26, నవంబర్ 2021, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 31 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -2

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 31  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -2 

అమ్మ చిన్నపాపని తీసుకుని ఏలూరు నుంచి ఈ కొత్త ఇంటికి వచ్చింది. అమ్మమ్మ కూడా కొన్నాళ్ళు అమ్మకి తోడు వచ్చింది. వరసగా మూడు గదులు. వెనక కిందకి వున్న వంటగది. నాన్నగారు వున్నప్పుడు అందరం మంచాల మీద పడుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఇంట్లో మంచాలు వేసుకోవడానికి కొంచెం  ఇబ్బందిగానే వుండేది. మంచాలన్నీ బయట ఒక సందుంటే అందులో పెట్టి, ఒక పెద్ద మంచం మాత్రం ఇంట్లో వేసుకున్నాం. 

అమ్మమ్మ కొన్ని రోజులు వుండి (నర్సాపురం దగ్గర వున్న) పెనుగొండకి వెళ్ళిపోయింది. ఇక చిన్న పాప బాగా ఏడుస్తూ వుండేది. అమ్మకి పాపం నాన్న పోయి బాధలో పాపని అసలు పట్టించుకునేది కాదు. అంటే మళ్ళీ ఎత్తుకుని ముద్దులు పెట్టుకునేది. పాలిచ్చేది. ఇంట్లో పనికి పనిమనిషి, బట్టలకి చాకలి వున్నా... అమ్మకి వంటపని సరిపోయేది. ఇల్లంతా ఎప్పుడూ నీట్ గా పెట్టేది. 34 సంవత్సరాలకి నాన్న చనిపోతే అమ్మ పరిస్థితి ఎలావుండేదో అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంత చిన్న వయసులో ఎంత క్షోభపడిందో అని. 

మేమందరం భగవద్గీత నేర్చుకున్నామని చిన్న చెల్లెలుకి గీతాభవాని అని పేరు పెట్టాం. గీతా గీతా అని పిలిచేవాళ్ళం. అది ఏడుస్తుంటే నేను (కుడి నుంచి రెండు), మూడో అక్క ఉమ్మ (ఎడమ నుంచి రెండు)  ఇద్దరం దుప్పటీలో పడుకోపెట్టి అటూ ఇటూ వూపుతూ పాటలు పాడేవాళ్ళం. అది నిద్రపోయేది.  తర్వాత అమ్మ తీసుకెళ్ళి లోపల పడుకోపెట్టేది.

అక్క నాన్నగారు చేసిన ఆంధ్రాబ్యాంక్ లోనే పనిచేసేది కాబట్టి,   మేము ఆ ఇంటికి వచ్చాక అక్కకి బ్యాంక్ దగ్గరైంది. అక్క అప్పటి వరకూ చదువులోనే వుంది కాబట్టి సంసారం ఖర్చులు ఎక్కువ తెలిసేవి కాదు. ఉద్యోగం చేసి వచ్చి అలిసిపోయిందని అమ్మ ఏ పని చెప్పేది కాదు. అక్కంటే మా అందరికీ ప్రేమతో కూడిన భయం వుండేది. తన మాటకి ఎదురు చెప్పేవాళ్ళం కాదు.  రెండో అక్క అమ్మకి ఇంట్లో పనుల్లో సాయం చేసేది. ఇంక నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు.  నేను, మూడో అక్కా బజారు పనులన్నీ చూసుకునేవాళ్ళం. ప్రతి ఆదివారం సంతకి వెళ్ళి కూరలు కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. 

సంతలో అందరి దగ్గరా కూరలు చీప్ గానే వుండేవి కానీ, ఒకతని దగ్గరమాత్రం చాలా రేట్లు ఎక్కువ వుండేవి. ఎవరి దగ్గర దొరకని కూరలు  అతని దగ్గర దొరికేవి.  నాన్నగారు లేని లోటు తప్ప మిగిలిన విషయాల్లో అందరం ఆనందంగానే గడిపాం.

ఏదైనా సినిమా ఉంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ఉన్నప్పుడు అక్కలని హిందీ పరీక్షలకి కట్టించి హిందీ రావాలని హిందీ సినిమాలకి తీసుకుని వెళ్ళేవారు.  అలా వాళ్ళకి హిందీ సినిమాలు అలవాటు అయ్యాయి. 


21, నవంబర్ 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 30 - మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు  30

మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు

మరియమ్మగారూ వాళ్ళు గులాబీ మొక్కలని పెంచేవారు. అవి చాలా పెద్ద పెద్ద పువ్వులు పూసేవి. అప్పుడప్పుడు ఆ పువ్వులు మాకు ఇస్తుండేవారు. అమ్మకి ఆ పువ్వులు పెట్టుకోవాలని వుండేది. నేనూ అమ్మా పెంచని మొక్కలేదు.  నాన్నగారు పోయిన కొత్త. ఆ బాధ ఒకవైపు. పెద్దక్క అమ్మతో అమ్మా... నీకు పెట్టుకోవాలని వుంటే పెట్టుకో... ఎవరిగురించో నీకెందుకు. ఇవన్నీ చిన్నప్పటి నుంచీ వచ్చినవి, చేసుకున్న వాళ్ళతో వచ్చినవి కాదు కదా... అంది. కానీ అమ్మ ఆ కోరికని తనలోనే అణిచేసుకుంది.   పల్లెటూరులో పుట్టింది. అందరి పెరళ్ళలో పువ్వుల మొక్కలు, తోటలు, పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగిన అమ్మ 34 సంవత్సరాలకే అన్నీ వదిలేసుకోవడం చాలా బాధ అనిపించింది.

మరియమ్మగారూ వాళ్ళు కోళ్ళని పెంచేవారు. నాలుగు కోళ్ళుండేవి. అవి లేత గులాబీ రంగులో అక్కడక్కడ గుడ్లు పెట్టేవి. మేము చూసి చెప్పేవాళ్ళం. ఆ కోళ్ళలో చుక్కల చుక్కల కోడి సన్నగా తిప్పుకుంటూ తిరిగేది. దానికి అక్కావాళ్ళు సైరాబాన్ అని పేరు పెట్టారు. చూడడానికి వింతగా వుండేది. అది మామూలు కోడే. నిప్పుకోడి కాదు. చిన్నగా ముద్దుగా వుండేది.  ఒకరోజు పొద్దున్న లేచేసరికి దాని దర్శనమవలేదు. మొత్తం పెరడంతా వెతికాం. ఒక మూల దాని ఈకలు కనిపించాయి. అవి క్రిస్ మస్ రోజులు. వాళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పాటలు పాడుతుండేవారు. అలా కలిసినప్పుడు మిఠాయిలు, పళ్ళు, వాళ్ళకి నచ్చినవి పంచిపెట్టుకునేవారు. ఈ కోడి కూడా అలాకలిసిపోయింది.

ఒకసారి మరియమ్మగారు, డా. లివింగ్ స్టన్ గారూ బాగా కొట్టుకున్నారు. మాకు చాలా భయం వేసింది. ఆవిడ సామాను సద్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆయన కూతురు, కొడుకులిద్దరూ వున్నారు. మళ్ళీ వారం రోజులకి పోయి ఆయనే ఆవిడని బతిమాలి తీసుకుని వచ్చాడు. వాళ్ళమ్మాయి మేరీ చాలా అందంగా వుండేది. తను మెడిసిన్ చెయ్యాలనుకుంది. ఒకసారి వాళ్ళ నాన్నతో నాన్నా నీకు ప్రాక్టీస్ నడుస్తోంది కానీ, మేము మెడిసిన్ చదివేనాటికి సంచులు బుజాన వేసుకుని తిరాగాలేమో... అనేది.  ఇది జరిగి దాదాపు 45 సంవత్సరాలు కావస్తోంది.

***

మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన ఇంకో ఘోరమైన సంఘటన – నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేసినప్పటి నుంచీ రామకృష్ణ అని ప్యూన్ వుండేవాడు. అక్క చేస్తున్నప్పుడు కూడా అతను ఉన్నాడు. అతని కొడుకు మా 6వ చెల్లెలు గాయత్రిని స్కూలుకి తీసుకుని వెళ్ళేవాడు. గాయత్రికన్నా 1 సంవత్సరం పెద్దవాడు. అయితే రెండు రోజులుగా అతను రావడం మానేశాడు. ఎందుకో అర్థం కాలేదు.  

అక్క ఇంటికి వచ్చి రామకృష్ణ కొడుకు కనిపించట్లేదు. కొడుకోసం అంజనాలు వేయించి అడుగుతున్నాడు. వాళ్ళు తూర్పువైపు వున్నాడని చెప్పారుట అంది. మాకు చాలా బాధగా అనిపించింది. తర్వాత రెండు రోజులకి తెలిసినది ఏమిటంటే... రామకృష్ణ ఆస్తికోసం వాళ్ళ బంధువులు పిల్లాడికి కాళ్ళూ చేతులూ కట్టేసి, అప్పట్లోకోరమాండల్ ఎక్స్ ప్రెస్ అని వచ్చేది దానికింద పడేశారుట. పైగా ఆ ఛిద్రమైన శరీరాన్ని రైల్వేట్రాక్ పక్కన పూడ్చిపెట్టారు. అదెలాగో బయటపడింది. మేము చాలా రోజులు మామూలుగా అవలేకపోయాం. ఇంత ఘోరంగా ఎలావుంటారా... అనిపించింది. మేము ఆ ఇంట్లో ఎక్కువరోజులు వుండలేదు.

*** 

అమ్మ డెలివరీకి ఎలూరు వెళ్ళింది కదా.... మేము పాపని చూసి వచ్చాం కదా... మేమున్న ఇల్లు అక్కడ ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు ఒకరోజు వచ్చి ఈ ఇల్లు మాకు కావాలి. మేమే వద్దామనుకుంటున్నాం అని చెప్పారు. ఇంక చేసేది ఏమీ లేదు.  మాకు ప్రతీ విషయానికి దిగులు పడే అలవాటు లేదు.

అనుకోకుండా మా నాన్నగారు వున్నప్పటి ఇల్లు దగ్గరే వేరే ఇల్లు దొరికింది. ఆ ఇల్లు గల ఆయన పేరు కలియుగార్జున్. ఆయనే ఆ పేరు పెట్టుకున్నాడు. బుధవారం బుధవారం మైక్ పెట్టి, భజనలు చేసేవారు. భజన అయ్యాక ప్రసాదం పంచిపెట్టేవారు. ఒక సంగీతం మేష్టారు హార్మొనీ వాయించేవారు. ఒక మద్దెల అతను మద్దెల వాయించేవాడు. గట్టిగా పాడేవారు. కృష్ణ భజనలు చేసేవారు. ఇక తప్పదు ఆ ఇల్లు అయితే అందరికీ అనుకూలంగా వుంటుంది.    


15, నవంబర్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 29 - దెయ్యాల భయం

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు 29 - దెయ్యాల భయం



దెయ్యాల భయం


అలా ఏలూరు నుంచి చిట్టి చెల్లాయిని చూసి వచ్చినప్పుడు పెద్దక్క ఒక్కత్తే ఇంట్లో వుంది. అక్క ఫ్రెండు రాజేశ్వరి సాయం వుంటానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. మేము రావడం లేటవుతోందని తెలిసి వెళ్ళిపోయింది.

అక్కని అదేమిటి అలా వెళ్ళిపోయిందని అడిగితే...

ఏమీలేదు గెరటరాజు గారి అబ్బాయి ఆరుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు కదా... వాళ్ళింటికి వెళ్ళే కాలవవడ్డున స్మశానంలోనే వాళ్ళని దహనం చేశారు కదా... రాత్రి పూట వాళ్ళ ఆత్మలు కాలవ ఒడ్డున కూచుంటాయిట. గజ్జెల చప్పుళ్ళు బాగా వినిపిస్తాయిట. అందుకని వెళ్ళిపోయిందని చెప్పింది.

***ఇంతకీ అసలు కథ ఏమిటంటే... గెరటరాజుగారని మా వూళ్ళో ఓ పెద్దమనిషి వున్నాడు. ఆయనకి 11 మంది పిల్లలు. వాళ్ళలో ఒకబ్బాయి సుబ్బారాయుడు పేట అని అక్కడ వుండేవాడు. ఆయనకి ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆయన బాగా డ్రింక్ చేసేవాడు.  బాగా అప్పులపాలయ్యాడుట. ఒక కంసాలి దగ్గిరకి వెళ్ళి సైనైడ్ తెచ్చుకుని నిద్రపోతున్న పిల్లలందరికీ వాసన చూపించి, తన కుక్కకి కూడా చూపించి, భార్యకి వాసన చూపించిన తర్వాత, ఫోన్ తీసి ఎదురగా వుండే బాబ్జీ అనే పేరున్న  ప్లీడరుకి  ఫోన్ చేసి మాట్లాడుతూ తనూ వాసన చూశాడుట. ఆవతల ఆయన ఫోన్ తీసేసరికి ఏమీ శబ్దం లేదు.

మర్నాడు పొద్దున్న పనిమనిషి వచ్చి తలుపు కొడితే ఎవరూ తియ్యలేదు. కిటికీలోంచి చూసి ఆ బాబ్జీ గారిని తీసుకుని వచ్చింది. ఆ తర్వాత కథ పోలీసులు, గోల అంతా మామూలే.... ***

ఇదీ సంగతి.

సరే మేమున్న పక్క వాటాలో లివింగ్ స్టన్ అని ఒక డాక్టరు వుండేవారు. ఆయనకి ఒక క్లినిక్ వుండేది. రోజూ వెళ్ళి వస్తుండేవారు. ఆయన అందరితో బాగా మాట్లాడేవారు. వాళ్ళావిడ మరియమ్మ గారెలు బాగా చేసేది. వాళ్ళు వేసకున్నప్పుడల్లా మాకు ఇచ్చేవారు. వాళ్ళకి ములక్కాడలు అంటే చాలా ఇష్టం. వెనకవైపు పెరడు బాగా వుండేది. అక్కడ కుర్చీలు వేసుకుని టిఫిన్ లా తింటూ వుండేవారు.

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే.... కొంత కథ చెప్పాలి కదా... ఈ ఇంటి కథ ఇంకా కొంచెం వుంది అది చెప్పేసి అసలు కథలోకి వెడతాను.