8, మార్చి 2023, బుధవారం

*** ఒకరు పరాజిత *** - *** ఒకరు విజేత *** - 74

*** ఒకరు పరాజిత *** - *** ఒకరు విజేత *** - 74


పొద్దున్న సెల్ కి ఫోను “అమ్మా... నాగలక్ష్మిగారేనా... నా పేరు శోభ. నేను కబీర్ మఠం నుంచి చేస్తున్నాను. మిమ్మల్ని కలవడానికి వద్దామనుకుంటున్నాను. నేను మలక్ పేటలో వుంటాను. మీరు శ్రీనగర్ కాలనీలో వుంటారట కదా.. పదకొండు గంటలకి అమీర్ పేట వస్తాను. అక్కడ నుండి నాకు ఎలా రావాలో చెప్పండి” అని ఫోను పెట్టేశారు.

సరిగ్గా 11 గంటలకి అమీర్ పేట నుంచి శోభగారు ఫోన్ చేశారు. మా వారు గుర్తులు చెప్పారు. రోడ్డు మీదకి వెళ్ళి ఆవిడని తీసుకుని వచ్చారు. సన్నగా, తెల్లటి బట్టలతో వచ్చిన శోభగారిని చూస్తే నాకు వింతగా అనిపించింది. మనిషి చూడ్డానికి బాగానే వున్నారు. కూచోమని మంచినీళ్ళు ఇచ్చాం. మాకోసం ఒక అరడజను అరటిపళ్ళు తీసుకుని వచ్చారు.

“నేను చార్మినార్ దగ్గర శాలిబండలో కబీర్ మఠం వుంది. నేను అక్కడకి వెడుతూ వుంటాను. మలక్ పేటలో మా అబ్బాయి దగ్గర కూడా వుంటూ వుంటాను. కబీర్ జ్ఞానమందిర్ బెంగుళూరు వాళ్ళు హిందీ నుంచి తెలుగుకి అనువదించి కొన్ని పుస్తకాలు వెయ్యాలనుకుంటున్నారు. వారణాసిలో చాలా పెద్ద మఠం వుంది. అందరికీ తెలుగులో ముద్రించి ఆయన గురించి అందరికీ తెలియచెయ్యాలి. నాకు మీ సాయం కావాలి అన్నారు. ”

*** చిన్నప్పుడు 8వ తరగతిలో కబీర్ దోహాలు హిందీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన గురించి ఎక్కువ తెలియదు. అసలు గుర్తులేదు కూడా. శోభగారు కబీర్ దాస్ అని చెపుతూ వుంటే ఆశ్చర్యం వేసింది.***

మంచి ఎండలో వచ్చారు. కాస్త సేదదీరాక, “నాకు ఆకలిగా వుంది. నువ్వు ఏది తింటే అదే పెట్టమ్మా... మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేసరికి లేటవుతుంది” అన్నారు. మాకూ భోజనం చేసే టైమే కాబట్టి ఆవిడకి భోజనం పెట్టి, మేమూ భోజనం చేశాము. ఆవిడ పద్ధతిగా కింద కూచుని, ఆకులో వడ్డించమని తిన్నారు.

ఆవిడ గతంలో డిటిపి ఆపరేటర్, ఆబిడ్స్ లో ఒక ఆఫీసులో పనిచేసేవారట. వర్కు విషయంలో చాలా మంచి పేరు వుంది. వర్కు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఒకాయన కబీరు సూక్తుల గురించి, కబీర్ మఠం గురించి చెప్పి, ఆవిడని కబీర్ దాస్ అనుసరణి అయ్యేటట్లు చేశారు. ఇక అప్పటి నుంచి ఆవిడ రంగుల బట్టలు కట్టుకోవడం మానేసి తెల్లబట్టలే కట్టుకోవడం, పెద్దజడని తీసేసుకుని నిరాడంబరంగా వుండడం మొదలు పెట్టారుట. ఆవిడ భర్త ఏదో కారణంగా చనిపోయారు. అప్పటికి ఆవిడ వయసు చాలా తక్కువ. అయినా కూడా పిల్లలని జాగర్తగా పెంచి పెద్ద చేశారు. ఒకబ్బాయి హైదరాబాద్ లో చేస్తాడు. ఇంకో అబ్బాయి ఢిల్లీలోనో ఎక్కడో వుంటాడు.

మొత్తానికి చాలా కష్టపడి పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఆ మఠం వాళ్ళు చేసే కార్యక్రమాలకి వెడుతూ వుంటారు. మాకు ఆవిడ చిన్న పెద్ద కలిపి ఐదు పుస్తకాల దాకా డిటిపి ఇచ్చారు.





ఆ పుస్తకాలు ప్రూఫు చూసుకోవడానికి వాటి గురించి మాట్లాడడానికి వస్తూవుండేవారు. డబ్బులు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. అలా వచ్చినప్పుడు నాతో – “మీరు కొట్టొచ్చే రంగుల బట్టలు కట్టుకోకండి. ఎక్కువ తెల్లబట్టలు కట్టుకోవడానికి చూడండి. బయట వాళ్ళకి ఆకర్షణీయంగా కనిపించకండి. మీ అబ్బాయికి పెళ్ళి చెయ్యకండి. కోడలు వస్తే మిమ్మల్ని పట్టించుకోడు” అని చెప్పడం మొదలు పెట్టారు. నేను ఆ విషయాలు పట్టించుకునేదాన్ని కాదు. అప్పటికే మనుషులు ఒక్కొక్కళ్ళు ఒకోరకంగా వుంటారని అవగాహన అయ్యింది. కాబట్టి ఆవిడతో వాదించలేదు. నవ్వేసి వినేసి వూరుకున్నారు. అక్కడితో ఆ విషయాన్ని పొడిగించలేదు.

త్రిపురారి అని ఈవిడ గురువు బీహారులో వుంటారు. ఒకసారి మా ఇంటికి వచ్చారు. కబీర్ దాస్ మీద పాటలు రాయడం, ఆయన జీవితచరిత్ర ప్రచారం చెయ్యడం వీళ్ళపని. పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తుంటారు. పుస్తకాల ముద్రణకి అయే ఖర్చు ఆయనే భరిస్తారు. ఒకసారి త్రిపురారీ కూడా మా ఇంటికి వచ్చారు. “ముగ్గురం మీ ఇంట్లో భోజనం చేస్తాం” అని భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళకి తెలుగు రాదు.

ఇదంతా బాగానే వుంది ఆవిడ ఎండని, వానని లెక్కచెయ్యకుండా చాలా దూరాలు నడుచుకుంటూ మా ఇంటికి వస్తూండేవారు. తిండి విషయం అస్సలు పట్టించుకోరు. పిల్లలు చెప్తూనే వుంటారుట ఎక్కడ ఏది దొరకినా అంటే పళ్ళో, టిఫినో ఏదో ఒకటి తినమని. కానీ ఆవిడకి అప్పటికే చాలా అనారోగ్యాలు ఉన్నాయి. మా దగ్గిరకి వస్తున్నప్పుడే హెర్నియా ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు.

డాక్టరు ఆవిడ ముందు వాడే మందులు చూపించమని, వాటిలో ఒక టాబ్లెట్ వేసుకోకుండా ఆపరేషన్ కి ముందు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన మందులు వాడమన్నారుట. ఇంక మర్నాడు ఆపరేషన్ అనగా ఆవిడకి రాత్రి సీరియస్ అయిపోయింది. చక్కగా చకచకా తిరిగే ఆవిడకి పక్షవాతం వచ్చి ఒక వైపంతా చచ్చుబడిపోయింది. పిల్లలకి భారమయ్యింది.

ఫోను కూడా పట్టుకునే స్థితిలో లేదు. ఒక మనిషిని సహాయానికి పెట్టారు. డాక్టర్లు ముందు ఆవిడకి చెప్పినది టైముకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం, దాని వల్ల రోగనిరోధక శక్తి లేకపోవడం. వద్దన్న మందు వేసుకోవడం ఇంకో కారణం అని చెప్పారుట. ఏది ఏమైనా తనంత తను తిరగగలిగే శక్తిని కోల్పోయింది. ఒక్క పుస్తకం కూడా ముద్రణకి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి చూసి వచ్చాం. చాలా బాధ అనిపించింది. తను అనుకున్న పనులు పూర్తి చెయ్యలేకపోతున్నానని చాల బాధపడ్డారు. కానీ మఠం వాళ్ళు తెలుగు రాకపోయినా వాళ్ళు వచ్చి చేయించుకుంటామని ఫోన్లు చేస్తున్నారు.

