20, మార్చి 2022, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు - 11

   

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  పసిపిల్లలతో సందడి సందడి - 11



పిల్లలతో అక్కమామగారి కార్యక్రమాలకి వెళ్ళినా పాపం అమ్మకి అస్సలు తీరుబడి వుండేది కాదు.  ఎంతసేపూ అక్కపిల్లల బట్టలు వుతకడం, అవి ఆరెయ్యడం మడతలు పెట్టడం పనులతో సరిపోయింది. ఇంక నేను ఇద్దరు పిల్లలని దగ్గర పెట్టుకుని అమ్మ చేసే పనులు చూస్తూ కూచునేదాన్ని. మొత్తానికి కార్యక్రమాలు అయ్యాయి.  అక్కావాళ్లు ఇంకా నాలుగు రోజులు వుండి బయల్దేరాల్సి వచ్చింది. అమ్మా,  నేను  ఆ పిల్లలని  వేసుకుని బస్టాండ్ కి వచ్చాం. బస్సుల మహా రష్ గా వున్నాయి. మొత్తానికి బావగారు ఎలాగో బస్ ఎక్కించారు. మొత్తానికి తాడేపల్లిగూడెం వచ్చి చేరాం. 


నేను, ముగ్గురు చెల్లెళ్లు అమ్మకి సాయం చేసేవాళ్ళం. నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి స్కూల్లో టీచర్సుగా పనిచేసేవాళ్ళం. ఆ తర్వాత చెల్లెళ్లు ఇద్దరూ చదువుకుంటుండేవారు. నా చివరి చెల్లెలు నేను చేసే స్కూల్లోనే 5వ తరగతి చదువుతుండేది. నేనే ఆ క్లాస్ టీచర్ని. అందుకని మాతోబాటు స్కూలుకి వచ్చేది. ఆ పై చెల్లెలు గాయత్రి వేరే హైస్కూల్లో చదివేది. ఇంట్లో పనిమనిషి, చాకలి వుండేవారు. మేము స్కూలు నుంచీ వచ్చేవరకూ అమ్మ పిల్లలిద్దరినీ చూసుకుంటూ వుండేది. అక్క విజయవాడ ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోయింది. 


 నేను, ప్రభావతి మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి వచ్చి భోజనం చేసినా, సాయంత్రం ఇద్దరం స్కూలు నుంచి అటునుంచి అటు ట్యూషన్లు చెప్పి రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. స్కూలు అయిపోగానే కొంచెం పెద్ద పిల్లలు ఇంటికి వెళ్ళి  మాకిద్దరికీ అమ్మ టీ ఫ్లాస్కులో పోసి ఇస్తే తెచ్చి ఇచ్చేవారు. అది తాగేసి మేము ట్యూషన్ కి వెళ్ళిపోయేవాళ్లం.  అక్కడ ట్యూషన్ పిల్లల అమ్మ, అమ్మమ్మ "మేము ఇస్తాం కదండీ మీరు టీ ిఇంటి నుంచి తెప్పించుకోవాలా?" అనే వారు. కానీ, నాకెందుకో అది నచ్చేది కాదు. "లేదండీ మేము ఎప్పుడైనా కావాలంటే అడుగుతాము" అని తేలికగా నవ్వేసి ఊరుకునేవాళ్ళం.  అది వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టవుతుంది అనిపించేది. మన మర్యాద మనం కాపాడుకోవాలనిపించేది. వాళ్ళింకేమనలేక ఊరుకునేవారు. 


వాళ్ళకి మేమంటే చాలా అభిమానంగా వుండేది. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వాళ్ళు ఇంటికి ఎవ్వరు వచ్చినా మాట్లాడేవారు కాదుట. "మీరెలా మాట్లాడిస్తారో చదువుకన్నా ముందు అది చెప్పండి" అన్నారు.  వాళ్ళు నిజంగానే పెదిమలు కూడా కదపడానికి భయపడేవారు. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా వుండేవారు. నల్లగా వున్నా ముద్దుగా వుండేవారు. వాళ్లకి ఒక వారం రోజులు నేనేం పాఠాలు చెప్పలేదు. రోజూ కబుర్లు, కథలు చెప్పేదాన్ని. వాళ్ళు చెప్పేవి వినేదాన్ని.  మెల్లిమెల్లిగా దారిలో పడ్డారు. చాలా చురుగ్గా తయారయ్యారు.  ఒక నాలుగు నెలల తర్వాత "మాస్టారూ (అప్పట్లో ఆడయినా, మగయినా మాస్టారూ అని అనేవారు) మీరు ఏం మంత్రం వేశారు. వీళ్ళని అస్సలు పట్టలేకపోతున్నాం. అందరితో ఒకటే కబుర్లు" అన్నారు. నాకు నవ్వొచ్చింది. పిల్లలని ఎప్పుడూ చదవమని సతాయించకుండా కాస్త కబుర్లు కూడా చెప్పాలి మరి!


ఇదిలావుండగా నాకు పచ్చకామెర్లు వచ్చింది. అక్క చిన్నప్పటి నుంచి స్నేహితురాలయిన పుష్పలత వాళ్ళ అమ్మగారు పసరు మందు వేస్తారంటే రోజూ పొద్దున్నే పరగడుపున వెళ్ళి ఆ పసరుమందు వేయించుకుని వచ్చేదాన్ని. ఆ చేదు పోవడానికి నా చిన్న చెల్లెలు వెంటనే నాకు ఒక అల్లం బిళ్ళ అందించేది. అలా ఒక పదిరోజులు వేయించుకుని, పత్యం చేశాక. మామూలు మనిషిని అయ్యాను. దాంతో స్కూలు టీచరుగా మానెయ్యాల్సి వచ్చింది. 


ఇక అమ్మ రెండోపాపని తీసుకుని విజయవాడ వెళ్ళమంది. నేను రెండోపాప రత్నని  తీసుకుని విజయవాడ వెళ్ళాను. అక్కావాళ్లు ఆఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత పాప ఆలనా పాలనా నేను చూసుకునేదాన్ని. అక్కడ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజిలో రిజిస్టర్ చేయించుకోమంటే, కనకదుర్గ గుడిలో మాకు తెలిసిన ఆయన వుంటే ఆయన్ని కలవడానికి వెళ్ళాల్సి వచ్చింది.  ఆయన టైముకి దొరకక పోవడంతో  ఇంచుమించు వారం రోజులు రోజూ పాపని తీసుకుని కనకదుర్గ గుడి మెట్లు ఎక్కి వెళ్ళేదాన్ని. మొత్తానికి ఆయన దొరకారు. ఎంప్లాయ్ మెంట్ లో రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ. నాకు అక్కడ ఉద్యోగం ఏమీ రాలేదు.   ఇంతలోకే బావగారు ఇక్కడ ఒక స్కూల్లో టీచర్ పోస్టు ఖాళీగా వుందిట చేస్తావా అమ్మా అని అడిగారు.  సరే అన్నాను. రు. 100 జీతం.  అక్క బ్యాంక్ ఉద్యోగం, బావగారు రైల్వే అయినా ఆరోజుల్లో పిల్లల ఖర్చులు, వారి అమ్మగారి బాధ్యత, మా బాధ్యతలకి డబ్బులు సరిపోయేవి కాదు. వందరూపాయలు ఎక్కువే మరి. సరే అని ఒప్పుకున్నాను. రోజూ అక్క పాపని తీసుకుని స్కూలుకి వెళ్ళేదాన్ని. అందరూ నా కూతురు అనే అనుకునేవారు. నా కుర్చీ పక్కనే పడుకోపెట్టుకుని, పిల్లలకి పాఠం చెబుతుండేదాన్ని. అయితే ఒక రోజు ప్రిన్సిపాల్ పిలిచి మీ పాపకి ఏదైనా ఏర్పాటు చేసుకుని రామ్మా... అన్నారు.  నాకు ఈపని కష్టం అనిపించకపోయినా, స్కూలు పిల్లలు నన్ను ఇష్టపడినా ప్రిన్సిపాల్ మాట కాదనలేకపోయాను. 


ఒక ఆదివారం రోజు బయల్దేరి తాడేపల్లిగూడెం వెళ్ళి మళ్ళీ పాపాయి రత్నని వదిలిపెట్టేసి విజయవాడ వెళ్ళిపోయాను. నాకు చాలా బాధగా అనిపించింది. అమ్మకి పిల్లలు అలవాటే కాబట్టి, పనిమనిషి, చాకలి అందుబాటులో వున్నారు కాబట్టి అమ్మ ఏమీ మాట్లాడలేదు. 






4, మార్చి 2022, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు - 10

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు - 10

మూడో అక్క పెళ్లి అనుకోకుండా అయ్యాక అమ్మకి కొంత రిలీఫ్ అనిపించినా... రెండో అమ్మాయి రమ వుండిపోయిందని దిగులు కూడా పడింది. 

అయితే రమాక్క చాలా తెలివైనది. తను ప్రైవేట్ కంపెనీలో చేస్తూనే రైల్వే, స్టాఫ్ సెలక్షన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల పోటీ పరీక్షలు రాసింది. మూడింట్లోనూ ఒకేసారి ఇంటర్వ్యూకి వచ్చింది. తనకి స్టేట్ బ్యాంక్ లో చెయ్యాలనే కలతో వుంది. మూడింటికీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. మూడింట్లోనూ సెలక్ట్ అయ్యింది.  కానీ తను స్టేట్ బ్యాంక్ లోనే చేరాలనుకుంది. ఫస్ట్ అప్పాయింట్ మెంట్ నారాయణగూడా స్టేట్ బ్యాంక్ లో వచ్చింది. చాలా సంతోషించింది. అమ్మావాళ్ళు కనీసం ఉద్యోగం మంచిది దొరికిందని సంతోషించారు. 

మా మేనత్త కూతురు వాళ్ళింటికి దగ్గరలో అక్కలిద్దరూ కలిసి  ఉన్న రూంలోనే ఉండిపోయింది. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు. ఇల్లుగలవాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఒక కోటలాంటి గేటులోపల వున్న పోర్షన్లలో పది కుటుంబాలు వుండేవి. అందరూ కలిసికట్టుగా వుండేవాళ్ళు.  అందుకని అమ్మకి అక్క గురించి బెంగ వుండేది కాదు. ఒక రకంగా అమ్మ ధైర్యంగా వుండబట్టే అందరం సెటిల్ అవగలిగామేమో అనిపిస్తుంది. 

నేను తాడేపల్లిగూడెంలో స్కూల్లో ఉద్యోగం చేస్తుండగా పెద్దక్కకి 1980లో మొదటి పాప పుట్టింది. అప్పట్లో అక్కడ వున్నది ఒకే ఒక హాస్పిటల్. అక్క ఆంధ్రాబ్యాంక్ లో చేసేది కాబట్టి  హాస్పిటల్ వాళ్ళు బ్యాంక్ కస్టమర్స్ అవడంతో ఆ హాస్పిటల్ లోనే చేరింది. లేకపోతే పక్కవూరు తణుకు వెళ్ళవలసిన అవసరం వచ్చేది. పాపం అమ్మే హాస్పిటల్ లో వుంది. మే నెల  11వ తేదీన రాత్రి 8.30 కి అరిచేతిలో సరిపోయే బొమ్మలాంటి ఆడపిల్ల పుట్టింది. చక్కగా ముద్దుగా వుంది కానీ, అంత చిన్న పాపని చూసేసరికి మాకు చాలా భయం వేసింది.  అమ్మ రాత్రి తన పక్కన పడుకోపెట్టుకుంది. ఆ పాపమీదకి  అమ్మ ఎక్కడ వెళ్ళిపోతుందోనని రాత్రంతా ఇంట్లో వున్న నాకు నిద్రపట్టలేదు. 

అక్క డిస్చార్జ్ అవ్వడానికి 300 రూపాయలు కావలసి వచ్చింది. దానికోసం నేను ట్యూషన్ చెప్పేవాళ్ళదగ్గర ముందుగా తీసుకుని హాస్పిటల్ లో డబ్బులు కట్టి అక్కని ఇంటికి తీసుకువచ్చాము. వాళ్ళు వత్తిడి పెట్టలేదు కానీ... పద్ధతులు పద్ధతులే కదా... ఉన్నకొద్దీ డబ్బులు పెరుగుతాయి. బావగారు ఊరునించి వచ్చాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. అప్పట్లో గూగుల్ పే అవన్నీ లేవు. ఆయన ఎక్కడో బాడ్మింటన్ ఆడడానికి వెళ్ళి వెంటనే రాలేకపోయారు. 

పాపతోటి అమ్మకి పని ఎక్కువయింది. తాడేపల్లిగూడెంలోనే ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల సంవత్సరాలతరబడి ఒకే పనిమనిషి, ఒకే చాకలి వుండేవారు. అయినా ఇంట్లో పని ఎక్కువగానే వుండేది. నేను, మా చెల్లెలు స్కూల్లో టీచర్స్ గా ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము స్కూలుకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్క  బ్యాంక్ కి వెళ్ళిపోయేది. అమ్మకి అప్పటికి 41 సంవత్సరాలు. ఎంత ఓపిక లేకపోయినా అమ్మ ఎప్పుడూ కూచునే రకం కాదు. అమ్మకి పడుకునేందుకు నిద్ర వుండేదో లేదో తెలియదు.  మేము స్కూలు నుంచి వచ్చేసరికి పాపని పక్కన పెట్టుకుని విపులో, చతురో చదువుతూ పడుకునేది. 

ఇంటికి రాగానే పాపాయిని మేము చూసుకుంటూ వుండేవాళ్ళం. అమ్మ వంట చేసేది. పాపాయికి పదోనెల వస్తూండగానే దానికి మరో చెల్లెలు పుట్టింది. పెద్దపాప పేరు ఛాయ, రెండోదానిపేరు రత్న. ఇద్దరూ ట్విన్స్ లా వుండేవారు. రత్న ఏడిస్తే ఛాయ కూడా ఏడ్చేది. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం అయ్యేది కాదు. 

వాళ్ళని పెంచడానికి అమ్మకి మేమందరం సాయం చేసేవాళ్ళం. ఒకసారి అక్కావాళ్ళమామగారు పోయారని అక్కావాళ్ళు ముందర వెళ్ళిపోయారు. నేను, అమ్మ ఇద్దరం చెరొకళ్ళని వేసుకుని తాడేపల్లిగూడెం నుంచి తణుకు బస్ లో వెళ్ళి అక్కడ నుంచీ రిక్షాలో రేలంగి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేలోపున ఇద్దరూ బస్ లో ఒకటే ఏడుపు. అందరూ కవలపిల్లలా, దిష్టి తగిలిందేమో... తల్లిపాలు కాదా... అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. వాళ్ళకి గబగబా డబ్బాలో ప   పౌడర్ రెండు బాటిల్స్ వేసి, ఫ్లాస్క్ లోంచి వేడి నీళ్ళు పోసి పాలుకలిపి ఇద్దరికీ చెరో బాటిల్ ఇస్తే తాగేసి పడుకున్నారు. 

మొత్తానికి రేలంగి చేరాం. ఇల్లు పెద్దదవడంతో అందరికీ పడుకోవడానికి పెద్ద ఇబ్బంది అవలేదు. కానీ ఛాయ, రత్న ఇద్దరూ అందరూ మంచి నిద్రలో వుండగా ఏడుపు మొదలుపెట్టారు. ఆకలి కాదు. ఎందుకు ఏడ్చారో ఇప్పటికీ తెలియదు. అందరూ నిద్రలోంచి లేచి "పిల్లలు ముద్దుగా వున్నారు. దిష్టి తగిలిందేమో... దిష్టి తియ్యండి. లేకపోతే వాము నీళ్ళు పట్టండి" ఇలా సలహాలు ఇచ్చారు. మాకు వీళ్ల సంగతి తెలుసు కాబట్టి "ఏమీలేదు వీళ్ళిలాగే ఏడుస్తారు మీరు పడుకోండి" అని చెప్పాం. అందరూ నిద్రపోయారు. మర్నాడు మళ్ళీ ఏడిస్తే ఒక్కళ్లు కూడా నిద్రలోంచి లేవలేదు.