15, మే 2023, సోమవారం

*** జూబిలీ హిల్స్ లో అందాల పర్ణశాల – చిరు సాహితీ సదస్సులకి ఆలవాలం *** - 85

 *** జూబిలీ హిల్స్ లో అందాల పర్ణశాల – చిరు సాహితీ సదస్సులకి ఆలవాలం *** - 85


నా జీవనయానంలో చాలామంది పరిచయాలు మా రెండో అక్క రమాసుందరి (స్టేట్ బ్యాంక్) ద్వారా అయ్యాయి. అక్క స్టేట్ బ్యాంక్ లో పనిచేసినప్పుడు తన సహఉద్యోగిని మైనంపాటి విమల గారు. ఆవిడ ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ గారి శ్రీమతి. తనకి వాళ్ళ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం వుండేది. వాళ్ళు యూసఫ్ గూడాలో వున్న కె.కె.టవర్స్ లో వుండేవారు.


వాళ్ళకి “జూబిలీ హిల్స్ రోడ్ నెం. 39లో పర్ణశాల అని ఒక ఇల్లు వుంది. అప్పుడప్పుడూ ఒకవారం పదిరోజులు వాళ్ళు అక్కడ గడుపుతుంటారు. అది ఒక కుటీరంలా వాళ్ళు కట్టుకున్నారు. ఇంటి చుట్టూరా చెట్లు. ఊళ్ళలో ఇల్లులా వుంటుంది. ఆ ఇంటి మూల ఒక చిట్టి నీటి గుంట వుంది. దాంట్లో వర్షానికి నీళ్ళు నిండుతూ వుండేవి. ఆ నీళ్ళలో జలకాలాడడానికి చిన్న చిన్న పక్షులు సందడి చేస్తుంటాయి. అక్కడ స్నేహితులందరం సరదాగా గడుపుతాం” అని అక్క చాలాసార్లు చెప్పింది.

నాకూ చాలా చూడాలనిపించేది. అనుకోకుండా ఒకసారి అక్కడ మైనంపాటి భాస్కర్ గారు, విమలగారు ఒక 20 మందితో చిరు సాహితీ సదస్సు ఏర్పాటు చేశారు.

రెండు పడక గదుల ఒక బంగాళ పెంకు ఇల్లు. చుట్టూరా ఖాళీస్థలం. వెళ్ళేదారంతా బాదం చెట్లు, మామిడి చెట్లు, ఉసిరి చెట్లు, అరటి చెట్లు, అక్కడక్కడ పువ్వుల మొక్కలు. అక్క చెప్పిన నీటి గుంట కూడా చాలా బావుంది. దాంట్లో చిట్టికప్పలు వేసే గంతులకి నీళ్ళు చెల్లాచెదురై ఒక వింత శబ్దాన్ని చేస్తున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న పక్షులు ఆ నీటి దగ్గర సందడి చేస్తున్నాయి. ఇంటిముందు ఒక పెద్ద అరుగు చుట్టూరా పిట్టగోడలు. లోపలికి వెళ్ళగానే చిన్న హాలు, వంటగది, రెండు పడకగదులు. అసలు అక్కడ అలాంటి ఇల్లొకటి వుందని ఎవరికీ తెలియదు.



అక్కడ ఆ అరుగుమీద ఆందరం కూచుని సమావేశం మొదలు పెట్టాం. కొంతమంది కవితలు చదివారు, కొంతమంది పాటలు పాడారు, మరికొంతమంది కథలు చదివారు. సరస్వతి అని ఒకావిడ చక్కటి నృత్యం చేసి ఆనందపరిచారు. చాలా ప్రశాంతంగా జరిగింది. మధ్య మధ్యలో కోయిల కూతలు, పక్షుల కిలకిలారావాలు, అప్పుడప్పుడు రాలిపడే ఎర్రటి బాడిద పువ్వులు, గాలితో కలిసి వెదజల్లుతూ నాసికని తాకి వెడుతున్న జాజిపూల సువాసనలు. చాలా చక్కటి వాతావరణం. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకనిది. కానీ వాళ్ళు చెప్పిన ఒక విషయం మాత్రం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అప్పుడప్పుడు పాములు వచ్చి ఆ అరుగుమీద విశ్రమిస్తాయిట. వీళ్ళని ఏమీ అనేవి కాదుట. అది చెప్పాక కొంచెం భయం వేసింది. కాళ్ళతో చప్పుడు చేస్తే వెళ్ళిపోతాయని చెప్పారు.

సమావేశం అయ్యాక అందరం తీసుకువచ్చిన తలొక వంటకం ఆ పిట్ట గోడల మీద పెట్టి ఎవరికి కావలసినది వాళ్ళు తిని భోజనం కానిచ్చాం. అన్నీ ఇంట్లోచేసినవే కాబట్టి విందు మహా పసందుగా వుంది.


ఈ సమావేశానికి దగ్గరలోనే వున్న ఆయన స్నేహితుడు రాజారావుగారిని పిలిచారు. ఆయన రాలేదు. ఎందుకు రాలేదో అని ఫోన్ చేస్తే మీరందరూ మా ఇంటికి రండి అన్నారు.

***
***

*** రాజారావుగారి ఇల్లు సంగీత సాహిత్యాలకి నిలయం***

మేమేం రాజారావుగారి గురించి ఎక్కువ ఊహించుకోలేదు. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ అధిపతి అని మాత్రం తెలుసు. కానీ భాస్కర్ గారితోబాటు మేమందరం వాళ్ళింటికి వెళ్ళాం. వెళ్ళేదారి ఒక పెద్ద కారు పట్టేంత వుంది. అది దాటి లోపలికి వెడితే ఇంద్రభవనంలాంటి పెద్ద భవనం.

అందరం ఇంటి లోపలికి వెళ్ళాం. మీరు నమ్మరు రెండు పెద్ద పెద్ద సింహాలలాంటి కుక్కలు. విలాసంగా నడుచుకుంటూ వచ్చాయి. అయిదడుగుల పొడవు వున్నాయి. అవి అందరి దగ్గరకీ వచ్చి, మొహాల్లోకి చూస్తూ ఒకసారి తగిలుతూ, వాసన చూస్తున్నాయి. మా అమ్మాయి ఇంటర్ చదువుతోంది. తను గబగబా సోఫా ఎక్కి నుంచుంది. ఇంతలోనే ఆ రావుగారు వచ్చారు. ఆయన ఏడడుగుల పొడవు వున్నారు. సోఫాల్లో బిగదీసుకుని కూచున్న మమ్మల్ని చూసి, “ఏమీ ఫర్వాలేదు. అవి ఏమీ చెయ్యవు. సుందరీ, సుబ్బారావు అలా కూచోండి” అన్నారు. ఆ కుక్కలపేర్లు సుందరి, సుబ్బారావు.

మమ్మల్నందరినీ పలకరించి పేర్లు తెలుసుకుని, మా అమ్మాయిని వీణాధరి పేరు చక్కగా వుంది. నీకు పాటలు వచ్చా అన్నారు. సంగీతం నేర్చుకుంటున్నాను అని చెప్పింది. ఆయనికి సంగీతం అంటే చాలా ఇష్టంట. కొన్ని పాటలు పాడించుకున్నారు.

ఆయన ఇల్లంతా అడుగడుగునా చూపించి, ఏది ఎలా కట్టారో వర్ణించి చెప్పారు. పైకి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆయన సంగీత సాధన చేసుకునే హాలు వుంది. వీణ పట్టుకుని కూర్చుని కొన్ని పాటలు వాయించి వినిపించారు. మళ్ళీ మా అమ్మాయిచేత కొన్ని అన్నమాచార్య కీర్తనలు పాడించుకున్నారు. సంగీతం మా ఇంట్లో ప్రతిధ్వనిస్తుంది అన్నారు. సుందరీ, సుబ్బారావు (కుక్కలు) ఆయన ఎక్కడికి వస్తే అక్కడికే వస్తున్నాయి. వాటికి జయ, విజయ అనే పిల్లలు.

ఆ తర్వాత చెక్కమెట్ల మీద నుంచీ పైన ఉన్న అతి చిన్న ఇల్లు చూపించారు. ముచ్చటగా డైనింగ్ హాలు, ఒక బెడ్ రూము. టీవీ, ఎసి – మొత్తానికి ఒక భార్యా, భర్త ఉండడానికి సరిపడిన ఇల్లు. బావుంది. మేము ఆ మెట్లు ఎక్కేలోపునే సుబ్బారావు (కుక్క) గబగబా పైకి ఎక్కేసి రావుగారి దగ్గరికి వెళ్ళి ఆయి బుజాల మీద చేతులు వేసి ఆయనంత పొడుగు సాగింది. మేము నోళ్ళు తెల్లబెట్టి చూస్తూండిపోయాం.

ఆ ఇంట్లో ఆ నలుగురు సినిమా తీశారు. సినిమావాళ్ళు అప్పుడప్పుడు షూటింగులు చేస్తుంటారు అని చెప్పారు. మాకు వాళ్ళింట్లో చిరు ఆతిథ్యం ఇచ్చారు. ఇంటి వెనక వైపు ఒక చిన్న స్టేజి, లాన్ వున్నాయి. అప్పుడప్పుడు లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ నుంచి పిల్లలని, రకరకాల సంగీత, సాహిత్యకారులని పిలిచి చిన్న చిన్న సమావేశాలు చేస్తుంటానని చెప్పారు. వాళ్ళకి చిరు సత్కారాలు చేస్తారుట.

పర్ణశాల తర్వాత మళ్ళీ - సంగీత, సాహిత్యకారుడి ఇల్లు చూశాం. ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. ఒకసారి మా అడబడుచు (నండూరి రామమోహనరావుగారి పెద్దకోడలు) కూతురు అమెరికా నుంచి వస్తూ నెలరోజులకి ఒక ఇల్లు ఏదైనా కావాలన్నారు. మైనంపాటి భాస్కర్ గారిని అడిగి ఈ పర్ణశాలని వాళ్ళకోసం ఏర్పాటు చేశాం. వాళ్ళు నెలరోజులూ అక్కడ చాలా ఆనందంగా గడిపారు.

*** నండూరి రామమోహనరావుగారంటే మైనంపాటి భాస్కర్ *** గారికి అంతులేని అభిమానం. రామమోహనరావుగారి మనవరాలి పెళ్ళి హైదరాబాదులో జరుగుతోందని తెలిసి, ఆయన గురించి తెలుసు కానీ, ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. మాకు పరిచయం చెయ్యండి అని అడిగారు. మా వారికి చెల్లెలికి మామగారే కాబట్టి, ధైర్యంగా విమలగారినీ, భాస్కర్ గారినీ పెళ్ళికి రమ్మని ఆహ్వానించాం. వాళ్ళు నండూరి రామమోహనరావుగారిని కలిసి చాలా సేపు మాట్లాడారు. పెళ్ళి అంతా చూశారు.

తర్వాత నేను మైనంపాటిగారిని కలిసినప్పుడల్లా ఎంతోసంతోషంగా మీమూలంగానే మేము నండూరి గారితో మాట్లాడగలిగాం అని చెప్పారు. ఆయన సంతోషం చూసి నేనూ సంతోషించాను, ఆశ్చర్యపోయాను.

తర్వాత రామ్మోహనరావుగారి మనవరాలు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒక గెస్ట్ హౌస్ లాగా ఫర్నిచర్ తోపాటు ఒక నెలరోజులకి ఆ ఇల్లు ఇచ్చారు. అక్కడ అందరం చాలా ఆనందంగా గడిపాం. మా అత్తగారికి చాలా బాగా నచ్చింది.






***
***

భాస్కర్ గారు 68 సంవత్సరాల వయసులో కిడ్నీ సమస్యతో డయాలసిస్ మీద వుండేవారు. కానీ అలా వున్నా కూడా ఆయన బస్ పాస్ తీసుకుని వాళ్ళింటి దగ్గర బస్ ఎక్కి, అది ఎక్కడికి వెడితే అక్కడికి చివరి వరకూ వెళ్ళి, మళ్ళీ అదే బస్సులో ఇంటి దగ్గర దిగేవారు. ఇలా రోజుకి ఒక చోటికి వెళ్ళేవారు. ఇంట్లో కూచుంటే నా సమస్యతోనే సతమతమవుతాను. బయటికి వెడితే అందరి సమస్యలు తెలుస్తాయి అనేవారు. చివరి నిమిషం వరకూ ఆనందంగానే గడిపారు.

దాదాపు 30 నవలలు, 100కిపైగా కథలు రచించారు. ఆయన రచనల్లో ఎక్కువ సైన్స్ ధృక్ఫథం (ఫిక్షన్)తో ఉన్నా యి. 1994లో ఆయన రచించిన బుద్ధిజీవి అనే నవల ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఆయన నవలల్లో బివేర్ ఆఫ్ గాడ్స్ అనేది పలు భాషల్లో ప్రచురించబడింది. వెన్నెలమెట్లు నవల ఆధారంగా ‘అరుణకిరణం' సినిమా తీశారు. మైనంపాటి రచించిన సైన్స్ ఫిక్షన్ నవలలు కొన్ని వా షింగ్టన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరిచారు. సినిమా సమీక్షలను కూడా రాసి ఆ రంగం వారి ఆదరాభిమానాలను పొందారు. కొంత కాలం ఇఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగం చేసిన మైనంపాటి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆ మిగిలిన సమయాన్ని రచనలు కోసం వినియోగించారు. ఆయన రచించిన నవలలు, కథలు దేశ, విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాయి.







3 కామెంట్‌లు:

  1. ఇప్పుడు జూబిలీ హీల్స్ లోనయినా చెట్లు, పక్షులు ఎక్కడున్నాయండీ? అంతా కాంక్రీట్ జంగిల్.

    రాజారావు గారంటే త్రిపురనేని రాజారావు గారా? ఒక సాఫ్ట్-వేర్ సంస్దకు అధిపతి. వారే గనుక అయితే నాకు పరిచయస్తులే. అవును, వారికి సాహిత్య సంగీతాభిలాష ఎక్కువే.

    రిప్లయితొలగించండి
  2. ఇది ఇప్పటి సంగతి కాదు సర్. వారి భార్య విమల గారు దానిని 7 కోట్లకి అమ్మేసి 5 సంవత్సరాల కిందట అమెరికా వెళ్ళిపోయారు. వారికి కెకె టవర్స్ లో కూడా ఒక ఫ్లాట్ వుండడంతో అటూ ఇటూ తిరుగుతుంటారు.

    సాఫ్ట్ వేర్ సంస్థ అధిపతి రాజారావుగారే... వారి ఇంటిపేరు తెలియదు. చాలా మంచి వ్యక్తి. ధన్యవాదాలు సర్ మీకు.

    ఇంతకీ రాజారావుగారు ఇండియాలోనే ఉన్నారా...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పర్ణశాల స్థలంలో పెద్ద బిల్డింగ్ వచ్చేసిందేమో కూడా

      తొలగించండి