***సాహితీప్రియుడు – నిస్వార్థపరుడు - 65 ***
నా జీవిత కదంబం. నా జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు, వివిధ ప్రదేశాలకి నేను వెళ్ళిన స్థలాలలో అనుభూతుల, అనుభవాల, జ్ఞాపకాల సమాహారం.
28, డిసెంబర్ 2022, బుధవారం
సాహితీప్రియుడు – నిస్వార్థపరుడు - 65
23, డిసెంబర్ 2022, శుక్రవారం
ఆత్మనిబ్బరమే వారి గెలుపు - 64
ఆత్మనిబ్బరమే వారి గెలుపు - 64
16, డిసెంబర్ 2022, శుక్రవారం
సోమరాజు సుశీలగారితో నా అనుబంధం - 63
*** సోమరాజు సుశీలగారితో నా అనుబంధం - 63***
8, డిసెంబర్ 2022, గురువారం
గుర్తుండిపోయిన రోజు - 62
గుర్తుండిపోయిన రోజు - 62
పొద్దున్నే లాండ్ లైన్ కి ఫోనొచ్చింది.
“మేడమ్ నా పేరు రత్నాకర్. ప్రగతి ప్రింటర్స్
(*** ప్రగతి ప్రింటర్స్ వాళ్ళకి హిందీలో భగవద్గీత, తెలుగులో విఎకె రంగారావుగారి జీవిత చరిత్ర, ప్రగతి
ప్రింటర్స్ స్వర్ణోత్సవ సంచిక, ఇంకా చాలా వర్కులు చేశాను ***) వాళ్ళు మీ
ఫోన్ నెంబర్ ఇచ్చారు.. వెలిచాల జగపతి రావుగారు, కరీంనగర్ మాజీ శాసనసభ్యులు పేరు మీరు
వినేవుంటారు. తెలుగు అకాడమీ డైరెక్టర్ గా చేసిన వెలిచాల కొండలరావుగారి తమ్ముడు.
మేము కరీంనగర్ నుంచి వచ్చాం. నేను జగపతి రావుగారి పి.ఎ., సారు మీ
ఇంటికి వచ్చి, ఆయన తెలంగాణ చరిత్ర పుస్తకం టైపింగ్ కి
ఇద్దామనుకుంటున్నారు. ఎప్పుడు రమ్మంటారు?” అన్నారు రత్నకర్ గారు.
“మేము ఇంట్లోనే వున్నామండీ. రండి” అన్నాను.
ఒక అరగంటలో జగపతి రావుగారు, ఆయన పి.ఎ. రత్నాకర్ గారు వచ్చారు. ఆయనకి వయసు
70 పైనే
వుంటుంది. ఆయన చాలా పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఏమ్మా.... నా
తెలంగాణ చరిత్ర తప్పులు లేకుండా చెయ్యాలి. ఇదిగో మేటర్ అని ఇచ్చి, నేను మళ్ళీ
రేపు సాయంత్రం వస్తాను. చేసి పెట్టెయ్యండి అన్నారు. వంద పేజీలు ఉన్నాయి.
“ఇంతకీ నేను ఎవరో రత్నాకర్ చెప్పాడా?” అన్నారు. ఆయన గంభీరమైన
గొంతుతో, స్పీడుగా మాట్లాడేస్తుంటే ఏమీ మాట్లాడకుండా
కూచున్నాను. ఆయన ఒక పేపర్ ఇచ్చి, ఇవి పుస్తకంలో
ముందు వస్తాయి అన్నారు.
అందులో –
*** కరీంనగర్ కి మాజీ శాసనసభ్యుడు. చిన్నప్పటి
నుంచీ తెలంగాణ స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ
గురించిన ఉద్యమవ్యాసాలు రాసి, పుస్తకాల ముద్రణ. జర్నలిస్టు, కవి. మూడు
యూనివర్సిటీలకి సెనేట్ మెంబర్ చేశారు. మార్క్ ఫెడ్ ఛైర్మన్. జగిత్యాలకి, కరీంనగర్ కి
శాసనసభ్యుడు. రెండుసార్లు లండన్లో జరిగిన సహకార సంబంధిత
ప్రపంచ సెమినార్లకు భారత దేశ ప్రతినిధిగా 1973, 1976లో *** – ఉన్నాయి. కూచుని ఒక మామూలు కుటుంబ సభ్యుడిలా
మాట్లాడుతున్నారు.
కాఫీ ఇస్తానంటే వద్దన్నారు. నేను డైటింగ్ లో ఉన్నాను. ఒక టైం ప్రకారం
తీసుకుంటాను. నాకేమీ వద్దు అన్నారు. ఆయన రాసిన కవితలు కొన్ని వినిపించారు.
జర్నలిస్టుగా ఆయన అనుభవాలు చెప్పారు.
ఆయనని సాగనంపడానికి కిందవరకూ వెళ్ళాం. ఆయన వెడుతూ వెడుతూ కరీంనగర్ లో మాకు
***పుష్పాంజలీ రిసార్ట్స్*** ఉన్నాయి. మీ కుటుంబమంతా రండి ఒక రెండురోజులు
ఉండి వెళ్ళండి అన్నారు. అలాగే సర్ అని వచ్చేశాం. మర్నాడు
సాయంత్రం ప్రింట్స్ తీసుకోవడానికి వచ్చి మళ్ళీ కరీంనగర్ రమ్మని చెప్పారు. మాకు ఆయన
అన్నిసార్లు చెప్పడం ఆశ్చర్యం వేసింది. అప్పటికీ మేము సీరియస్ గా తీసుకోలేదు. కరీంనగర్
వెళ్ళిపోయిన తర్వాత ఆయన పి.ఎ. రత్నాకర్ ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారో
కనుక్కోమన్నారు. వచ్చేటప్పుడు రెండురోజుల ముందు ఫోన్ చెయ్యండి
అన్నారు.
పెద్దాయన అన్నిసార్లు చెప్పారని - మార్చి 2వ తేదీ మా అబ్బాయి పుట్టినరోజుకి వెడదామని ఫోన్ చేసి, ముందురోజు సూర్యోదయపు వేళ అందాలని, చల్లదనాన్ని ఆస్వాదిస్తూ..... బస్ లో కరీంనగర్ పుష్పాంజలీ రిసార్ట్స్ కి వెళ్ళాం. వెళ్ళిన దగ్గర నుంచీ మాకు విఐపి ట్రీట్ మెంట్. ఒక పదిమంది పట్టేంత పెద్ద రూం మాకు ఏర్పాటు చేశారు. చాలా బావుంది. వెళ్ళి మేము కొంచెం రెస్ట్ తీసుకుని రెడీ అయ్యేలోపున టిఫిన్ తెచ్చిపెట్టారు.
టిఫిన్ తిని వాళ్ళు పెంచుతున్న మొక్కలు చూడ్డానికి వెళ్ళాం. దాదాపు 200 రకాల పువ్వుల
మొక్కలున్నాయి. చాలా చక్కగా పెంచుతున్నారు. అక్కడంతా పచ్చికతో ఖాళీ ప్రదేశం వుంది.
అక్కడు కుర్చీలు, టేబుల్స్ వున్నాయి. సాయంత్రమప్పుడు అక్కడ
సినిమా వేస్తారు. అక్కడ కూచుని తింటూ సినిమా చూస్తారు అక్కడికి వచ్చినవాళ్ళు. చాలా
ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వుంది. మేము అవన్నీ తిరిగి
వచ్చేలోపున లంచ్ టైం అయ్యింది.
వాళ్ళ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళారు. ఆ చివర నుంచి ఈ చివర దాకా పెద్ద
టేబుల్ దాని మీద రకరకాల వంటకాలు. అన్నీ వెజిటేరియన్. బఫే కాబట్టి మాకు కావలసినవి
అన్నీ వేసుకుని తిన్నాం. ఇంట్లో భోజనం లాగే అనిపించింది. అది అయ్యాక
ఐస్ క్రీం, మిల్క్ షేక్ తెచ్చి ఇచ్చారు. ఇవన్నీ వద్దు
అంటే - సార్ మీకు ఏమేం ఇవ్వాలో చెప్పారు అన్నారు. కొద్ది
కొద్దిగా తీసుకున్నాం.
ఆ రోజుకి రెస్ట్ తీసుకుని మర్నాడు వాళ్ళు ఏర్పాటు చేసిన కారులో - కరీంనగర్ కి
పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందల్ కోటకి వెళ్ళాం.
*** ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు.
దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు. శత్రువుల నుండి దాడులను
నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు ( 16 అడుగులు) వెడల్పు, 4 మీటర్లు (13 అడుగులు)
లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారుట*** దీనికి చాలా
చరిత్రే వుంది. మొత్తం అంతా చూడలేకపోయాం. మిగిలిన వాటికి టైం సరిపోదని మళ్ళీ
ప్రయాణం కొనసాగించాం. దారిలో మానేరు ప్రాజెక్ట్ చూశాం.
తర్వాత చాళుక్యుల కాలం నాటి ***వేములవాడ***, ప్రాచీన చరిత్ర ఉన్న ***కొండగట్టు
ఆంజనేయస్వామి గుడి***కి వెళ్ళాం. దారంతా పచ్చటి చెట్లతో చాలా అందంగా వుంది. ఇవన్నీ చూసి
తిరిగి రిసార్ట్స్ కి వచ్చాం. డిన్నర్ రెండు రోజులూ చాలా బావుంది. వాళ్ళు
మేమున్న రెండురోజులూ మాకు ఎటువంటి లోటూ లేకుండా చూసుకున్నారు. వచ్చేసే ముందు
డబ్బులు ఇవ్వబోతే... మా దగ్గిర డబ్బులు తీసుకోవద్దని చెప్పారుట.
బయల్దేరుతుంటే జగపతిరావుగారు వచ్చారు. ఆయనకి, వాళ్ళ రెస్టారెంట్ స్టాఫ్ కి ధన్యవాదాలు
చెప్పి హైదరాబాద్ కి తిరిగి వచ్చాం. అది మాకు మరిచిపోలేని మధురస్మృతి.