ఈవిడ చెప్పిన మాట వినకుండా, ఒక టైము లేకుండా అలా మఠాల చుట్టూ తిరగడం ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చలేదు. ఇలా మూల పడేసరికి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. ఒకోసారి మనకి సంబంధం లేకుండా కొన్ని పరిస్థితులు వస్తాయి. కానీ చేతులారా చేసుకున్నదానికి జీవితాంతం బాధపడాలి.

మేము బయటికి వెడితే టైము దాటనివ్వం. ఏదో ఒకటి అందుబాటులో వున్నది తినేస్తాం. సాధారణంగా బ్యాగ్ లో పళ్ళో, బాదం పప్పులో ఏవో ఒకటి వుంటాయి. నీళ్ళు తప్పనిసరి. టైముకి తినడం ముఖ్యం.

***
***
***

*** ఓ విజేత ***

*** 8 పదులలో శరీరం సహకరించకపోయినా శక్తిని కూడదీసుకుని ఎంతో ఉత్సాహంతో....

మరంగంటి కాంచనమాల గారు ***



అనువదించిన "ఖలీల్ జిబ్రాన్" పుస్తకం మా చేతుల మీదుగా ముద్రింపబడింది. ఆవిడకి కావలసినట్లుగా కవర్ పేజి, పుస్తకంలో రావలసిన మేటర్ అన్నీ ఫోన్ లో చెప్పి చేయించుకున్నారు.

ఆవిడ రచించిన మరికొన్ని పుస్తకాలు కూడా తీసుకురావాలని అనుకున్నారు.
1958-60 వరకు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, సికింద్రాబాదులో...
1968-89 వరకు శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, తిరుపతిలో నృత్య అధ్యాపకురాలిగా చేశారు.

"వినాయక తాళము" విశేష అధ్యయనం, పరిశోధన చేసినందుకు గాను *** "కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ" *** నుంచి ప్రత్యేక స్కాలర్ షిప్ పొందారు.

1989లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి విశ్రాంత జీవితాన్ని కీసర వృద్ధాశ్రమంలో గడుపుతున్న వీరు గత సంవత్సరం ప్రపంచానికి దూరమయ్యారు.

వీరి రచనలు
1. శ్రీ రామానుజ సూక్తందాదు (స్తుతి)
2. గోదామురళి అను ఆంధ్ర తిరుప్పావై
3. మాయామహిత రూప రామచంద్ర పద్యకుసుమాలు
4. లీలాశుక యోగీంద్రిల సంస్కృత శ్రీకృష్ణ కర్ణామృత - తెలుగు సేత

వీరి పుస్తకం ‘ఆండాళ్ చరిత్ర’ చేశాం. కానీ అది ముద్రణకి వెళ్ళేలోపునే ఆవిడ ప్రపంచానికి దూరమయ్యారు.

ప్రఖ్యాత న్యాయవాదిగా పేరు గడించి న్యాయ శాస్త్రం మీద ఆంగ్లంలో అనేక పుస్తకాలు రచించిన ఎన్.కె.ఆచార్యగారి బంధువు.

ఆచార్య గారు 1955 నుండి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమీక్షలు విశ్లేషణలు చేసి ప్రజలకు అందించారు. ఆంధ్రజ్యోతిలో న్యాయ అంశాలపై వారంవారం శీర్షిక రాశారు. జి.యస్.భార్గవ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ గా వున్నప్పుడు అనేక వ్యాసాలు రాశారు. ప్రసారిత త్రైమాస పత్రిక వెలువడినప్పుడు ఎన్.ఇన్నయ్య, పి. సత్యనారాయణ సంపాదకులుగా ప్రచురిస్తుండగా ఆచార్యగారు ప్రామాణికమైన రచనలు కొన్ని చేశారు.అబ్బూరి రామకృష్ణారావు, లక్ష్మణశాస్త్రి జోషి, జె.బి.హెచ్. వాడియా వంటి నాయకులు హైదరాబాదు వచ్చినప్పుడు వారి ప్రసంగాలకు ఏర్పాటు చేసి తోడ్పడ్డారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి