కున్న అక్షర పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా దాన్ని చేసుకున్నారు. నేను వర్ణించిన అందాలు ఇప్పుడు లేవు.

***

ఇన్నయ్యగారింట్లో పైన చాలా పుస్తకాలతో ఒక లైబ్రరీ వుండేది. అక్కడ రకరకాల పుస్తకాలు వుండేవి. ఎప్పుడైనా ఆ పుస్తకాలు చూస్తుండేదాన్ని. హేతువాదం, నాస్తికత్వం, రాజకీయాలు, సైన్స్ కి సంబంధించిన ఎన్నో పుస్తకాలు - ఆయన చేసి హేతువాద ఉద్యమ కార్యక్రమాలకి సంబంధించిన సిడిలు, ఫోటోలు వుండేవి. ఒక వ్యక్తికి నచ్చిన విషయంలో రకరకాల పరిశోధనలు చేసి, పుస్తకాలు రాసి దానికోసం కృషి చెయ్యడమనేది గొప్ప విషయం. ఆయన రచనల్లో ఒక అనుభవమున్న పాత్రికేయుడుగా రాసిన పుస్తకాలు చాలా నేను చేశాను.

అందరి దగ్గర నుంచీ నేర్చుకునే విషయాలు చాలానే వుంటాయి. మనకి నచ్చిన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీడియా చేతిలో ప్రపంచం ఉంది కాబట్టి మనం అడక్కుండానే అన్ని విషయాలు మన కళ్ళముందుంటున్నాయి. నేను నా జీవనయానంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇన్నయ్యగారి పుస్తకాలకి స్టేట్ ఆర్కైవ్స్ వాళ్ళు ఒక పూర్తి ర్యాక్ ఇచ్చారు. ఆయన వ్యాసాలు పడిన ప్రతి న్యూస్ పేపర్, రచించిన ప్రతి పుస్తకం అక్కడ ఉంది.

ఇన్నయ్యగారు ఏదైనా విషయం చెప్తూ మనం దాన్ని సరిగ్గా గ్రహించలేదు అన్నప్పుడు ఆయనకి కోపం వచ్చినా... ఇది ఇక్కడతో వదిలేద్దాం అని మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు. ఒక రెండురోజులు ఫోన్ కూడా చెయ్యకుండా వుండి. మళ్ళీ మూడో రోజున ఫోన్ చేసి వర్కు చెయ్యడానికి రమ్మనేవారు. మొహం మీద తిట్టేవాళ్ళకన్నా ఇలా మాట్లాడకుండా ఉండేవాళ్ళంటే భయం ఎక్కువ వుంటుంది. మనం తర్వాత వాళ్ళని నెమ్మదిగా అడిగి మన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం వుంటుందని నా అభిప్రాయం. ఇన్నయ్యగారికి సంబంధించిన ఎన్నో పుస్తకావిష్కరణలలో, కార్యక్రమాలలో నేను కూడా పాల్గొన్నాను. కొన్నింటికి నిర్వహణాబాధ్యత నాకు అప్పగించారు.

6, నవంబర్ 2022, ఆదివారం

ఆనందంగా ఇంటికి - 58

 

ఆనందంగా ఇంటికి - 58



యూనివర్సిటీకి బై చెప్పేసి ఆనందంగా ఇంటికి వచ్చాను. పిల్లలు కూడా అమ్మ మన ఎదురుగానే వుంటుంది కదా అని సంతోషించారు. రాత్రికి అస్సలు ఏ వర్కులు ముట్టుకోలేదు. పిల్లలతో కబుర్లు చెపుతూ గడిపాను.

పొద్దున్నే పిల్లల్ని స్కూలుకి పంపించి, నేను మళ్ళీ మైండ్ సెట్ చేసుకుని వర్కులు చేసుకుందామనుకుంటుండగా... నరిసెట్టి ఇన్నయ్యగారికి, మావారికి కంబైండ్ ఫ్రెండ్ ఇసనాక మురళీధర్ “నాగలక్ష్మి గారూ... ఏం చేస్తున్నారు? ఏంటి యూనివర్సిటీకి గుడ్ బై చెప్పేశారుట కదా...!” అనుకుంటూ వచ్చారు. నేను “అవునండీ... మీరేంటిలా వచ్చారు?” అన్నాను.

"ఏమీ లేదు నరిసెట్టి ఇన్నయ్యగారు, కోమల గారు ఇద్దరూ పుస్తకాలు రాస్తున్నారు. మీ గురించి చెప్పాను. ఇన్నయ్యగారేమో ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు” అన్నారు.

ఇంతలోకే మా వారు "రేపు పొద్దున్న ఇద్దరం కలిసి వస్తాం. మీరు కూడా అక్కడికి రండి" అని అడ్రస్ తీసుకున్నారు.

ఇంక నాకు మాట్లాడే అవకాశం లేదు.

బల్కం పేట నుంచీ పొద్దున్న నేను, మా వారు కలిసి ఆటోలో సారధీ స్టూడియోస్ బస్ స్టాప్ కి వెళ్లాం. నాకేమీ తెలియదు కాబట్టి ఆయన్ని ఫాలో అయిపోయాను. అక్కడ షేర్ ఆటో ఎక్కాలన్నారు. ఎక్కాం. ఆటోలో కూచున్నాక ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేలోపున అరకిలోమీటరు దూరం తీసుకుపోతున్నాడు. ఒయ్యారాలు పోకుంటూ రోడ్డు మీద ఆ ఆటో పోయే ఆ స్పీడు చూస్తే నాకు కళ్ళుతిరిగినంత పనయ్యింది. మధ్య మధ్యలో గాలిలోకి కూడా లేచినట్టనిపించింది. దేనికో గుద్దేస్తాడని గట్టిగా కళ్ళుమూసుకుని కూచున్నాను. జూబిలీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరమాత్రం ట్రాఫిక్ వుంది కాబట్టి ఆపాడు. కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. మొత్తానికి జర్నలిస్టు కాలనీ బస్ స్టాప్ దగ్గర ఆపాడు. ఆ ఆటో అతన్ని చూస్తుంటే కోపం వచ్చేస్తోంది. మావారు అతనికి డబ్బులు ఇచ్చి, “మనం ఇటే వెళ్ళాలి” అన్నారు.

ఎటెళ్ళడమో ఏమో.... కానీ... అమ్మో... నేను మళ్ళీ ఈ రూటులో రాకూడదు. అసలే అవసరమైతే రోజూ అక్కడికే వచ్చి కొంతసేపు టైప్ చెయ్యాలని కూడా చెప్పారు. ఇంత దూరం. పైగా ఆ ఆటో స్పీడు తట్టుకోవడం నా వల్ల కాదు. వెళ్ళి కలిసేసి నేను రానని చెప్పేస్తే సరి - అనుకుంటూ మా వారిని అనుసరించాను.

వాళ్ళ గేటులోకి అడుగు పెట్టగానే... ఎడమవైపు కుండీల నిండా రంగు రంగుల పువ్వుల మొక్కలు. కొంచెం ముందుకి నడిచి వాళ్ళింట్లోకి వెళ్ళాం. ఇల్లంతా నీట్ గా చక్కగా వుంది. లోపల ఇన్నయ్యగారు, కోమల గారు కూచుని ఉన్నారు. “పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు?” అని అడిగారు. ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్ని పలకరింపులు అయ్యాక ఇన్నయ్య గారు “నేను ఒక పుస్తకం ట్రాన్స్ లేట్ చేస్తున్నాను. అది టైప్ చేసి బుక్ ఫార్మేట్ లోకి తీసుకురావాలి” అంటూ కొన్ని పేపర్లు ఇచ్చారు.

“నా రైటింగ్ అర్థమవుతుందా చూడండి, రాయడానిక కొంచెం కష్టం గానే వుంది. నేను చెప్తుంటే టైప్ చేస్తే ఇంకా బావుంటుంది” అన్నారు. నేను ఏమీ మాట్లాడలేదు. “ఆలోచించి చెప్పండి” అని, “మురళీ నాగలక్ష్మికి పైన కంప్యూటర్ రూం చూపించు” అన్నారు.

మురళీధర్ పైన కంప్యూటర్ రూంకి రమ్మని దారితీశారు. బయటికి వచ్చి పక్కనే ఉన్న మెట్ల మించి పైకి వెడితే పైనంతా రకరకాల మొక్కలు. కిందకి వంగిపోయిన పెద్ద పెద్ద మామిడి, జీడిమామిడి చెట్లు, మల్లెపందిరి, అన్నిటికీ మధ్యలో అప్పుడే నిండా పిందెలు ఉన్న పనస చెట్టు బలే వుంది. వాటి వెనక చక్కటి ఇల్లు. నాకు బలే నచ్చేసింది.

కంప్యూటర్ వుండే రూం చూపించారు. ఇంక సరే ఆ వర్కు అయ్యే వరకు వద్దామని డిసైడ్ అయిపోయాను.

ఒక ఆఫీసులాగా రానక్కరలేదు కాబట్టి సరే అనుకున్నాను. అందులోనూ కోమలగారూ, ఇన్నయ్యగారూ మాట్లాడే పద్ధతి కూడా బాగా నచ్చింది. పనసకాయలు పెద్దవి అయ్యాక ఇచ్చారు. తేనె పనస అంటారుట. అసలు ఆ రుచి ఎక్కడా చూడలేదు. అవి బాగా పండిపోతే నోట్లోకి జారిపోతాయి తొనలు. (ఇన్నయ్యగారూ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి, అమెరికా వెళ్ళిపోయినా... ఈ సంవత్సరం వరకూ ప్రతి సంవత్సరం పనసకాయలు ఒక ఆటో నిండా తెచ్చుకుని అందరికీ పంచిపెడతాం.)

రేపటి నుంచి వస్తానని చెప్పాను. మర్నాడు పొద్దున్న 10.00 గంటలకి రమ్మన్నారు. చిన్న చిన్న స్క్రీన్ ప్రింటర్స్ అందరూ బయట ఎక్కడెక్కడో చేయించుకుంటున్నారు. పుస్తకాలు చేయించుకునేవాళ్ళు మాత్రం నేను మళ్ళీ ఇంట్లో చేస్తున్నాను అనగానే వచ్చి కలుస్తామన్నారు. అందుకని నేను నిశ్చింతగానే వున్నాను.

తెల్లారింది. పిల్లల పనులు చూసేసి, నేను బల్కంపేట నుంచి సారధీ స్టూడియోస్ బస్ స్టాప్ వరకు (3 కిలోమీటర్లు) నడుచుకుంటూ వెళ్ళాను. ఇప్పుడున్నన్ని బస్సులు అప్పుడు లేవు. మా వారు బస్ ఎక్కమన్నారు కానీ, ఏ బస్ ఎక్కాలో తెలియలేదు. అన్ని బస్ లు ఫుల్ గా వస్తున్నాయి. టైం 10 అయిపోయింది. మొత్తానికి ధైర్యం చేసి షేర్ ఆటోనే ఎక్కి నేను వెళ్ళేసరికి ఇన్నయ్యగారు నాకోసం ఎదురు చూస్తూ కూచున్నారు.

ఆయన రోజూ కొంత కొంత మేటర్ పక్కన కూచుని చెప్తుంటే ఒక పది రోజులలో పుస్తకం పూర్తిచేశాం. కోమల గారు ‘వైల్డ్ శ్వాన్స్’ అనే పుస్తకం ‘అడవికాచిన వెన్నెల’ తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం కూడా చేశాను. చైనాలో ఒక తల్లి, కూతురు, మనవరాలు పడిన కష్టాలు. చైనాలో వాళ్ళ జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో... తెలియచేస్తుంది. చాలా అద్భుతమైన పుస్తకం. చక్కటి అనువాదం. దీనికి ముప్పాళ రంగనాయకమ్మగారు చాలా రివ్యూ ఒక పుస్తకంగా రాశారు.

ఇవయిపోయిన తర్వాత కోమల గారివి, ఇన్నయ్యగారివి చాలా పుస్తకాలే చేశాను. మా ఇంట్లోనే వర్కు చేసుకుంటూ, చేసి ఇచ్చేదాన్ని. అప్పుడప్పుడు ఏమైనా వ్యాసాలు, లెటర్లు వుంటే రమ్మనేవారు. పదిహేను రోజులకి ఒకలెక్క చెప్పమని వాటికి డబ్బులు ఇచ్చేసేవారు. అలా నాకు వాళ్ళ కుటుంబంతో సన్నిహితత్వం అలవాటయిపోయింది.

నేను ఎప్పుడైనా వాళ్ళింటికి వెళ్ళి వచ్చేటప్పుడు మా అమ్మాయి "అమ్మా...! ఎస్. ఆర్. నగర్ లో ఉన్నావా...? నేను వస్తున్నాను. ఇద్దరం కలిసి వద్దాం" అనేది. ఇద్దరం దారిలో కలిసేవాళ్ళం. వస్తూ వస్తూ అక్కడ ఒక పానీపూరీ బండి దగ్గిరకి వెళ్ళి పానీ పూరీ తినేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఇంటికి వెళ్ళడం వీణాకి చాలా ఇష్టంగా వుండేది.

అక్కడ ఒక బండీ అతను ఫలూదాతో మిల్క్ షేక్ చేసేవాడు. చాలా బావుండేది. ఇద్దరం కలిసి అది తాగేసి మావారికి, మా అబ్బాయికి ప్యాక్ చేసి పట్టికెళ్ళేవాళ్ళం. ఇంకోసారి ఫ్యూట్ జ్యూస్. ఇప్పుడు రోడ్లమీదకి ఎప్పుడైనా వెడితే నేను, మా అమ్మాయి కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన రోజులు గుర్తుకు వస్తాయి. అదొక చక్కని అనుభూతి.

2, నవంబర్ 2022, బుధవారం

*** జీవనయానంలో జర్క్*** - 57

 

*** జీవనయానంలో జర్క్***  - 57

 

**** సాఫీగా జరుగుతున్నజీవనయానంలో ఒక జర్క్ - సద్దుకునేలోపున ఇష్టంలేని కొత్తదారుల్లో పయనం. ప్రముఖుల పరిచయాలు, అనుభవాల ఒరవడిలో నేర్చుకున్న పాఠాలు. ***

 

ఊపిరాడకుండా చేస్తున్న మా వర్కులకి ప్రింట్స్ ఇచ్చి ఇచ్చీ అలిసిపోయిన మా ప్రింటర్ రెస్ట్ తీసుకుంటానంది. దాంట్లో మెయిన్ పార్టు పోయింది. అసలే ఆపిల్ కంప్యూటర్ దానికి సంబంధించిన పార్టులు పోతే అవి రావడానికి టైమ్ పడుతుంది. పోనీ కొత్త ప్రింటర్ కొందామంటే అప్పటికే మేము కంప్యూటర్ కి ప్రింటర్ కి లక్ష రూపాయల పైనే పెట్టాం. కానీ మా పెట్టుబడి కన్నా చాలా ఎక్కువే సంపాదించాం.

 

 

మళ్ళీ ప్రింటర్ కొనాలంటే చాలానే పెట్టాల్సి వస్తుంది. ఈలోపున ఆపిల్ కంప్యూటర్లకి పోటీగా ఐబిఎమ్ వాళ్ళ పి.సి.లు వచ్చాయి. ఆపిల్ కన్నా చాలా తక్కువ రేటు. కానీ మా కంప్యూటర్ బాగానే పనిచేస్తోంది. ఎవరో చెప్పారు. ఆపిల్ కంప్యూటర్ కి, ఐబిఎమ్ పి.సి.కి రెండింటికీ పనిచేసే ప్రింటర్స్ వస్తున్నాయి. తొందరపడకండి అని చెప్పారు.

 

ఈలోపున కంప్యూటర్ మీద పనులు చేసుకుంటూ ప్రూఫులకి బయట తెలిసిన వాళ్ళ దగ్గిర ప్రింట్స్ తీసుకునే వాళ్ళం. ఇల్లు కదిలి బయటికి వెళ్ళాలంటే టైమ్ వేస్ట్ అనిపించేది. బయట కూడా చాలామంది ప్రెస్సుల వాళ్ళు కంప్యూటర్లు కొనుక్కున్నారు. చిన్న చిన్న స్క్రీన్ ప్రింటర్స్ కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ అయిపోతున్నారు. కానీ కస్టమర్స్ రావడం ఆగలేదు.

 

ఇంతలోనే తెలుగు అకాడమీలో మూడు ఆపిల్ కంప్యూటర్ల మీద ఉన్న ఆపరేటర్స్ కి ప్రమోషన్స్ ఇచ్చి సీట్లు మార్చారు. వాళ్ళకి అనుభవం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి. నాకు కబురు చేశారు. నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను అని చెప్పాను. నాకు వెళ్ళడం ఇష్టం లేక చాలా రోజులు తాత్సారం చేశాను. ఫోన్లు చేస్తున్నారు. సరే అని ఒక రోజు తెలుగు అకాడమీకి వెళ్ళాను. అక్కడ ప్రింటింగ్ మేనేజర్ చంద్రమౌళిగారు,  డైరెక్టరు మంజులత గారు మీకు ఇంట్లో చేసినప్పుడు నెలకి ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. (నేను ఎలాంటి వర్కులు చేశానో, మాకు ఎంత వచ్చేదో వాళ్ళకి తెలియదు) మా దగ్గిర వర్కు చేసి చూడండి అన్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మాకు చెప్పండి. మీరేమీ ఇబ్బంది పడద్దు అన్నారు. ఇంకా చాలా మాటలతో మభ్యపెట్టారు. ఈ ఉద్యోగం permanent కాదని తెలుసు. నా వ్యక్తిత్వానికి అదో పెద్ద సవాలైంది. వాళ్ళు అడిగిన పద్ధతి చూస్తే అప్పుడు కాదనలేకపోయాను. నేను ముందు ఎపిసోడ్ లో చెప్పాను కదా... మా చెల్లెలికి ఆ ఉద్యోగం విడిచి పెట్టి వచ్చానని. సరేలే ఈ వంకతో చెల్లెలు అక్కడే చేస్తోంది కాబట్టి తనని కలవచ్చని అనుకున్నాను. 

 

కానీ అక్కడ మేము ఒక పుస్తకం చేశామంటే అది ఫైనల్ అయి రావాలంటే చాలా టైం పట్టేది. అమ్మయ్య అనుకుని దానికి బిల్ పెట్టుకుంటే నలుగురు సంతకాలు పెడితే కానీ డబ్బులు చేతికి రావు. ప్రభుత్వరంగ సంస్థ కదా... కానీ ఎంత తేడా... నేను నా సొంతంగా ఒక ఆఫీసు పెట్టుకుని దానికి నేనే అధిపతినయి, ఎంతోమంది ప్రముఖులు నా చేత వర్కుచేయించుకుని, నేను అడగక ముందే నా చేతిలో డబ్బులు పెట్టినప్పుడు నేను పొందిన ఆనందం ఇక్కడెలా పొందగలుగుతాను.

 

అక్కడ ఇమడడం నా వల్ల కాలేదు.  కొన్ని విషయాలు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాయి. రోజూ నేను ఎందుకు వచ్చానా... అని అనుకోని రోజు లేదు. కానీ నాగురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇది అహంకారం కాదు. స్వయంకృషిలో నేను పొందిన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాననే బాధ. నేను ఇక్కడ నుంచి ఏమయినాసరే బయటికి వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను ఎదురు చూసిన రోజు వచ్చింది.

 



తెలుగు యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పేషీలో (2004) తెలుగు కంప్యూటర్ ఆపరేటర్ కావాలన్నారని మా ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. యూనివర్సిటీ చూడాలని చాలా రోజులుగా అనుకున్నాను. వైస్ ఛాన్సలర్ జి.వి.సుబ్రహ్మణ్యంగారు, మృణాళినిగారు, సుబ్బారావుగారు ప్రముఖులందరూ ఇంటర్వ్యూ చేశారు. జి.వి.సుబ్రహ్మణ్యంగారు ఇంటర్వ్యూ చేసిన పద్ధతి చాలా బాగా అనిపించింది. నేను ఒక ఆపరేటర్ గా వెళ్ళినా ఒక సంచాలకులు మాట్లాడినట్లు కాకుండా ఒక చక్కటి స్నేహితులు మాట్లాడినట్లు నా గురించి అన్ని విషయాలు అడిగారు. అన్నీ వివరంగా చెప్పాను.

 

మీకు ఇక్కడ ఎక్కువ పనేమీ వుండదు. నెల తిరిగేసరికి మీ శాలరీ మీకు వస్తుంది. యూనివర్సిటీ నుంచి కూడా మీరు వర్కులు తీసుకుని ఇంట్లో చేసుకోవచ్చు. కానీ, ఇక్కడ కూడా మీకు డబ్బులు చేతికి వచ్చేసరికి లేటవుతుందిఅన్నారు. నేను పట్టికెళ్ళిన నా సర్టిఫికెట్లు ఒక్కటి కూడా చూడలేదు. చూపించబోతే అవసరం లేదన్నారు. ఆరకంగా ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం వచ్చింది.

 

మధ్యాహ్నం యూనివర్సిటీకి వెడుతున్నానని ఇంట్లో చెప్పాను. వెంటనే వచ్చేస్తాను కదా అనుకున్నాను. కానీ అర్జంటు కాన్ఫిడెన్షియల్ లెటర్ ఏదో చెయ్యాల్సి వచ్చింది. ఆపిల్ కంప్యూటర్ కాదు ఐబియమ్ పి.సి. కొంచెం ఆపరేషన్ తేడా వుంది. ఆ లెటర్ చేసేసేసరికి రాత్రి 7.30 అయిపోయింది. ఇంక గబగబా యూనివర్సిటీ గేటు బయటే ఉన్న బస్ స్టాప్ లో బస్సెక్కి ఇంటికి వెళ్ళిపోయాను. సెల్ ఫోన్లు లేవు. సమాచారం తెలియదు. ఇంట్లో కంగారు పడుతున్నారు. అన్నీ చెప్పాను. అన్ని పనులూ చూసుకుని అప్పటికే ఇంట్లో ఒప్పుకున్న వర్కులు చెయ్యడానికి వెళ్ళిపోయాను.

 

ఇక పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పిల్లలని స్కూలుకి పంపి హడావుడిగా యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని. నేను వెళ్ళిన రెండు రోజులకి రిజిస్ట్రార్ గా ప్రొ. గురుమూర్తిగారు వచ్చారు. చాలా మంచి వ్యక్తి. కొన్ని ముఖ్యమైన లెటర్లు పక్కనే వుండి చేయించుకునేవారు. కొన్నిసార్లు పి.ఎ. లక్ష్మి, నేను గురుమూర్తి గారితో కలిసి భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలో ఆయన ఒక కుటుంబ వ్యక్తిగానే కనిపించేవారు. ఇవన్నీ బాగానే వుండేవి. నిజంగానే యూనివర్సిటీలో నాకు ఎప్పుడో కానీ పని వుండేది కాదు. నాకు టైము ఎలా గడపాలో అర్థం అయ్యేది కాదు.

 

అక్కడ థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ వేసే నాటకాలకి సంబంధించిన ఇన్విటేషన్ లు చేయించుకునేవారు. చాలా గొప్ప నాటకాలు వేసేవారు. నాకు ఒక్కసారన్నా వాళ్ళు వేసే గొప్ప గొప్ప నాటకాలు చూడాలనిపించేది. చిన్న పిల్లలు, వాళ్ళ చదువులు, నేను వచ్చేవరకు ఎదురు చూపులు ఆఫీసు నుంచి పరుగులు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. పిల్లలు తొందరగా పెద్దవాళ్ళయితే బావుండును అనుకున్నాను. ఖాళీ వున్నప్పుడు అన్ని డిపార్ట్ మెంట్లకి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకు, అక్కడి విషయాల తెలుసుకుని వచ్చేదాన్ని. ఆయా డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్లు చాలా బాగా మాట్లాడేవారు. అన్నీ వివరంగా చెప్పేవారు. ఎన్.టి. రామారావుగారు తెలుగు యూనివర్సిటీ పెట్టడం వెనక అంతరార్థం తెలిసింది.

 

 కానీ అది ఎంత వరకు విజయవంతం వుతోందో అనేది నాకు అర్థం కాలేదు. చాలామంది పెద్దవాళ్ళు పరిచయం అయ్యారు. ఎన్నో విషయాలు తెలిశాయి. అక్కడ పనిచేసే ప్రతి వాళ్ళూ నాతో చాలా బాగా మాట్లాడేవారు. నాకు ఏమీ ఇబ్బంది వుండేది కాదు. కానీ వచ్చే శాలరీనే చాలా తక్కువ. అవి నాకు ఎందుకూ సరిపోయేవి కాదు.  నా స్వయంకృషిలో ఎప్పుడూ చేతిలో డబ్బులుండేవి. మా వారు  జాబ్ చేసినా ఆ పరిస్థితుల్లో అవి సరిపోయేవి.

 

 

***

 

*** మధ్యలో సాహసాలొకటీ.... ***

 

బల్కం పేటలో మా ఇంటి దగ్గర నుంచి లోకల్ ట్రెయిన్ నాంపల్లికి వుండేది. యూనివర్సిటీ వాళ్ళు చాలామంది అందులోనే వెడుతుంటే నేను కూడా అందులోనే వెళ్ళేదాన్ని. బల్కంపేటలో లోకల్ ట్రైన్ స్టేషన్ చాలా దగ్గర.  ఒకోరోజు ట్రెయిన్ అందుకోవాలని పరుగులు పెట్టుకుంటూ ప్లాట్ ఫాం మీదకి వెళ్ళేసరికి దూరంగా వస్తూ కనిపించేది. ట్రెయిన్ ఎక్కాలంటే బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. ఆ ట్రెయిన్ మిస్సతే అరగంట వరకూ ట్రెయిన్ లేదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఇటువైపు నుంచి అటువైపుకి రెండే రెండు నిమిషాల్లో ఎక్కి దిగి ట్రెయిన్ని అందుకునేదాన్ని. అమ్మో ఎన్ని ట్విస్ట్ లు.  ఎంత తొందరగా తెమలాలన్నా పిల్లలని స్కూలుకి పంపించి, మిగిలిన పనులు పూర్తి చేసుకునేసరికి ఆ హడావుడి తప్పేది కాదు.

 

మళ్ళీ యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లోకల్ ట్రెయిన్ లోనే వచ్చేదాన్ని. సరిగ్గా సా. 6గం. 2 నిమిషాలకి ట్రెయిన్ వుండేది. నా పని ముందే అయిపోయినా రిజిస్ట్రార్ పి.ఎ. లక్ష్మికి పని తెమిలేది కాదు. అన్నీ అయ్యి ఇద్దరం బయల్దేరేవాళ్ళం. లక్ష్మి, నేను యూనివర్సిటీ పది నిమిషాల తక్కువ 6 గం.లకి నాంపల్లి స్టేషన్ కి అడ్డదారి నుంచి వెళ్ళేవాళ్ళం. రోజూ చూసే డ్రైవర్ ఒకోసారి బయల్దేరబోతూ ఒక్క నిమిషం ఆపేవాడు. కానీ ఒక రోజు ఇలాగే లేటయింది. ట్రెయిన్ రెడీగా వుంది. మమ్మల్ని చూసి ఆపాడు. లక్ష్మి పొడుగ్గా వుంటుంది. ఒక్క అంగలో ఎక్కేసింది. నేను ఎక్కుతుంటే ట్రెయిన్ కదిలి పోయింది. ఒక్క విసురుగా లోపలికి పడ్డాను. చేతిలో టిఫిన్ బాక్స్ ల కవర్ ఎగిరి డమడమా చప్పుడు చేసుకుంటూ అంతదూరంలో పడింది. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. గబగబా నన్ను లేవదీసి – “తొందరగా రండమ్మా... ఎందుకొచ్చిన సాహసాలు. లేకపోతే బస్సులు చాలా వుంటాయి కదా.... ఇంటి దగ్గర ఎదురు చూసేవాళ్ళున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యకండిఅన్నారు. దెబ్బతో లోక్ ట్రెయిన్ కి స్వస్తి చెప్పాను. యూనివర్సిటీ గేటు ముందరే బస్ స్టాప్. చాలా బస్సులు వుండేవి. ఇక ఇంటికి క్షేమంగా అందులోనే వెళ్ళేదాన్ని.

 

***

 

ఇంత కష్టపడి అక్కడికి వెడితే నెలలో మహా అయితే వారం రోజులు వర్కు వుండేది. వాళ్ళు శాలరీ పెంచాలంటే చాలా పెద్ద ప్రోసెస్. అన్నీ బావున్నాయి కదా అని నేను ఊరికే కూచోలేకపోయాను. ఇంతలోనే జివి సుబ్రహ్మణ్యం గారు ప్రపంచానికి దూరం అయ్యారు. మంజులతగారు వి.సి.గా వచ్చారు.

 

ఇంక ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా కోసం ఎదురు చూస్తున్న కస్టమర్స్ వున్నారు. మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారని అందరూ అడుగుతూ వుండేవారు. వెంటనే ఎవర్నీ సంప్రదించకుండా కంప్యూటర్ లో నా ఆర్థిక అవసరాలకి శాలరీ సరిపోవట్లేదు కాబట్టి నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను అని ఒక లెటర్ రాసి రిజిస్ట్రార్ గారికి ఇచ్చాను. నేను రాసినది చూసి ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయన చేతుల్లో ఏమీ వుండదు కాబట్టి సంతకం పెట్టారు.

 

పేషీలో ఉన్న ఆఫీసరు, యూనివర్సిటీలో నాకు తెలిసినవాళ్ళందరూ మీరు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మీరు లోపలికి రాలేరు. ముందు ముందు మీకు బావుంటుంది. అలా ఎందుకు రిజైన్ చేశారుఅన్నారు. నేను నవ్వేసి బయటికి వచ్చేశాను. చాలామంది మంచి మిత్రుల్ని వదిలిపెడుతున్నానని బాధగానే అనిపించింది కానీ, నా భవిష్యత్ నిర్ణయం నన్ను హెచ్చరించింది.  

 

అమ్మయ్య అని స్వేచ్ఛా వాయువులని ఆనందంగా పీల్చుకున్నాను. ఒక్కసారి ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నాదే అనిపించింది. నా రూటులోకి నేను మళ్ళీ వచ్చేశాను. చాలా విషయాల్లో నిర్ణయం భయపడకుండా తీసుకోవడమే నా భవిష్యత్తుకి బాట అయ్యింది.