21, అక్టోబర్ 2022, శుక్రవారం

ప్రముఖులతో, ప్రముఖ సంస్థల పనులతో బిజీ బిజీ - 55

 ప్రముఖులతో, ప్రముఖ  సంస్థల పనులతో బిజీ బిజీ - 55


*** ఈశాఫౌండేషన్ ***



ఈ హడావుడిలో మా ఫ్రెండ్ నృత్యకళాకారిణి సరళ గారు వచ్చి, "నాగలక్ష్మిగారూ నేను ఈశాఫౌండేషన్" కి వెళ్ళాను. వాళ్ళు నాకు బాగా పరిచయం వాళ్ళ 'ఈశా రుచులు' పుస్తకం నాకు బాగా నచ్చింది తమిళ్ లో వుంది. మీ వారికి తమిళ్ వచ్చు కదా...! తెలుగులో చేస్తారా...?" అని అడిగారు.

ఆయనకి తమిళ్ బాగా వచ్చినా ఆఫీసు వర్కుతో అసలు టైము వుండదు. పైగా ఇంతకుముందు పడడం వల్ల కొంచెం వీక్ గా వున్నారు. అక్కావాళ్ళింటి పక్కన ఒక తమిళ్ ఆవిడ, తెలుగు ఆవిడ వున్నారు. "పనేదన్నా వుంటే చెప్పండి బోరు కొడుతోంది" అని ఒకసారి అన్నారు.

    పుస్తకం అర్జంటు కాదుకాబట్టి ... సరే అని అవన్నీ ఇద్దరినీ కలిసి తెలుగులో చెయ్యమని ఇచ్చాను. తమిళ్ ఆవిడకి తెలుగు మాట్లాడడం వచ్చు. తెలుగు ఆవిడ ఆవిడ చెప్పేది రాసుకుని మొత్తానికి పూర్తి చేశారు.

పనయ్యాక ఇద్దరికీ కలిపి ఒక 7 వేలు ఇచ్చాను. ఎంత సంతోషించారో. ఇంట్లో వుండి సంపాదించుకున్నామని ఆనందపడ్డారు. ఇంకేమైనా చెప్పండి చేస్తాం అన్నారు. అప్పుడప్పుడూ కొన్ని కంపేర్ చేసి పెట్టమని ఇచ్చేదాన్ని. ఎంతోమంది ఏ పని దొరుకుతుందా అని చూసేవాళ్ళూ వున్నారని అర్థం అయ్యింది.

నేను పుస్తకం అంతా రెడీ చేసి సరళగారికి ఇచ్చాక దాన్ని ఈశా వాళ్ళు ఎమెస్కో వాళ్ళకి ప్రింట్ కి ఇచ్చినట్లు తెలిసింది.

తర్వాత ఈశా నుంచి వ్యాసాలు వాళ్ళు ఇ-మెయిల్ లో పంపిస్తుంటే చేసి పంపించేదాన్ని. రమ్మని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటి వరకూ అస్సలు కుదరలేదు.


నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచీ కంప్యూటరే లోకంగా ఉంటూంటే... సాయంత్రం అయ్యిందంటే మా పక్కన పోర్షన్ల వాళ్ళందరూ... అక్కడున్న అరుగు మీద చేరి, కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఒక్కసారి నేను వాళ్ళలో లేనందుకు మనసులో మధనపడ్డాను.

కానీ మరొక్కసారి ఆలోచిస్తే... వాళ్ళు నన్ను రావద్దని అనలేదు, నవ్వద్దనీ అనలేదు. నేనంటే వాళ్ళందరికీ చాలా ప్రేమ. నా మాటకి ఎప్పుడూ విలువిస్తారు. నేనెప్పుడు ఖాళీగా దొరుకుతానా అని చూస్తుంటారు. అయినా వాళ్ళపని వేరు, నా పని వేరు కదా అనుకుంటూ పొద్దున్న చెయ్యాల్సిన పని హడావుడిలో పడ్డాను. జీవితం చిన్నది కాబట్టి ఎక్కడికక్కడ ఆనందంగా వుండడం నేర్చుకున్నాను.
గుడిపూడి శ్రీహరిగారు


ఇంతలో మా ఇంటికి దగ్గరలోనే వున్న ప్రముఖ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరిగారు వచ్చి, “ఏమ్మా ఏంచేస్తున్నావ్? వాకింగ్ వెడుతూ ఇటు వచ్చాను. నాకు వర్కు చేసిపెట్టావు కదా.... డబ్బులిద్దామనీ - నా పేరు మీద, మీ ఆంటీ (హోమియో డాక్టర్) పేరు మీదా కొన్ని విజిటింగ్ కార్డులు కావాలి మేటర్ ఇద్దామనీ వచ్చాను. యూసఫ్ గూడాలో సత్యవాణి గారు ఉంటారు. నీకు ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తాను వెళ్ళి కలు. నీ గురించి చెప్పాను” అని వెళ్ళిపోయారు.

*** పలుకు తేనెలతల్లి సత్యవాణి గారు అంటారు ***



గుడిపూడి శ్రీహరి గారు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి టైం తీసుకుని సత్యవాణిగారింటికి వెళ్ళాను. ఇంటి ముందు రంగు రంగుల గులాబీలతో ఇల్లు చక్కగా వుంది. లోపలికి వెడుతుండగానే ఆవిడే ఎదురు వచ్చారు. ఎర్రటి అంచున్న ముదురు ఆకుపచ్చ చీరలో చక్కటి అందమైన, నిండైన విగ్రహం. మొహంలో ఒకలాంటి వర్చస్సు. చక్కటి నవ్వు. ఆవిడని చూస్తుంటే అలాగే చూస్తూన్న నన్నుచూసి – “నీ పేరు నాగలక్ష్మి కదమ్మా శ్రీహరి గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. రామ్మా... కూచో” అని ఆదరపూర్వకమైన మాటలతో పిలిచారు.

*** పుల్లారెడ్డి స్వీట్స్ కూడా మా కంప్యూటర్ ని వదలలేదు ***




***జీవితంలో మొదటిసారి సన్మానం***

సత్యవాణిగారు “నాగలక్ష్మీ... పుల్లారెడ్డి స్వీట్స్ సంస్థాపకులు (1948 కర్నూలు) పుల్లారెడ్డిగారు, ఒక పుస్తకం వేస్తున్నారు. దాన్ని నువ్వు డిటిపి చేసి ప్రింట్ కి రెడీ చెయ్యాలి” అని దానికి సంబంధించిన పేపర్లు కొన్ని నా చేతులో పెట్టారు. ఆ పుస్తకాన్ని అనుకున్న టైం పూర్తి చేశాను. ప్రింట్ కూడా అయిపోయింది. ఆదివారం సాయంత్రం సనత్ నగర్ లో శంకర్ యాదవ్ గారు స్థాపించిన హిందూ పబ్లిక్ స్కూల్ పక్కనే, ఆయన కట్టించిన దేవాలయాల ఆవరణలో పుస్తకావిష్కరణ జరిగింది.

ఆ పుస్తకావిష్కరణ సభలో నన్ను స్టేజి మీదకి పిలిచి నాకు పుల్లారెడ్డిగారిచేత శాలువా కప్పించి, నాకు స్వీట్ ప్యాకెట్, పుస్తకం, ఒక మెమెంటో ఇప్పించారు. ఎన్నో పుస్తకాలు చేసినా... స్వయంకృషితో పైకొచ్చిన గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నాకు మొదటిసారి సన్మానం జరిగింది. సన్మానాల గురించి ఏమీ తెలియనిదాన్ని కాబట్టి సంతోషంగానే అనిపించింది. ఒక నిమిషం ఆయనకి నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పి స్టేజి మీద నుంచి కిందకి వచ్చాను.

*****

*** ***నాంపల్లిలో ఉన్న పుల్లారెడ్డి నేతి మిఠాయిలు అంటే అందరికీ చాలా ఇష్టం. హైదరాబాదు ఎవరైనా వస్తున్నారంటే ముందు పుల్లారెడ్డి స్వీట్స్ కొనుక్కున్న తర్వాతే వేరే ఏమన్నా కొనుక్కునేవారు. అప్పటి వరకూ నేతితో చేసిన స్వీట్స్ ఎక్కడా దొరికేవి కాదు. నాంపల్లి కూడా అంత రద్దీగా వుండేది కాదు కాబట్టి స్వీట్ షాపుని తేలికగా గుర్తుపట్టగలిగేవాళ్ళం. ఇంకెక్కడా బ్రాంచిలే వుండేవి కాదు. ఎంతో అపురూపంగా తినేవాళ్ళం. మా బాబాయి కొడుకు మెహదీపట్నంలో మా దగ్గిరకి వచ్చినప్పుడు ఆ షాపు నుంచి జీడిపప్పు పాకం తెచ్చేవాడు. బలే రుచిగా వుండేది. దసరా వచ్చినా, న్యూ ఇయిర్ వచ్చినా షాపు దగ్గిర ఎప్పుడూ రద్దీయే. ఇప్పుడు చాలా చోట్ల పెట్టారు. కానీ ఆ రుచే వేరు అనిపిస్తుంది. *** ***

*****

ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత సత్యవాణిగారు మళ్ళీ పిలిపించి మాది ***సత్యపథం మాసపత్రిక*** ఉంది. నేను ఎలా చెయ్యాలో చెప్తాను. నువ్వు చేసిపెట్టాలి అన్నారు. మియాపూర్ దగ్గిర దీప్తి శ్రీనగర్ లో ఉన్న ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన పత్రిక అది. మొదట్లో ఆవిడ రాసిచ్చేవారు కానీ, రాను రాను నువ్వే ఏవి పెడితే బావుంటుందో చూసి మాగజైన్ తయారు చెయ్యమన్నారు. 16 పేజీల పుస్తకం కాబట్టి నేను ఆవిడకి నచ్చినట్టుగా చేసి ఇస్తున్నాను.

ఈ ధర్మపురి క్షేత్రంలో మొదట అమ్మవారి గుడి ఒక్కటే వుండేది. క్రమక్రమంగా అక్కడ రకరకాల దేవాలయాలు వచ్చేసి, రకరకాల కార్యక్రమాలతో సందడిని సంతరించుకుంది. వెళ్ళే దారంతా నిర్మానుష్యంగా వుండేది. అక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు బిక్కు బిక్కుమంటూ వుండేవి. ఇప్పుడదంతా ఒక ఊరులాగా అయిపోయింది.

ఇవన్నీ అటుంచి ఆవిడ ఆధ్యాత్మికత గురించి కానీ, సమాజ సేవని గురించి కానీ, సామాజిక స్పృహ గురించి కానీ మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క పేపరు చూడకుండా లోపల రికార్డయిన చిప్స్ పెట్టుకున్నట్లు అనర్గళంగా మాట్లాడతారు. స్కూళ్ళకి వెళ్ళి స్టూడెంట్స్ జీవితాన్ని గురించి చెప్తారు. ఆవిడ గురించి తెలియని వాళ్ళండరు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకుండా వాళ్ళలో గొప్పతనాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోవలసినవి చాలా కనిపిస్తాయనిపిస్తుంది నాకు.
సత్యవాణిగారు వాళ్ళ ఇంటి ఆడబడుచులాగా నాకు ఆరునెలలకి ఒక చీర ఇస్తుంటారు. నేను ఇప్పటి వరకూ ఆవిడ చేతుల మీదుగా 30 చీరలు అందుకున్నానేమో... ఇవన్నీ జీవితంలో ముఖ్యం కాకపోయినా. ఎప్పటికీ నన్ను వాళ్ళింటి మనిషిలా చూడ్డం చాలా సంతోషం కలిగించే విషయం. మా పిల్లల పెరుగుదలని, అంచెలు అంచెలుగా పెళ్ళిళ్ళు అయేవరకూ చూసిన వాళ్ళలో ఆవిడ ఒకరు. ఆ అనుబంధం ఇప్పటి వరకూ కొనసాగుతూనే వుంది.

ఆవిడ పరిచయంతో ఎంతోమంది ప్రముఖులు పరిచయం అయ్యారు. నేను కొన్నిసార్లు ఆవిడ వర్కు గురించిన వివరాలకోసం మియాపూర్ వెడితే సత్యవాణిగారి మనిషిగా నన్ను ధర్మపురి క్షేత్రంలో వాళ్ళు కూడా అభిమానంగా అదరిస్తారు. నాకు ఫోన్ లో ఏదో ఒకటి డిక్టేట్ చేస్తూ వుంటారు. వాళ్ళ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమానికి కావలసిన ఆహ్వాన పత్రికలు, రకరకాల లెటర్లు నేనే చేసి ఇస్తుంటాను. వాళ్ళ అల్లుడికి, అమ్మాయికి మా అబ్బాయి వెబ్ సైట్స్ చేసి ఇచ్చాడు.

నాకు ఎవరితో పరిచయం అయిన ఎవరైనా సరే వృత్తి ధర్మం నెరవేర్చడమే నాధ్యేయం అనుకునేదాన్ని.
***

*** ఋషిముఖ్ – ఆర్ట్ ఆఫ్ లివింగ్ (శ్రీ శ్రీ రవిశంకర్) మాసపత్రిక తెలుగులో ***


అప్పటి వరకూ ఇంగ్లీష్ లో ఉన్న ఋషిముఖ్ ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు తెలుగువారికోసం తెలుగులో చెయ్యాలనుకున్నారు. రవిశంకర్ గారి శిష్యులైన ముఖ్య శిష్యులైన సంధ్య గారు, మూర్తి గారు మా అడ్రస్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. కలర్ వర్క్ చెయ్యడం అప్పటికి నాకు ఇంకా అలవాటు అవలేదు. బెంగుళూరు నుంచి ఇంగ్లీషులో చేసిన వాళ్ళ నుంచి నాకు ఫోనులో కొరెల్డ్రా సాఫ్ట్ వేర్ లో ఎలా చెయ్యాలో చెప్పించారు. వాళ్ళు పంపిన ఇంగ్లీషు పత్రిక నమూనా చూసి తెలుగు మేగజైన్ ని సెట్ చేసేదాన్ని.

సంధ్యగారు, మూర్తిగారు చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు ఓపికగా కూచుని ప్రతి చిన్నదీ జాగ్రత్తగా చేయించుకునేవారు. సంధ్య గారు చక్కటి గొంతుతో పాటలు బాగా పాడతారు. మొత్తానికి వాళ్ళ వలన కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాను. ఇంచుమించు చాలా నెలలే ఆ మాగజైన్ తెలుగులో నేను చేశాను. తర్వాత వాళ్లు బెంగుళూరులో ఉన్న వాళ్ళ ఆఫీసులో అన్ని భాషలకి సంబంధించిన ఆపరేటర్లని వేసుకుని వాళ్ళు చేసుకోవడం మొదలు పెట్టారు.

2 కామెంట్‌లు:

  1. చాలా మంది ప్రముఖులతో పరిచయాలు కలిగాయే! గుడ్.
    మొదటి సన్మానం జరిగినందుకు అభినందనలు. మరిన్ని జరుగుతాయని ఆశిస్తాను.

    ఈశా వారి రెస్టారెంట్ ఒకటి జుబిలీహిల్స్ లో ఉంది. ఎప్పుడైనా వెళ్ళారా?

    మీకందరకు దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దీపావళి శుభాకాంక్షలు సర్

      తర్వాత మధ్యలో కొన్ని ఒడుదుడుకులు వచ్చినా.. చాలామంది పెద్దవాళ్ళని కలవడం, సన్మానాలు అందుకోవడం జరిగింది.

      ఈశా రెస్టారెంట్ కి వెళ్ళలేదు సర్. ఈసారి ప్రయత్నించాలి.

      నమస్కారాలు సర్.

      తొలగించండి