జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 13
అక్క వాళ్ళు హైదరాబాద్ రాగానే కొన్ని రోజులయ్యాక ఇప్పుడు ఉన్న రూము మా మేనత్త కూతురు వాళ్ళు చూపించారు.
ఒక పెద్ద కాంపౌండ్ మధ్యలో అంతా కుంకుడు, జామ, సపోట, చింత, సీతాఫలం వగైరా చెట్లన్నీ వుండేవి. చుట్టూరా రూములు. ఒక పక్క ఇల్లుగల వాళ్ళ పెద్ద పెంకుటిల్లు. రూములపైన బంగాళ పెంకులు. కానీ చుట్టూరా చెట్లు వుండడంతో చాలా చల్లగా వుండేది.
అందరూ ఉద్యోగాలు చేసుకునేవారు ఉండేవారు. ఒక రూములో మాత్రం ఒకతను వాళ్ల అమ్మతో వుండేవాడు. ఈ కాంపౌండ్ కి పెద్ద ఆకుపచ్చ రంగు గేటు వుండేది. అదొక రక్షణ కవచంలా వుండేది. దీనికి పప్పుకోట అని పేరు. అంతకు ముందు అక్కడొక పెద్ద మిల్లు వుండేదిట. ఈ గేటులోపల పప్పులు ఆరపెట్టేవారుట. గేటు దాటి బయటికి వెడితే చిన్న చిన్న ఇళ్ళు. ఆ ఏరియా పేరు మెహదీపట్నంలో ఉన్న గుడిమల్కాపూర్.
అక్క మర్నాడు బ్యాంక్ కి వెడుతూ "ఏమైనా పుస్తకాలు చదువుకో... బయట షాపులో ముసలామె వుంటుంది సాయంత్రం జొన్న రొట్టె చేసి ఇస్తుంది తీసుకో" అని చెప్పి వెళ్ళిపోయింది.
నేను అక్క ఆఫీసు నుంచీ వచ్చేలోపున షాపులో ఉన్న పెద్దామె దగ్గిరకి వెళ్ళి "అక్క జొన్నరొట్టె తీసుకోమంది" అన్నాను.
"అక్క కొలువుకు పోయినాది" అంది. నాకు అస్సలేమీ అర్థం కాలేదు. నేనేమీ మాట్లాకుండా చూస్తున్నాను.
"ఈ దినం చెయ్యనీకి రాలేదు బిడ్డా. రేపు చేసిస్తాను" అంది.
ఆ తెలంగాణ భాష వినడం అదే మొదలు కావడంతో కొంచెం కన్ఫ్యూజన్ తో "సరే" అని ఇంటికి వచ్చేశాను.
సాయంత్రం అక్క వచ్చాక చెప్పాను. "మెల్లిగా అర్థం అవుతుంది లే" అంది.
మర్నాడు పొద్దున్న తనతో బాటు ఆఫీసుకి రమ్మంది. ఇద్దరం కలిసి బస్ స్టాప్ కి వెళ్ళాం. అక్క ఎక్కాల్సిన డబుల్ డెక్కర్ నెంబర్ 5 బస్ వచ్చింది. అక్క పరుగు పెట్టుకుంటూ "తొందరగా రా" అంటూ ముందుకు వెళ్ళింది. నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడే వుండిపోయాను. వెనక్కి తిరిగి చూసి "ఇక్కడే వున్నావా? ఇలా అయితే కష్టం. చూడు నీ మూలంగా బస్ మిస్ అయిపోయింది" అని విసుక్కుంది.
నాకు అంత మంది జనాన్ని చూస్తే ఇబ్బందిగా అనిపించింది. పరిగెత్తడానికి నామోషీగా అనిపించింది.
మొత్తానికి ఇంకో బస్ ఎక్కి అక్కావాళ్ళ ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ నాకేం తోచలేదు. తను చాలా బిజీగా వుంది. వాళ్ళ ఆఫీసులో అటెండర్ ని ఇచ్చి దగ్గర వున్న లైబ్రరీకి పంపించింది. కానీ సిటీ కొత్త కావడంతో నేను మళ్ళీ అతనితోనే అక్క ఆఫీసుకి వచ్చేశాను.
ఇంతలోనే పెద్ద సౌండ్ వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే... విమానం పెద్ద సైజులో కనిపించింది. అప్పటి వరకూ ఊళ్ళలో చిన్న నక్షత్రంలా ఆకాశంలో చూడడమే కానీ... అంత దగ్గర నుంచి ఎప్పుడూ చూడలేదు. అప్పటికే నాలుగు సార్లు విమానాలు వచ్చాయి. చప్పుడయినప్పుడల్లా వెళ్ళి చూసేదాన్ని.
మధ్యాహ్నం లంచ్ టైములో తను రెగ్యులర్ గా టిఫిన్ చేసే హోటల్ కి తీసుకెళ్ళింది. హోటల్ లో పుస్తకాలు చదువుకుంటూ టిఫిన్ తినేదిట. అక్కడొక సర్వర్ అక్క దగ్గిర రెగ్యులర్ గా పుస్తకాలు తీసుకుని చదివేసి ఇస్తుండేవాడుట. నాకు తమాషాగా అనిపించింది. అతనికి నన్ను పరిచయం చేసింది. ఒక నవ్వునవ్వి. తన డ్యూటీ చేశాడు.
సాయంత్రం మళ్ళీ మెహదీ పట్నం వెళ్ళే బస్ ఎక్కి ఇంటికి చేరాం. అక్కకి వంట మీద పెద్ద ఆసక్తి వుండేది కాదు. తనకి తోచినది ఏదో చేసింది. ఇద్దరం తిన్నాం. ఈ దినచర్య ఇలా వుండేది.
నేను వచ్చింది ఉద్యోగానికి కాబట్టి అక్క ఒక ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకి తీసుకెళ్ళింది. ఆ ఆఫీసులో వాళ్ళు "ఎకౌంట్స్ రాయడంలో ట్రైనింగ్ ఇస్తాం. మొదటి పదిహేను రోజులూ జీతం ఇవ్వం" అన్నారు. అక్క ఆలోచించుకుని చెప్తాం అని వచ్చేసింది. ఆఫీసు మాత్రం చాలా పెద్దది.
అక్క "వాళ్ళు జీతం ఇవ్వకపోతే బస్ ఛార్జీలకి డబ్బులు కావాలిగా... మనకి కుదరదు లే" అంది.
సిటీ గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు.
తనకి తెలిసిన బాలకృష్ణ గారితో మా చెల్లెలికి ఉద్యోగం కావాలి అంది.
ఆయన మర్నాడు పొద్దున్న రమ్మన్నారు. అక్క, నేను బాలకృష్ణగారితో కలిసి యూసఫ్ గూడాలో ఉన్న ఆయన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం.
ఆయన పేరు ఎం.బి.ఆర్ రెడ్డి. ఇల్లు సినిమా సెట్టింగ్ లా వుంది. అక్కడే ఒక పెద్దాయన వున్నారు. ఆయన పేరు వెంకటరత్నం. ఆయన రెడ్డిగారి దగ్గర అకౌంటెంట్. అన్ని పరిచయాలు అయ్యాక రెడ్డిగారు "నేను అమ్మాయిని పటాన్ చెరు తీసుకుని వెడతాను. అక్కడ టైపిస్ట్ గా ఉద్యోగం ఇస్తాను" అన్నారు.
అప్పుడు నా పరిస్థితి గాలి ఎటు తోస్తే అటు వెళ్ళడంలా వుండేది. రెడ్డిగారు నల్లటి ఫియట్ కారులో నన్ను, వెంకటరత్నం గారిని పటాన్ చెరు ఆఫీసుకి తీసుకుని వెళ్ళారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి