జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు -2
విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే రాజు అధీనంలో క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి అనే ఒక పెద్దమనిషి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. వాటిలో ఏలేటిపాడు కూడా వుండేదిట.
ఇక్కడ కొన్ని శతాబ్దాల కిందటి శివాలయం కూడా వుంది. అమ్మ వాళ్ళు ఆ గుడి ప్రాంగణంలో ఆడుకుంటూ వుండేవాళ్ళమని చెప్పింది.
అదిగో ఆ ఫోటోలో వున్న ఇల్లు మా అమ్మ పుట్టిన ఇల్లు.
అనురాగాల లోగిలి
మా అమ్మావాళ్ళ అమ్మ అమ్మ పుట్టిన ఏడాదికే చనిపోతే అమ్మని మేనమామలు అపురూపంగా పెంచారు. అసలు ఎవరూ కింద దింపేవారు కాదుట. వాళ్ళ ఆప్యాయతల గురించి అమ్మ చెప్తుంటేే కడుపు నిండిపోయేది.
అమ్మ ఒక జోలపాట పాడేది…
“అమ్మాయి మామల్లు ఎటువంటి వారూ… అంచుపంచెల వారు అంగీల వారూ…” అని నిజంగానే అలాగే వుండేవారు.
ఆ ఇంటి ఆరుగుల మీద అమ్మావాళ్ళు ఏ సీజన్ లో పువ్వులు ఆ సీజన్ లో అరుగుల మీద పోసుకుని దండలు కట్టి జడల్లో పెట్టుకునేవారట. అమ్మ ఆ దృశ్యాలు వర్ణిస్తుంటే కళ్ళకి కట్టినట్లు వుండేది. అందరికి ఇంటి వెనక పెద్ద పెద్ద స్థలాలు వుండడంతో రకరకాల పువ్వుల చెట్లు పెంటుకునేవారు.
మాకు ఒకసారి అమ్మ మేనమామ పట్టెయ్య శాస్త్రులుగారు, అత్త వెంకాయమ్మగార్ల ఆప్యాయతని పొందే అవకాశం వచ్చింది. ఆ ఇంట్లో అడుగుపెట్టే అదృష్టం కూడా వచ్చింది. నేను, మా చెల్లెలు ప్రభావతి ఒకసారి వెళ్ళాం. మమ్మల్ని ఎంతో బాగా ఆదరించి, మా ఇద్దరికీ చక్కగా పీట వేసి వెండి కంచాల్లో వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు. గుమ్మడి వడియాలు, మంచి పాడి నెయ్యి, వంకాయకూర, ఘుమఘుమలాడే ఇంగువ చారు, గడ్డపెరుగుతో భోజనం పెట్టారు. ఆ రుచి ఇప్పటికీ మరిచిపోలేం. ఆప్యాయత మరుగుపడే అవకాశమే లేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి