***కుటుంబ మిత్రులైన ప్రముఖ జర్నలిస్టులు *** -71
2016లో పాత్రికేయులు కొండా లక్ష్మణ రావుగారు ఫోన్ చేసి "అమ్మా నాగలక్ష్మిగారు నా పేరు లక్ష్మణరావు. జర్నలిస్టు కాలనీలో ఉంటాం. ఇన్నయ్యగారు మేము చిరకాల మిత్రులం. మీరు ఇన్నయ్యగారి పుస్తకాలు ప్రింట్ చేయిస్తుంటారు కదా... సీనియర్ పాత్రికేయులు జి.ఎస్. వరదాచారిగారి పుస్తకం చెయ్యాలి. మీఅడ్రస్ చెప్పమ్మా..." అన్నారు.
లక్ష్మణరావుగారు “వరదాచారిగారు 1962 ఆంధ్రభూమిలో (యువపాత్రికేయులు) న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం మీద అప్పటి చైనా దండయాత్ర వలన ఆనాటి సామాన్యుని పరిస్థితిని గురించి రాసిన ఐదు వ్యాసాల్ని 13, 14, 15, 16, 17 తేదీల్లో రాసిన వ్యాసాల్ని చిన్న పుస్తకంగా వేద్దామనుకుంటున్నామని చెప్పారు. అది 2016 ఆగస్టులో వరదాచారిగారి గారి పాత్రికేయ జీవనయాన పరిస్థితిని పురస్కరించుకుని పుస్తకాన్ని ఆవిష్కరిస్తామ”ని చెప్పారు.
*** వరదాచారిగారు ‘‘ఆంధ్రభూమి’’లో 1961 నుండి 1982 దాకా, న్యూస్ ఎడిటర్గా పని చేశారు. అనంతరం ‘‘ఈనాడు’’ పత్రికలో, 1988 వరకు, సహాయ సంపాదకులుగా ఉన్నారు. 1988 నుండి 2010 దాకా, 22 సంవత్సరాల సుదీర్ఘకాలం పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయంలో, తొలుత జర్నలిజం డిపార్టుమెంటు శాఖాధిపతిగా, అనంతరం, విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు.*** వరదాచారిగారి గురించి తెలుసుకోవాలంటే ఆయన జీవనయానం చదవాల్సిందే.
వరదాచారిగారి భారత పై చైనా దండయాత్ర, జ్ఞాపకాల వరద (సిడిలో మేటర్ విని టైప్ చేసి పెట్టాం. ఎమెస్కో వాళ్ళు ప్రింట్ చేశారు), అవిశ్రాంత భాషా సేవకుడు తిరుమల రామచంద్ర పుస్తకం టైప్ చేసి ఇచ్చాం.
ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ రచయిత ఉడయవర్లు గారు ఇచ్చిన *** దాశరథి స్మృతి, రావిచెట్టు రంగారావుగారి జీవితచరిత్ర *** పుస్తకాలు మేము చేసి ఇచ్చాము.
*** ఇలా త్రిమూర్తులులాంటి వీరు ముగ్గురూ తరచు ఏదో ఒక పని చేయించుకోవడానికి మా ఇంటికి వస్తుండేవారు. 2016 మార్చిలో జరిగిన మా అమ్మాయి నిశ్చితార్థానికి పిలవగానే ముగ్గురూ వచ్చి కార్యక్రమానికి వచ్చిన సాహితీ ప్రముఖులందరినీ కలిశారు. అమ్మా మీ అమ్మాయి నిశ్చితార్థంలా లేదు. సాహితీసమావేశంలా వుంది. మాకు చాలా ఆనందంగా గడిచిందని చెప్పారు. ***
****
****
అలా కొనసాగిన పరిచయంతో....
2019 జులై 20వ తేదీన ప్రముఖ పాత్రికేయులు *** గోవిందుని రామశాస్త్రి గారి శతజయంతి*** సాహిత్య అకాడమి, వయోధిక పాత్రికేయ సంఘం సంయుక్తంగా నిర్వహించారు. వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేసి, గోరాశాస్త్రి గారి గురించి చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. గోరాశాస్త్రిగారి “వినాయకుడి వీణ”పేరుతో వచ్చిన సంపాదకీయాల్ని పుస్తకంగా ముద్రించి వెంకయ్యనాయుడుగారి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు.
ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విభాగాలుగా జరిగింది. ప్రముఖపాత్రికేయులు వరదాచారిగారు, ఉడయవర్లుగారు, లక్ష్మణరావుగారు వయసులో చాలా పెద్దవాళ్ళయినా కార్యక్రమం నిర్వహణ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు.
పేరుగాంచిన పాత్రికేయులతో సమావేశమందిరం కళకళలాడింది. దాసు కేశవరావుగారు, కె.బి.లక్ష్మి గారు, కల్లూరి భాస్కరం గారు, నాగసూరి వేణుగోపాల్ గారు, నందిరాజు రాధాకృష్ణగారు, పి.యస్. గోపాలకృష్ణ గారు, గోవిందరాజు చక్రధర్ గారు, శ్రీనివాస్ వాసుదేవ గారు సమర్పించిన పత్రాల ద్వారా గోరాశాస్త్రిగారి జీవిత విశేషాలు ఎన్నో తెలుసుకోగలిగాం.
సాహిత్య అకాడమి, తెలుగు సలహామండలి సంచాలకులు శివారెడ్డిగారు, భండారు శ్రీనివాసరావుగారు సమావేశ విభాగాలకు అధ్యక్షత వహించారు. రావెల సోమయ్య గారు, వంశీ రామరాజుగారు, తెన్నేటి సుధాదేవిగారు, భగీరథ గారు ఇంకా ఎంతో మంది ప్రముఖులు విచ్చేసిన ఈ సమావేశం చాలా విజయవంతంగా ముగిసింది.
ఈ సమావేశంలో ఉడతా భక్తిగా నేను కొన్ని పనులలో సహకరించాను. జ్యోతి ప్రజ్వలన సమయంలో వెంకయ్య నాయుడుగారు వంటి ప్రముఖులతో బాటు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. వరదాచారిగారి చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాను.
ఈ సమావేశంలో గోరాశాస్త్రి గారి జీవిత విశేషాల గురించి ప్రముఖ రచయితలు సమర్పించిన పత్రాలని “ప్రముఖ సంపాదకుడు రచయిత” మొదటి భాగం ముద్రణకి తయారవుతోంది. ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణగారి జీవిత చరిత్ర కూడా ముద్రణకి సంరంభమవుతోంది. కరోనాతో, నేను ఆస్ట్రేలియా వెళ్ళడంతో ఆగిపోయిన పుస్తకాలు మళ్ళీ మాచేతుల మీదుగానే ముద్రణకి తయారవుతున్నాయి.
ఇంక మీరు ఇప్పుడప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళరు కాబట్టి ఇంక మాకు దిగులు లేదు. మిగిలిన పుస్తకాలు కూడా రెడీ చేసుకుంటున్నాం అని చెప్పారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినా అక్కడ కంప్యూటర్ లో కొంతమంది పనులు చేశాను.
ఇవన్నీ పుస్తకాలుగా వచ్చేశాయి. ఈ రెండు సంవత్సరాలలో చాలా పుస్తకాలే చేశాం.
****
****
వీళ్ళందరినీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందరూ చాలా చలాకీగా తిరుగుతూ వుంటారు. వరదాచారిగారు వయసు వల్ల బయటికి ఎక్కువ రాలేకపోతున్నారు.
**** ఉడయవర్లుగారు ప్రూఫు రీడింగ్ చేస్తున్నారు. కింగ్ కోటీలో ఉన్న అతి పురాతన (1901 స్థాపన) శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణలో మొదటి గ్రంథాలయాన్ని అప్పుడప్పుడు వెళ్ళి పర్యవేక్షిస్తుంటారు. ***
వయోధిక పాత్రికేయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా. వరదాచారిగారు, అధ్యక్షులు ఉడయవర్లుగారు, సెక్రటరీ లక్ష్మణరావుగారు గారు మా ఇంటికి వచ్చారు. దీనికి ఉపాధ్యక్షులు గుడిపూడి శ్రీహరిగారు, జాయింట్ సెక్రటరీ బండారు శ్రీనివాసరావుగారు అని చెప్పారు. లక్ష్మణరావుగారు ఈ సంఘ చరిత్రని చాలా చక్కగా చెప్పారు. వీరికి వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వయోధిక పాత్రికేయులకి చేసిన ఉపకారాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం గుడిపూడి శ్రీహరిగారు ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.
ఈమధ్యే ప్రముఖ పాత్రికేయులైన వరదాచారిగారు, గుడిపూడి శ్రీహరిగారు కాలం చేశారు. ఇదొక బాధాకరమైన విషయం.
మహామహుల ఎందరి పనులో చేయగలుగుతున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి