20, మార్చి 2022, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు - 11

   

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  పసిపిల్లలతో సందడి సందడి - 11



పిల్లలతో అక్కమామగారి కార్యక్రమాలకి వెళ్ళినా పాపం అమ్మకి అస్సలు తీరుబడి వుండేది కాదు.  ఎంతసేపూ అక్కపిల్లల బట్టలు వుతకడం, అవి ఆరెయ్యడం మడతలు పెట్టడం పనులతో సరిపోయింది. ఇంక నేను ఇద్దరు పిల్లలని దగ్గర పెట్టుకుని అమ్మ చేసే పనులు చూస్తూ కూచునేదాన్ని. మొత్తానికి కార్యక్రమాలు అయ్యాయి.  అక్కావాళ్లు ఇంకా నాలుగు రోజులు వుండి బయల్దేరాల్సి వచ్చింది. అమ్మా,  నేను  ఆ పిల్లలని  వేసుకుని బస్టాండ్ కి వచ్చాం. బస్సుల మహా రష్ గా వున్నాయి. మొత్తానికి బావగారు ఎలాగో బస్ ఎక్కించారు. మొత్తానికి తాడేపల్లిగూడెం వచ్చి చేరాం. 


నేను, ముగ్గురు చెల్లెళ్లు అమ్మకి సాయం చేసేవాళ్ళం. నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి స్కూల్లో టీచర్సుగా పనిచేసేవాళ్ళం. ఆ తర్వాత చెల్లెళ్లు ఇద్దరూ చదువుకుంటుండేవారు. నా చివరి చెల్లెలు నేను చేసే స్కూల్లోనే 5వ తరగతి చదువుతుండేది. నేనే ఆ క్లాస్ టీచర్ని. అందుకని మాతోబాటు స్కూలుకి వచ్చేది. ఆ పై చెల్లెలు గాయత్రి వేరే హైస్కూల్లో చదివేది. ఇంట్లో పనిమనిషి, చాకలి వుండేవారు. మేము స్కూలు నుంచీ వచ్చేవరకూ అమ్మ పిల్లలిద్దరినీ చూసుకుంటూ వుండేది. అక్క విజయవాడ ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోయింది. 


 నేను, ప్రభావతి మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి వచ్చి భోజనం చేసినా, సాయంత్రం ఇద్దరం స్కూలు నుంచి అటునుంచి అటు ట్యూషన్లు చెప్పి రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. స్కూలు అయిపోగానే కొంచెం పెద్ద పిల్లలు ఇంటికి వెళ్ళి  మాకిద్దరికీ అమ్మ టీ ఫ్లాస్కులో పోసి ఇస్తే తెచ్చి ఇచ్చేవారు. అది తాగేసి మేము ట్యూషన్ కి వెళ్ళిపోయేవాళ్లం.  అక్కడ ట్యూషన్ పిల్లల అమ్మ, అమ్మమ్మ "మేము ఇస్తాం కదండీ మీరు టీ ిఇంటి నుంచి తెప్పించుకోవాలా?" అనే వారు. కానీ, నాకెందుకో అది నచ్చేది కాదు. "లేదండీ మేము ఎప్పుడైనా కావాలంటే అడుగుతాము" అని తేలికగా నవ్వేసి ఊరుకునేవాళ్ళం.  అది వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టవుతుంది అనిపించేది. మన మర్యాద మనం కాపాడుకోవాలనిపించేది. వాళ్ళింకేమనలేక ఊరుకునేవారు. 


వాళ్ళకి మేమంటే చాలా అభిమానంగా వుండేది. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వాళ్ళు ఇంటికి ఎవ్వరు వచ్చినా మాట్లాడేవారు కాదుట. "మీరెలా మాట్లాడిస్తారో చదువుకన్నా ముందు అది చెప్పండి" అన్నారు.  వాళ్ళు నిజంగానే పెదిమలు కూడా కదపడానికి భయపడేవారు. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా వుండేవారు. నల్లగా వున్నా ముద్దుగా వుండేవారు. వాళ్లకి ఒక వారం రోజులు నేనేం పాఠాలు చెప్పలేదు. రోజూ కబుర్లు, కథలు చెప్పేదాన్ని. వాళ్ళు చెప్పేవి వినేదాన్ని.  మెల్లిమెల్లిగా దారిలో పడ్డారు. చాలా చురుగ్గా తయారయ్యారు.  ఒక నాలుగు నెలల తర్వాత "మాస్టారూ (అప్పట్లో ఆడయినా, మగయినా మాస్టారూ అని అనేవారు) మీరు ఏం మంత్రం వేశారు. వీళ్ళని అస్సలు పట్టలేకపోతున్నాం. అందరితో ఒకటే కబుర్లు" అన్నారు. నాకు నవ్వొచ్చింది. పిల్లలని ఎప్పుడూ చదవమని సతాయించకుండా కాస్త కబుర్లు కూడా చెప్పాలి మరి!


ఇదిలావుండగా నాకు పచ్చకామెర్లు వచ్చింది. అక్క చిన్నప్పటి నుంచి స్నేహితురాలయిన పుష్పలత వాళ్ళ అమ్మగారు పసరు మందు వేస్తారంటే రోజూ పొద్దున్నే పరగడుపున వెళ్ళి ఆ పసరుమందు వేయించుకుని వచ్చేదాన్ని. ఆ చేదు పోవడానికి నా చిన్న చెల్లెలు వెంటనే నాకు ఒక అల్లం బిళ్ళ అందించేది. అలా ఒక పదిరోజులు వేయించుకుని, పత్యం చేశాక. మామూలు మనిషిని అయ్యాను. దాంతో స్కూలు టీచరుగా మానెయ్యాల్సి వచ్చింది. 


ఇక అమ్మ రెండోపాపని తీసుకుని విజయవాడ వెళ్ళమంది. నేను రెండోపాప రత్నని  తీసుకుని విజయవాడ వెళ్ళాను. అక్కావాళ్లు ఆఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత పాప ఆలనా పాలనా నేను చూసుకునేదాన్ని. అక్కడ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజిలో రిజిస్టర్ చేయించుకోమంటే, కనకదుర్గ గుడిలో మాకు తెలిసిన ఆయన వుంటే ఆయన్ని కలవడానికి వెళ్ళాల్సి వచ్చింది.  ఆయన టైముకి దొరకక పోవడంతో  ఇంచుమించు వారం రోజులు రోజూ పాపని తీసుకుని కనకదుర్గ గుడి మెట్లు ఎక్కి వెళ్ళేదాన్ని. మొత్తానికి ఆయన దొరకారు. ఎంప్లాయ్ మెంట్ లో రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ. నాకు అక్కడ ఉద్యోగం ఏమీ రాలేదు.   ఇంతలోకే బావగారు ఇక్కడ ఒక స్కూల్లో టీచర్ పోస్టు ఖాళీగా వుందిట చేస్తావా అమ్మా అని అడిగారు.  సరే అన్నాను. రు. 100 జీతం.  అక్క బ్యాంక్ ఉద్యోగం, బావగారు రైల్వే అయినా ఆరోజుల్లో పిల్లల ఖర్చులు, వారి అమ్మగారి బాధ్యత, మా బాధ్యతలకి డబ్బులు సరిపోయేవి కాదు. వందరూపాయలు ఎక్కువే మరి. సరే అని ఒప్పుకున్నాను. రోజూ అక్క పాపని తీసుకుని స్కూలుకి వెళ్ళేదాన్ని. అందరూ నా కూతురు అనే అనుకునేవారు. నా కుర్చీ పక్కనే పడుకోపెట్టుకుని, పిల్లలకి పాఠం చెబుతుండేదాన్ని. అయితే ఒక రోజు ప్రిన్సిపాల్ పిలిచి మీ పాపకి ఏదైనా ఏర్పాటు చేసుకుని రామ్మా... అన్నారు.  నాకు ఈపని కష్టం అనిపించకపోయినా, స్కూలు పిల్లలు నన్ను ఇష్టపడినా ప్రిన్సిపాల్ మాట కాదనలేకపోయాను. 


ఒక ఆదివారం రోజు బయల్దేరి తాడేపల్లిగూడెం వెళ్ళి మళ్ళీ పాపాయి రత్నని వదిలిపెట్టేసి విజయవాడ వెళ్ళిపోయాను. నాకు చాలా బాధగా అనిపించింది. అమ్మకి పిల్లలు అలవాటే కాబట్టి, పనిమనిషి, చాకలి అందుబాటులో వున్నారు కాబట్టి అమ్మ ఏమీ మాట్లాడలేదు. 






4, మార్చి 2022, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు - 10

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు - 10

మూడో అక్క పెళ్లి అనుకోకుండా అయ్యాక అమ్మకి కొంత రిలీఫ్ అనిపించినా... రెండో అమ్మాయి రమ వుండిపోయిందని దిగులు కూడా పడింది. 

అయితే రమాక్క చాలా తెలివైనది. తను ప్రైవేట్ కంపెనీలో చేస్తూనే రైల్వే, స్టాఫ్ సెలక్షన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల పోటీ పరీక్షలు రాసింది. మూడింట్లోనూ ఒకేసారి ఇంటర్వ్యూకి వచ్చింది. తనకి స్టేట్ బ్యాంక్ లో చెయ్యాలనే కలతో వుంది. మూడింటికీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. మూడింట్లోనూ సెలక్ట్ అయ్యింది.  కానీ తను స్టేట్ బ్యాంక్ లోనే చేరాలనుకుంది. ఫస్ట్ అప్పాయింట్ మెంట్ నారాయణగూడా స్టేట్ బ్యాంక్ లో వచ్చింది. చాలా సంతోషించింది. అమ్మావాళ్ళు కనీసం ఉద్యోగం మంచిది దొరికిందని సంతోషించారు. 

మా మేనత్త కూతురు వాళ్ళింటికి దగ్గరలో అక్కలిద్దరూ కలిసి  ఉన్న రూంలోనే ఉండిపోయింది. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు. ఇల్లుగలవాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఒక కోటలాంటి గేటులోపల వున్న పోర్షన్లలో పది కుటుంబాలు వుండేవి. అందరూ కలిసికట్టుగా వుండేవాళ్ళు.  అందుకని అమ్మకి అక్క గురించి బెంగ వుండేది కాదు. ఒక రకంగా అమ్మ ధైర్యంగా వుండబట్టే అందరం సెటిల్ అవగలిగామేమో అనిపిస్తుంది. 

నేను తాడేపల్లిగూడెంలో స్కూల్లో ఉద్యోగం చేస్తుండగా పెద్దక్కకి 1980లో మొదటి పాప పుట్టింది. అప్పట్లో అక్కడ వున్నది ఒకే ఒక హాస్పిటల్. అక్క ఆంధ్రాబ్యాంక్ లో చేసేది కాబట్టి  హాస్పిటల్ వాళ్ళు బ్యాంక్ కస్టమర్స్ అవడంతో ఆ హాస్పిటల్ లోనే చేరింది. లేకపోతే పక్కవూరు తణుకు వెళ్ళవలసిన అవసరం వచ్చేది. పాపం అమ్మే హాస్పిటల్ లో వుంది. మే నెల  11వ తేదీన రాత్రి 8.30 కి అరిచేతిలో సరిపోయే బొమ్మలాంటి ఆడపిల్ల పుట్టింది. చక్కగా ముద్దుగా వుంది కానీ, అంత చిన్న పాపని చూసేసరికి మాకు చాలా భయం వేసింది.  అమ్మ రాత్రి తన పక్కన పడుకోపెట్టుకుంది. ఆ పాపమీదకి  అమ్మ ఎక్కడ వెళ్ళిపోతుందోనని రాత్రంతా ఇంట్లో వున్న నాకు నిద్రపట్టలేదు. 

అక్క డిస్చార్జ్ అవ్వడానికి 300 రూపాయలు కావలసి వచ్చింది. దానికోసం నేను ట్యూషన్ చెప్పేవాళ్ళదగ్గర ముందుగా తీసుకుని హాస్పిటల్ లో డబ్బులు కట్టి అక్కని ఇంటికి తీసుకువచ్చాము. వాళ్ళు వత్తిడి పెట్టలేదు కానీ... పద్ధతులు పద్ధతులే కదా... ఉన్నకొద్దీ డబ్బులు పెరుగుతాయి. బావగారు ఊరునించి వచ్చాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. అప్పట్లో గూగుల్ పే అవన్నీ లేవు. ఆయన ఎక్కడో బాడ్మింటన్ ఆడడానికి వెళ్ళి వెంటనే రాలేకపోయారు. 

పాపతోటి అమ్మకి పని ఎక్కువయింది. తాడేపల్లిగూడెంలోనే ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల సంవత్సరాలతరబడి ఒకే పనిమనిషి, ఒకే చాకలి వుండేవారు. అయినా ఇంట్లో పని ఎక్కువగానే వుండేది. నేను, మా చెల్లెలు స్కూల్లో టీచర్స్ గా ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము స్కూలుకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్క  బ్యాంక్ కి వెళ్ళిపోయేది. అమ్మకి అప్పటికి 41 సంవత్సరాలు. ఎంత ఓపిక లేకపోయినా అమ్మ ఎప్పుడూ కూచునే రకం కాదు. అమ్మకి పడుకునేందుకు నిద్ర వుండేదో లేదో తెలియదు.  మేము స్కూలు నుంచి వచ్చేసరికి పాపని పక్కన పెట్టుకుని విపులో, చతురో చదువుతూ పడుకునేది. 

ఇంటికి రాగానే పాపాయిని మేము చూసుకుంటూ వుండేవాళ్ళం. అమ్మ వంట చేసేది. పాపాయికి పదోనెల వస్తూండగానే దానికి మరో చెల్లెలు పుట్టింది. పెద్దపాప పేరు ఛాయ, రెండోదానిపేరు రత్న. ఇద్దరూ ట్విన్స్ లా వుండేవారు. రత్న ఏడిస్తే ఛాయ కూడా ఏడ్చేది. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం అయ్యేది కాదు. 

వాళ్ళని పెంచడానికి అమ్మకి మేమందరం సాయం చేసేవాళ్ళం. ఒకసారి అక్కావాళ్ళమామగారు పోయారని అక్కావాళ్ళు ముందర వెళ్ళిపోయారు. నేను, అమ్మ ఇద్దరం చెరొకళ్ళని వేసుకుని తాడేపల్లిగూడెం నుంచి తణుకు బస్ లో వెళ్ళి అక్కడ నుంచీ రిక్షాలో రేలంగి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేలోపున ఇద్దరూ బస్ లో ఒకటే ఏడుపు. అందరూ కవలపిల్లలా, దిష్టి తగిలిందేమో... తల్లిపాలు కాదా... అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. వాళ్ళకి గబగబా డబ్బాలో ప   పౌడర్ రెండు బాటిల్స్ వేసి, ఫ్లాస్క్ లోంచి వేడి నీళ్ళు పోసి పాలుకలిపి ఇద్దరికీ చెరో బాటిల్ ఇస్తే తాగేసి పడుకున్నారు. 

మొత్తానికి రేలంగి చేరాం. ఇల్లు పెద్దదవడంతో అందరికీ పడుకోవడానికి పెద్ద ఇబ్బంది అవలేదు. కానీ ఛాయ, రత్న ఇద్దరూ అందరూ మంచి నిద్రలో వుండగా ఏడుపు మొదలుపెట్టారు. ఆకలి కాదు. ఎందుకు ఏడ్చారో ఇప్పటికీ తెలియదు. అందరూ నిద్రలోంచి లేచి "పిల్లలు ముద్దుగా వున్నారు. దిష్టి తగిలిందేమో... దిష్టి తియ్యండి. లేకపోతే వాము నీళ్ళు పట్టండి" ఇలా సలహాలు ఇచ్చారు. మాకు వీళ్ల సంగతి తెలుసు కాబట్టి "ఏమీలేదు వీళ్ళిలాగే ఏడుస్తారు మీరు పడుకోండి" అని చెప్పాం. అందరూ నిద్రపోయారు. మర్నాడు మళ్ళీ ఏడిస్తే ఒక్కళ్లు కూడా నిద్రలోంచి లేవలేదు. 



25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -9

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -9



రెండు నెలల తేడాతో... ఇంట్లో రెండో పెళ్ళి


పెద్దక్కకి పెళ్ళయిన తర్వాత అమ్మ సొంత తల్లి (తాతగారు అమ్మావాళ్ళ అమ్మ సంవత్సరానికే చనిపోతే మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు) అన్నగారు అంటే అమ్మకి పెద్ద మామయ్య మా ఇంటికి వచ్చారు. ఆయన శ్రీశైలంలో ప్రధాన అర్చకుడుగా పనిచేసేవారు. ఇవటూరి వాళ్ళు. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, 8 మంది కొడుకులు. అందరు పిల్లలూ ఏదో ఒక రకంగా సెటిల్ అయిపోయారు. 


నేను నా పై అక్కలిద్దరూ అమ్మ రెండో మామయ్య కూతురు పెళ్ళికి తణుకు దగ్గిర ఏలేటిపాడు వెళ్ళాం. అక్కడ అమ్మ బంధువర్గం అంతా వచ్చారు. ఆ పెళ్ళిలో మా మూడో అక్క ఉమని అమ్మావాళ్ళ పెద్ద మామయ్య చూశారు. ఆయన ఆ పెళ్ళి అయిపోయాక అమ్మ దగ్గిరకి వచ్చారన్నమాట. అమ్మతో "నా నాలుగో కొడుకు రాజు ఢిల్లీ లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. నీ మూడో కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్ళి చెయ్యి నీకు కొంత భారం తగ్గుతుంది" అని అడిగారు. అక్క ఉమ అప్పటికి హైదరాబాద్ లో ఒక్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది. అమ్మ వాళ్ళ మామయ్యతో "మామయ్యా... నువ్వు ఇలా అడగడం నాకు చాలా సంతోషంగా వుంది. నేను మా పిల్లలతో మాట్లాడి ఉత్తరం రాస్తాను" అంది. ఆయన సరే అని శ్రీశైలం వెళ్ళిపోయారు. 


అమ్మ పెద్దక్కతో చెప్పింది. ఇద్దరూ కలిసి తాడేపల్లి గూడెం నుంచి హైదరాబాదు  ఉమ అక్క దగ్గిరకి వచ్చారు. ఒక పట్టాన ఉమ అక్క ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పట్లో తాడేపల్లిగూడెంకి హైదరాబాదే పెద్ద దూరం. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ అంటే దాదాపు 1600 కిలోమీటర్ల దూరం. 24 గంటలు ప్రయాణం. కానీ అబ్బాయికి మంచి ఉద్యోగం, చుట్టాలు కాబట్టి బెంగ వుండదని అమ్మ అనుకుంది. మొత్తానికి ఉమ అక్క ఒప్పుకుంది. బావగారు హైదరాబాద్ వచ్చి తనని చూసి వెళ్ళారు. పెళ్ళికి ముహూర్తం పెట్టకున్నారు. 


అమ్మ మామయ్య వీరభద్రంగారు శ్రీశైలంలో పెళ్ళి చెయ్యమన్నారు. గుళ్ళో కాబట్టి మాకు బావుంటుంది అన్నారు.  మా దగ్గిర కూడా డబ్బు అంతంత మాత్రమే. అమ్మావాళ్ళు కాదనలేక ఒప్పుకున్నారు. పెళ్ళి పీటల మీద అక్క, బావగారు కూచోవాలి. వాళ్ళు చేస్తున్న మొదటి పెళ్ళి. సంతోషంగా వున్నా... రెండో అక్క రమకి పెళ్ళి అవలేదనే బెంగ అమ్మకి వుంది. రమాక్క నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పింది. సరే పెళ్ళికి కావలసినవి సమకూర్చుకోవాలి. 


ఎలా చెయ్యాలి అనే విషయం చూస్తే సలహాలు చెప్పేవారే లేరు. అమ్మ మామయ్యే కదాని ఇంకో ధైర్యం. అప్పట్లో అంటే 1979లో  ఇప్పటిలాగా  ఎప్పుడు పడితే అప్పుడు శ్రీశైలంకి బస్సులు లేవు. ఒకటో రెండో వుండేవనుకుంట నాకు సరిగ్గా తెలియదు. అక్క, బావగారు అమ్మ, పెళ్ళికూతురు పెళ్ళికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మా మామయ్యలు కానీ, బాబాయిలు కానీ ఎవరూ ముందుకి రాలేదు. నేను పనిచేసే స్కూలు ఓనర్ సాయిరాం అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూవుండేవాడు. వాళ్ళిల్లు మా ఇల్లు దగ్గర దగ్గర. మాకు ఇంట్లో ఏ సాయం కావాలన్నా చేసేవాడు. అక్క అతన్ని అడిగింది. వస్తానని హామీ ఇచ్చాడు. 


నాన్నగారు  బట్టలు పెట్టుకునే పెద్ద ఇనప పెట్టెలో (అప్పట్లో సూట్ కేసులు అంతగా లేవు) పెళ్ళికి కావలసినవి అన్నీ పెట్టుకుని సాయిరాం గారి సాయంతో బయల్దేరారు.  ప్రతిచోటా ఆయన ఈ పెట్టె మోసుకుంటూ ఇంటి మగపిల్లవాడిలా తోడు వున్నాడు. 


(అమ్మకి పెద్దక్కకి ముందు ఒక అబ్బాయి, ఆరో అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి పుట్టి చనిపోయారు. మా బామ్మ జాతకాలు చెప్పేదిట - "నీకు మగపిల్లలు పుట్టరు, పుట్టినా బతకరు" అని. అమ్మ తలుచుకుని బాధపడుతూ వుండేది.) 


మొత్తానికి నానా తిప్పలూ పడి శ్రీశైలం కొండకి చేరుకున్నారు. పెళ్ళి ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఉన్న కష్టమంతా కొండకి చేరుకోవడమే. పెళ్ళి బాగానే జరిగింది. పెళ్ళి కూతురుకి చీరలు కొనే తాహతు కూడా లేదు. అక్కకి పెళ్ళికి కొంతమంది పెట్టిన చీరలే మూడో అక్క పెళ్ళికి వాడారు. పెళ్ళయ్యి ఇంటికి వచ్చాక అక్క "సాయిరాం లేకపోతే అసలు పెళ్ళికి వెళ్ళగలిగేవాళ్ళం కాదు" అంది.  ఉమాక్క పెళ్ళి అలా జరిగిపోయింది. తర్వాత తను హైదరాబాద్ లో ఉద్యోగానికి రిజైన్ చేసి ఢిల్లీ వెళ్ళిపోయింది. అప్పుడు ఫోన్లు కూడా లేవు కాబట్టి అందరం తలో ఉత్తరం రాసి ఓ కవర్లో పెట్టి పోస్ట్ చేసేవాళ్ళం. 


రాజు బావగారు కోల్ ఇండియా లిమిటెడ్, ఢిల్లీ లో చేసేవారు. ఆయన నాటకాలు బాగా వేసేవారు. అప్పట్లో ఆయన్ని రజనీకాంత్ అని అనేవారు. వీళ్ళు వేసిన 'కుక్క' నాటకానికి చాలా పేరు వచ్చింది.  ఆయనకి ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళతో మంచి సంబంధాలు వుండేవి.  ఢిల్లీలో బాగా పలుకుబడి వుండేది. ఆ పలుకుబడితో అక్కకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించారు.  అలా మూడో అక్క సెటిల్ అయిపోయింది. 




17, ఫిబ్రవరి 2022, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -8

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -8


పెళ్ళి హడావుడి



అప్పటివరకూ ఇంటి పనులు అందరం కలిసి చేసుకోవడం అలవాటయింది. కానీ ఈ పెళ్ళి వ్యవహారాలు అన్నీ అలవాటు లేని పనులు. పెద్దక్క తన పెళ్ళి గురించి తనే మాట్లాడుకుని వచ్చింది. బావగారు రైల్వేలో పార్శిల్ ఆఫీసులో క్లర్క్. ఒకరోజు మా ఇంటికి వచ్చారు. పాత పరిచయాలే కాబట్టి అమ్మతో ఫ్రీగానే మాట్లాడారు. కానీ ఆయనకి ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. బాడ్మింటన్ ఛాంపియన్.  ఆయనకి ఉద్యోగం ఆ కోటాలోనే వచ్చింది. చాలా ఊళ్ళకి పోటీలకి ఆఫీసు తరఫున వెళ్ళేవారు. మొత్తానికి ఈ సంబంధం అక్కకి సెటిల్ అయ్యింది. 

అక్క అత్తగారి బంధువులు తణుకు దగ్గిర రేలంగిలో కరణాలుగా వుండేవారు. వాళ్ళవన్నీ పెద్ద పెద్ద ఇళ్ళు, వాకిళ్ళు. మా బావగారికి ఒక అన్నయ్య ఐదుగురు అక్కలు. చాలా అందగత్తెలు. అందరికీ మంచి మంచి సంబంధాలు కలిసి వచ్చాయి.  బాగా సెటిల్ అయిపోయారు. 

ఇంక పెళ్ళి పనులు మొదలుపెట్టాలంటే తాడేపల్లిగూడెంలో మాకు ఆస్థాన పంతులుగారు విశ్వనాథం గారు ముహూర్తం పెట్టారు. ఆర్యవైశ్య సంఘం వాళ్ళ వాసవీ కన్యకాపరమేశ్వరి సత్రం పెళ్ళికి బుక్ చేశాం. వీళ్ళందరూ నాన్నగారికి బాగా తెలిసినవారు కావడంతో కొంచెం తక్కువ రేటుకి ఇచ్చారు.

ఇంక పాలు, పెరుగు, కావలసిన కూరగాయలు, అరటి ఆకులు అన్నీనాన్నగారి స్నేహితులు  రాజుగారు పక్కవూరిలో ఉన్న ఆయన పొలం నుంచి తెచ్చి ఇచ్చారు. ఒక క్వింటాలు బియ్యం పంపించారు. మాకు పెళ్ళి ఖర్చు చాలావరకు కలిసి వచ్చింది.  పెళ్ళి చాలా బాగా జరిగింది. భోజనాల టైముకి కూరలన్నీ అయిపోయాయి. అప్పటికప్పుడు వంకాయ అల్లం, పచ్చిమిర్చి వేసిన కూర గబగబా చేసి వడ్డించారు.  ఆ కూర రుచి నాకు ఇంకా గుర్తుంది. 

పట్టు చీరలు, నగలు లేకపోయినా బాధ్యత గల కుటుంబం నుంచి వచ్చిందని అందరూ సంతోషించారు. పెళ్ళివారందరికీ బస్సు మాట్లాడారు.  అక్కతోబాటు నేనూ రేలంగి వెళ్ళాను. అమ్మో ఎంతమంది బంధువులో... వాళ్ళందరూ కలిస్తే ఇల్లు అదిరిపోయేలాంటి నవ్వులతో సందడి సందడిగా వుంటుంది. మామయ్యలని, అత్తయ్యలని చిన్నా పెద్దా తారతమ్య లేకుండా పేర్లు పెట్టి పిలుచుకోవడం నేను అక్కడే చూశాను. దాంట్లో ఎంత ఆప్యాయతో...    పేద్ద ఇల్లేమో... ఎంతమంది వచ్చినా సరిపోయేది. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అదే ఇంట్లో చేశారు.  పల్లెటూరిలో పెళ్ళి సందడి. వంటవాళ్ళు, వడ్డనలు. అందరూ కాఫీగత ప్రాణులు కాబట్టి ఎప్పటికప్పుడు ఇత్తడి గ్లాసుల్లో చిక్కటి కాఫీ. ఎంత బాగా అనిపించిందో. అసలు ఇప్పటి రోజుల్లో ఎంతమంది బంధువులు వచ్చినా... ఎంత గొప్పహాలు తీసుకున్నా... ఎన్నిహంగులున్నా.... 100 రకాల వంటకాలు పెట్టినా.... ఆ అసలు సిసలైన సాంప్రదాయపు భోజనం, అలాంటి సందడి దొరకదేమో.. అనిపిస్తుంది. నాకయితే వాళ్ళందరి ఆనందం ఇంకా కళ్ళముందు కనిపిస్తుంది.  మూడు రోజులు చాలా సందడి సందడిగా గడిచిపోయింది.  ఇప్పటికీ కొన్ని కుటుంబాల వాళ్ళు అలా వున్నావాళ్ళు వున్నారు. 

మళ్ళీ అందరినీ తిరుగు బస్సులో మా వూరు పంపించారు. అమ్మ తను చేయగలిగినట్లు వంటలు చేసి అందరికీ పెట్టింది.  ఇంక పెళ్ళి హడావుడి అయిపోయింది. అక్క మామూలుగా బాంక్ కి వెడుతోంది. రెండో అక్క, మూడో అక్క హైదరాబాద్ వెళ్ళిపోయారు. 

నేను చదివే విమెన్స్ కాలేజీ,  పెద్దక్క చేసే ఆంధ్రాబ్యాంక్ దగ్గరగా వుండడంవల్ల ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం.  అలా నా డిగ్రీ చూస్తుండగా పూర్తయిపోయింది.   అక్కతో ఎక్కువ కలిసి వుండడం వల్ల నాకు ఎక్కువగా కుటుంబాన్ని పట్టించుకునే అవకాశం వచ్చింది. నేను, అక్క అన్ని పనులు కలిసి చేస్తూ వుండేవాళ్ళం. పెద్దక్క ఒకరోజు నన్ను పిలిచి నీకు డిగ్రీ పూర్తయింది కదా... ఎక్కడన్నా ఉద్యోగంలో చేరు అంది. 

మాకు తెలిసిన సాయిరాం గారు స్కూలు పెట్టారు. అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. తెలిసిన వాళ్ళమే కాబట్టి  డిగ్రీ చదివాను కాబట్టి వెంటనే తీసుకున్నారు. నెలకి 100 రూపాయలు జీతం. అది కాకుండా కొంతమంది పిల్లలకి ట్యూషన్లు చెప్పేదాన్ని. అక్కకి ఆర్థికపరమైన విషయాల్లో సహకరించాను. జీతం ఎంత ఎక్కువ తక్కువ అని కాదు. ఎలా వున్నా అందరం ఎప్పుడూ ఆనందంగానే వుండేవాళ్ళం. చాలామంది అడిగేవారు మీరెప్పుడూ సంతోషంగా ఎలా వుంటారు? అని. అది మాకు అమ్మ ఇచ్చిన ధైర్యమే అనిపిస్తుంది. అమ్మకి 36 సంవత్సరాలకి నాన్నగారు పోయిన తర్వాత కోపం పెరిగింది. కానీ ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా వుండడం అనేది నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. . 

అక్క, బావగారు విజయవాడ తాడేపల్లి గూడెం మధ్య తిరుగుతూ వుండేవారు.  గంటన్నర ప్రయాణమే అయినా తప్పదుమరి. అక్కకి ట్రాన్స్ ఫర్ అయ్యేవరకూ...






8, ఫిబ్రవరి 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -7

 

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -7








పెద్దక్క పెళ్ళి


అమ్మమ్మ పెద్దక్కని చిన్నప్పటి నుంచీ మా చిన్న మేనమామ కృష్ణకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని అనుకున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగానే అందరూ అనుకునేవారు. మరి అమ్మకి ఇష్టమే కానీ, నాన్నగారు ఏమాలోచించేవారో తెలియదు. నాన్నగారికి ఎంతసేపూ పిల్లలని బాగా చదివించి ఉద్యోగస్తులని చెయ్యాలని అనుకునేవారు.

 

నాన్నగారు సడన్ గా రాత్రి పడుకున్న మనిషి పొద్దున్న లేవకపోయేసరికి పరిస్థితులు తారుమారయినట్టున్నాయి. ఎందుకంటే మేమింకా చిన్న పిల్లలం.

 

ఒకసారి తాతగారు ఆయన స్నేహితుడితో కలిసి తాడేపల్లిగూడెం వచ్చారు. అమ్మ ఇద్దరికీ భోజనం పెట్టింది.

అమ్మ ఏంటి నాన్నా ఇలా వచ్చావు అంది.

తాతగారు ఏమీలేదు కృష్ణని అన్నపూర్ణకి ఇచ్చి పెళ్ళి చేద్దామనుకున్నాం కదా.. ఇప్పుడు దానిమీద కుటుంబ బాధ్యత పడింది కదా... రెండోది రమాని ఇచ్చి చేస్తే బావుంటుంది కదా... ఏమంటావ్ అన్నారు. అమ్మ షాక్. అమ్మకి ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలోకే మూడో అక్క ఉమ బయటికి వచ్చి తాతయ్యగారూ... మీరు ఇలా అడగడం ఏమీ బాగాలేదు. అక్కని వద్దనుకున్నారు. రమాక్క ఇంకా చదువుకుంటోంది. ఉద్యోగం చెయ్యాలి. రమాక్కని మాత్రం మామయ్యకి ఇచ్చి చెయ్యడం మాకు ఇష్టం లేదు అని చెప్పింది.

 

అక్క అలా చెప్తుంటే పెద్దక్క అన్నపూర్ణ, అమ్మ షాకయ్యారు. ఇంకోరకంగా బాగానే చెప్పింది అనుకున్నారు. కాకపోతే చిన్నదానిచేత చెప్పించారు అనుకుంటారేమో అని మరో భయం. ఏమయితేనేం. తాతగారు సరే అని వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులు ఉత్తరప్రత్యుత్తరాలు లేవు.

 

మామయ్యకి తాతగారు ఎలక్ట్రికల్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించారు. తణుకు దగ్గర కవిటం అనే ఊరికి సంబంధించిన అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశారు. రెండో అక్క, మూడో అక్క పెళ్ళికి వెళ్ళారు. మొత్తానికి ఆ సమస్య అలా పరిష్కారం అయ్యింది.

 

ఇక పెద్దక్కకి సంబంధాలు వస్తున్నాయి. ఒకతను బొంబాయిలో ఉద్యోగం చేస్తాడు. బాగానే మాట్లాడారు. కానీ వాళ్ళన్నది ఏమిటంటే... పెళ్ళయ్యాక నాతోబాటు బొంబాయి వచ్చెయ్యాలి. కుటుంబ బాధ్యతలు కుదరవు అన్నారు. ఆ సంబంధం అలా తప్పిపోయింది.

 

అమ్మకి బెంగ వచ్చింది. ఏమిటో ఇలా... అని. 

మాచిన్నప్పుడు తాడేపల్లిగూడెంలో మొదట ఉన్న ఇంటి వెనకవైపున ఆ ఇల్లుగల వాళ్ళదే ఒక డాబా ఇల్లు వుండేది.  ఆ ఇంట్లో మాధవరావుగారని ఒకాయన వుండేవారు. ఆయనకి నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆఖరి అబ్బాయి పెళ్ళికి ఉన్నాడు రైల్వేలో చేస్తున్నాడు. అబ్బాయిపేరు ప్రభాకర్. ఒకసారి మాట్లాడి చూడండి అని ఆ ఇల్లుగల వాళ్ళమ్మాయి కమల చెప్పింది.

 

ఇల్లుగలాయన ప్రకాశరావుగారితో అక్క అన్నపూర్ణ తన సంబంధం తనే మాట్లాడుకోవడానికి మాధవరావుగారు ఉన్న తణుకు దగ్గర రేలంగి వెళ్ళింది. చిన్నప్పటి నుంచీ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఆదరంగా మాట్లాడారు. వాళ్ళ చుట్టాలందరూ కలిసి కూచుని అక్కతో అన్నీ వివరంగా మాట్లాడి వాళ్ళబ్బాయికి చేసుకోవడానికి ఒప్పుకున్నారు.

 

అక్క వచ్చి అమ్మకి చెప్పగానే అమ్మ చాలా సంతోషించింది. అయితే ఒకసారి ప్రభాకరరావుని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం. ఆయన వచ్చినప్పుడు అక్క అన్ని విషయాలు వివరంగా మాట్లాడి, నా తర్వాత చెల్లెళ్ళిద్దరూ సెటిల్ అయ్యే వరకూ నేను బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. దీనికి మీరు అంగీకరిస్తారా... అంది.

 

ప్రభాకరరావుగారు సరే అని ఒప్పుకున్నారు. అక్కకి మొత్తానికి అన్నీ తెలిసిన వాళ్ళ సంబంధం కుదిరింది. 

25, జనవరి 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -6

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -6


పెద్దక్క అన్నపూర్ణ బ్యాంకికి వెళ్ళి వస్తూండేది. అప్పుడప్పుడు ఓవర్ టైమ్ చేసేది. అటువంటప్పుడు అమ్మ ఫ్లాస్క్ లో కాఫీ, ఏదో ఒక టిఫిను అక్కకి ఇచ్చిరమ్మనేది. నడిచే దూరమే కాబట్టి మేము ఇచ్చేసి వచ్చేవాళ్ళం. అప్పటివరకూ చదువులోనే ఉన్న అక్కకి ఉద్యోగంలో సద్దుకోవడం కొత్తగా వుండేది. అమ్మ అక్కకి ఏ పనులూ చెప్పేది కాదు. 

తర్వాతి అక్కలైన రమ, ఉమ ఇద్దరూ డిగ్రీలోకి వచ్చారు. నేను ఇంటర్ లో చేరాల్సి వచ్చింది. కాలేజీ పెంటపాడు అనే చిన్న వూర్లో వుండేది. తాడేపల్లి గూడెం నుంచి పెంటపాడు మూడున్నర కిలోమీటర్లు. అక్కలిద్దరూ కాలేజీ బస్ లో వెడుతుండేవారు. టికెట్ 25 పైసలు.  అప్పుడప్పుడూ వచ్చేటప్పుడు నడిచి వచ్చేసేవారు. వాళ్ళిద్దరూ చదువులో ఎప్పుడూ ముందరే వుండేవారు. 

నేను టెన్త్ క్లాస్ పాసయ్యాను. కాలేజీలో చేరాలని వుంది. నాకు మరీ ఫస్ట్ క్లాస్ మార్కులు రాకపోయినా బాగానే వచ్చాయి. అక్కని ఇబ్బంది పెట్టకూడదని వుంది కానీ, కాలేజీలో చదివితే బాగుంటుంది అనుకున్నాను. అక్క కూడా అభ్యంతరపెట్టలేదు. గవర్నమెంటు కాలేజీ అవడంతో సంవత్సరానికి ఫీజు చాలా తక్కువ వుండేది.  ఇక వెళ్ళడానికి రావడానికి డబ్బులు చూసుకోవాల్సి వచ్చేది.  పేరుకి గవర్నమెంట్ కాలేజీనే కానీ లెక్చరర్స్ అందరూ చాలా బాగా చెప్పేవారు. నేను తీసుకున్న గ్రూపు హెచ్.టి.సి. (హిస్టరీ, తెలుగు, సివిక్స్). 

 
మా ఫ్రెండ్స్
ఎడమ నుంచి మొదలు నేను, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, సరస్వతి

తెలుగు లెక్చరర్స్ రామారావుగారు, ఇంద్రగంటి రామచంద్రమూర్తి గారు  వుండేవారు. ఇద్దరూ తెలుగు చాలా బాగా చెప్పేవారు. రామారావుగారు పాటలి అనే నాన్ డీటెయిల్డ్ చెప్తుంటే కథలో లీనమయిపోయేవాళ్ళం. రామచంద్రమూర్తిగారు పద్యాలు చక్కగా పాడి చెప్పేవారు.  హిస్టరీ, సివిక్స్ లెక్చరర్స్ చెప్పక్కరలేదు. మా క్లాసులో 125 మంది వుండేవారు. అమ్మాయిలు 13 మంది. మిగిలినవాళ్ళందరూ అబ్బాయిలే.  మాకు ఫస్ట్ బెంచీలలో అబ్బాయిలు తప్ప మిగిలిన వాళ్ళు తెలిసేవాళ్ళు కాదు.  ఎవరూ ఏడిపించడాలు అవీ వుండేవి కాదు. 

 మాకాలేజీ వెనకవైపు తోటలో
గొబ్బి పువ్వులు

 మా కాలేజీ బిల్డింగ్స్




కాలేజీ చుట్టుపక్కలంతా పొలాలు, మామిడి తోటలు వుండేవి.  అప్పుడప్పుడు క్లాసు లేనప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం. మామిడి చెట్ల మధ్యన ఒక చెరువు వుండేది. ఆ చెరువు లో నీలం రంగు కలువ పువ్వులు వుండేవి. చెరువు గట్టు మీద గొబ్బీ పూల చెట్లు వుండేవి.  ఆ పువ్వులన్నీ కోసుకుని, అక్కడ అరటి చెట్ల నారతో దండలు కట్టుకుని తలలో పెట్టుకునేవాళ్ళం.  అక్కడ పొలాలలో వేరుశనగ పంట తవ్వి పక్కన పెడితే ఆ కాయలు తెచ్చుకుని తినేవాళ్ళం. ఆరోజులు చాలా బావుండేవి.  ఆ చెట్లు, గడ్డిమేట్లు ఎంతో ఆనందాన్నిచ్చేవి. 

కాలేజీకి వెళ్ళే దారంతా పచ్చటి పొలాలతో నిండుగా వుండేది. వరి పొలాలు గాలికి నదీతరంగాలలా కదులుతూ వుండేవి. రిక్షాలో వెడుతుంటే చల్లటి గాలి చెంపలని తాకుతుంటే చాలా హాయిగా అనిపించేది. సాధారణంగా నలుగురమో, ఐదుగురమో కలిసి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ వచ్చేటప్పుడు ఒక ఇంటి చుట్టూరా కనకాంబరం తోట వుండేది. వాళ్ళు ఆ పువ్వులు వందల లెక్కన అమ్మేవారు. ఆవన్నీ కోసుకుని తెచ్చుకునేవాళ్ళం. ఒక చక్కటి వాతావరణం వుండేది. అసలు పొల్యూషన్ అనేదే వుండేది కాదు. అలా నా కాలేజీ జీవితం ఆనందంగా గడిచిపోయింది. నాకు తెలుగులో ఇంటర్ లో కాలేజీ ఫస్ట్ వచ్చింది. ఆ సంవత్సరం వార్షికోత్సవానికి ప్రైజు తీసుకుందామనుకుంటే ఎందుకో కాన్సిల్ చేశారు. 

అక్కలిద్దరికీ డిగ్రీ అయిపోయింది. నాకు ఇంటర్ అయిపోయింది. నేను డిగ్రీ కాలేజీలో చేరాలి. ఈలోపున తాడేపల్లిగూడెంలోనే డిగ్రీ వుమెన్స్ కాలేజీ పెట్టారు. దానికీ డబ్బులు కావల్సి వచ్చింది. అక్క ముందు ప్రైవేట్ గా చదవమంది కానీ, మళ్ళీ కాలేజీలో చేర్పించింది. మేము క్లాసులో 7గురం అమ్మాయిలం వుండేవాళ్ళం. మాది కాలేజీకి ఫస్ట్ బాచ్. మొత్తం కాలేజీ లో స్టూడెంట్స్ తక్కువే వుండేవారు. ఇంటి నుంచీ 10 నిమిషాల నడక. డబ్బు ఖర్చు వుండేది కాదు. ఇక్కడ స్పెషల్ తెలుగు తీసుకున్నాను. లెక్చరర్స్ అందరూ అప్పుడే యూనివర్సిటీ నుంచి వచ్చినవాళ్ళు. అందరూ చాలా హుషారుగా క్లాసులు చెప్పేవారు. 

అక్కలిద్దరికీ డిగ్రీ అయిపోవడంతో... రెండో అక్క ఒక స్కూల్లో టీచర్ గా చేరింది. ఇంతలోకే హైదరాబాద్ లో వున్న మా మేనత్త కూతురు వాళ్ళు వాళ్ళని ఉద్యోగం వుంది హైదరాబాద్ రండి అన్నారు. ఇద్దరూ హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. అయితే వాళ్ళు మూడో అక్కకి ఉద్యోగం ఇప్పించారు. రెండో అక్క మళ్ళీ వెనక్కి వచ్చి స్కూల్లో చేరిపోయింది. కానీ తను ఏమైనా సరే హైదరాబాద్ లో ఉద్యోగం సంపాయించాలనుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. తనకి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు చేసే కంపెనీలు తెలుగు వాళ్ళవి కాదు కాబట్టి ఇద్దరికీ ఇంగ్లీషు, హిందీ బాగా వచ్చాయి. 

 ఇది పార్వతమ్మ వాళ్ళిల్లు ఎవరో కొనుక్కుని షాపు పెట్టుకున్నారు.


                                                                    అంతా తిరిగి చూశాను.

ఇక తాడేపల్లిగూడెంలో నేను, పెద్దక్క, మిగిలిన చెల్లెళ్ళు వున్నాం. మేము ఉన్న ఇంటి ఓనరు వాళ్ళు విజయనగరం వాళ్ళు. పిల్లలు లేరు. భార్య, భర్త వుండేవారు. ఆయన పేరు కలియుగార్జున్, ఆవిడపేరు పార్వతమ్మ. ప్రేమగా బాగానే వుండేవారు. కానీ, ఆయన మైక్ పెట్టుకుని చేసే భజనలే చాలా ఇబ్బందికరంగా వుండేవి. ఆ చప్పుడు భరించలేకపోయేవాళ్ళం. అప్పుడప్పుడు మా తెలుగు లెక్చరర్ గారు వచ్చి రకరకాల పాటలు నేర్పిస్తుండేవారు. వాటిలో పుట్టపర్తి సాయిబాబా భజన పాటలు కూడా వుండేవి. అవి వాళ్ళకి నచ్చేవి కావు.  వద్దంటే మానేసే వాళ్ళం. కానీ ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. కొంచెం కష్టంగానే అనిపించింది.  జీవితంలో రకరకాల కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. 

దగ్గరలోనే మర్ధువులు కొత్తగా ఇల్లు కట్టారు. కానీ ఇంకా కరెంట్ సప్లయ్ ఇవ్వలేదు. అయినా సరే ఆ ఇంట్లోకి మారిపోయాం. సరిగ్గా నాకు డిగ్రీ పరీక్షలు కరెంటు వుండేది కాదు. పగలు ఎలాగో ఇబ్బంది పడేవాళ్ళం. రాత్రి చిన్న కిరసనాయిలు దీపం పెట్టుకుని డాబా మీద చదువుకునేవాళ్ళం. చదువు మాత్రం బాగానే సాగింది. వేసవి కాలంలో రాత్రిపూట డాబా మీద పడుకునేవాళ్ళం కింద ఇల్లు తాళం పెట్టి. 

ఉగాదికి రెండో అక్క మూడో అక్క హైదరాబాద్ నుంచి వచ్చారు.  అందరం కొత్త బట్టలు కట్టుకుని పండగ బాగా చేసుకున్నాం. రాత్రి అందరం డాబా మీద పడుకున్నాం. కింద చప్పుడు వినిపిస్తే అమ్మ లేచి కిందకి చూసిందిట. దొంగలు కిటికీ తలుపు తెరిచి కిటికీలోంచి మా కొత్తబట్టలన్నీ తీసి మూటకట్టుకుని వెళ్ళిపోయాడుట. గట్టిగా అరిస్తే దొంగలు ఏం చేస్తారోనని వాడు మూటకట్టుకుని వెళ్ళేవరకూ చూస్తూ నుంచుందిట. అలా అపురూపంగా కొనుక్కున కొత్తబట్టలు దొంగలపాలయ్యాయి. 

అయితే దేనికీ ఏడవడం అలవాటు లేదు కాబట్టి అందరం కొంచెం బాధపడి వూరుకున్నాం. 








11, జనవరి 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 34 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -5

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 34  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -5

అమ్మ అప్పుడప్పుడు నాన్నగారు లేని లోటు గురించి బాధపడుతూ వుండేది. అప్పుడప్పుడు అమ్మకి చాలా కోపం వచ్చేది. ఇప్పుడు ఆలోచిస్తే  - 33 సంవత్సరాలకి భర్తని పోగొట్టుకున్న అమ్మ మానసిక స్థితి ఎంత గందరగోళంగా వుండేదో అనిపిస్తుంది. మాతో నవ్వుతూ కబుర్లు చెబుతూనే వుండేది. కానీ ఏదైనా చిన్న తప్పు చేస్తే ఇంక మేము చుక్కలు చూసేవాళ్ళం. చాలా విషయాల్లో మిలటరీ డిసిప్లిన్ వుండేది. కానీ ఒకోసారి శిక్ష చాలా దారుణంగా వుండేది. 

ఒకసారి అమ్మ కంది పొడి చేద్దామని కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు అన్నీ కుంపటి దగ్గర పెట్టి మూకుడు కుంపటి మీద పెట్టింది. ఇంతలోకే అమ్మకి సాయం చేద్దామని మూడోఅక్క అక్కడున్న పప్పులన్నీ కలిపి మూకుడులో వేసేసింది. అప్పుడే అక్కడి వచ్చిన అమ్మ కోపంగా ఒక్క అరుపు అరిచింది. కర్ర పట్టుకుని తిడుతూ అక్క వెనక పరుగెత్తింది. అక్క అమ్మనుంచి తప్పించుకోవడానికి ఇల్లంతా పరుగు పెడుతూనే వుంది. 

చివరికి పరుగెత్తి పక్కింటి వాళ్ళ బావి పక్కన వున్న బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. అమ్మ అంతా చూసి తనకి భయపడి నూతిలో దూకిందేమో... అనుకుని కర్ర అక్కడ పడేసి నూతివైపు చూస్తూ కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. ఎటువంటి చప్పుడూ లేకపోవడంతో అక్క బాత్రూం తలుపు తీసుకుని బయటికి వచ్చింది. ఇక్కడున్నావా... ఎంత కంగారు పెట్టావు... అని ఇంకెప్పుడూ అలా పప్పులన్నీ కలిపెయ్యకు. అన్నీ ఒకేసారి వేగవు అని చెప్పింది. అక్క అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళింది. ఆ టైములో అమ్మ నరసింహావతారం ఎత్తినట్లనిపించింది.


***


అప్పుడప్పుడూ నాన్నగారి బ్యాంక్ వాళ్ళు నాన్నగారి మీద అభిమానంతో ఇంటికి వచ్చి పలకరిస్తూ వుండేవారు. అక్క బ్యాంక్ లోనే చెయ్యడంతో ఇంకా అభిమానం ఎక్కువ.  ఈ సందర్భంలో... 



మాకు ఎవరో తెలిసినవాళ్ళు - ఛార్టు మీద గ్లాసు పెట్టి సున్నాలు గీసి, మొత్తం ఎబిసిడిలు రాసి, ఎస్, నో, స్టార్ట్ కూడా రాసి, స్టార్ట్ అనే సున్నామీద గ్లాసు బోర్లించి  "స్పిరిట్ ఈజ్ కమింగ్"  అనాలని చెప్పారు. అటొకళ్ళు ఇటొకళ్ళు కూచుని  ఆ గ్లాసు మీద  చూపుడు వేళ్ళు పెట్టి రెడీగా కూచోవాలి. మనకి ఇష్టమైన వారి ఆత్మని తలుచుకోవాలి. ఆ ఆత్మ వచ్చినప్పుడు గ్లాసు కదుల్తుంది అని చెప్పారు. 

సరే నేర్చుకున్నాం. మాకు అదో సరదాగా వుండేది. ఆత్మ వచ్చిందనన్నప్పుడు మాత్రం ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానంగా గ్లాసు రయ్ మంటూ ఎబిసిడిల మీదకి వెళ్ళిపోయేది. అది అన్వయించుకునే వాళ్ళం. 

అయితే ఈ విషయం అక్క బ్యాంక్ వాళ్ళకి చెప్పింది. వాళ్ళలో నారాయణమూర్తి అన్నాయన  వాళ్ళ స్నేహితుణ్ణి తీసుకువచ్చి వీళ్ళ పాపకి జ్వరం తగ్గట్లేదు ఏం చెయ్యాలో స్పిరిట్  ని అడగండి అన్నారు. 

మేము అంతకన్నా... మమ్మల్నే అడిగారు కదా అని ఒక స్పిరిట్ ని పిలిచాము. వాళ్ళు పాప జ్వరం గురించి అడిగితే 5 కోడిగుడ్లు దిష్టి తీసి పడెయ్యమని చెప్పింది. వాళ్ళు ఇంటికి వెళ్ళి అలా చెయ్యగానే జ్వరం తగ్గిపోయిందిట.  ఇంక ఎవరెవరినో వెంటపెట్టుకుని రావడం మొదలు పెట్టారు. అక్క బ్యాంకికి వెడుతుంది. మేము చదువుకుంటున్నాము. మాకు చాలా చిరాగ్గా అనిపించింది. దెబ్బతో మేము పెట్టడం మానేశాం అని చెప్పాం.  ఇంక అందరూ రావడం మానేశారు.  అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం.

ఇంతకీ మనలో అంతర్గతంగా ఉన్న కొన్ని ఆలోచనలే అలా వస్తాయని అనుకున్నాం. కాకపోతే నాకు ఇప్పటికీ అర్థంకానిది ఆ గ్లాసు మీద అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూచుని వేళ్ళు పెడితే ఆ గ్లాసు ఎలా కదిలేదో అర్థం కాలేదు. ఇది కూడా మనలో వున్న శక్తేనేమో.... మరి. 

ఇప్పుడు మూఢనమ్మకాలు వేటినీ పట్టించుకోము. 




18, డిసెంబర్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 33 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -4

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 33  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -4

ఒక్కసారి వెనక్కి

నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి ఇంటి దగ్గరలో ఉన్న బోర్డు స్కూల్లో చదివేటప్పుడు నేను ఐదో క్లాస్ చదువుతుంటే, ప్రభావతి 3వ క్లాస్ చదివేది. నేను ఐదు చదవడం అయిపోగానే గర్ల్స్ హైస్కూలులో 6వ తరగతిలో చేరదామనుకున్నాను.  మా మూడో అక్క ఉమాదేవి ఒక శలవు రోజు నన్ను తీసుకుని స్కూలుకి వెళ్ళి అక్కడ వున్న సోమలింగం అనే ప్యూన్ అడిగి నాకు స్కూలంతా చూపించింది. వీళ్ళందరికీ నాన్నగారు బ్యాంక్ లో బాగా తెలుసు కాబట్టి మేము లోపలికి వెళ్ళడానికి అడ్డు పెట్టలేదు. ఇక నేను స్కూలు మారుతున్నందుకు చాలా సంతోషించాను. 

నాన్నగారు కూడా సరే అన్నారు. ఇక ఒకరోజు నేను టిసి తీసుకుని స్కూలు నుంచి మారదామనుకున్నాను. కానీ మా ఇంగ్లీషు మేష్టారు. మీ నాన్నగారు నిన్ను స్కూలు మార్చట్లేదు అని చెప్పారు.  నాకు చాలా ఏడుపొచ్చింది. ఇంటికి వెళ్ళి ఎందుకు మార్చట్లేదని అడిగాను - నిన్ను మార్చేస్తే ప్రభావతి చిన్నపిల్ల ఒక్కత్తే స్కూలుకి వెళ్ళలేదు. ఈ స్కూలులో 7వ తరగతి వరకూ వుంది కాబట్టి -  నీకు 7వ తరగతి అయిపోతుంది, దానికి 3వ తరగతి అయిపోతుంది. ఇద్దరూ కలిసి హైస్కూలుకి వెళ్ళచ్చు అన్నారు.  ఇంక నాన్నగారి ఆలోచనకి నేను అడ్డు చెప్పలేకపోయాను. 

మొత్తానికి అలా 8వ తరగతి నుంచీ గర్ల్స్ హైస్కూలులో చేరాను.  నేను 9వ తరగతిలోకి వస్తూండగానే నాన్నగారు మాకు దూరమయ్యారు. ఎలాగో మా నాన్నగారి బ్యాంక్ వాళ్ళ ధర్మమా మళ్ళీ మా వూళ్ళోనే చదువులు కొనసాగించాము. సంవత్సరానికి ఒకసారే స్కూల్ ఫీజు అయినా... అక్కకి కట్టడం కష్టంగానే వుండేది. కానీ అమ్మ నాన్నగారు మల్లంపల్లి సుబ్బారావుగారు స్వాతంత్ర్య సమరయోధులు కాబట్టి  మాకు వాళ్ళ మనవలుగా ప్రభుత్వం నుంచి స్కూలు ఫీజులు వచ్చేలా... అప్లికేషన్ పెట్టించారు. అలా స్కూలు వరకూ నాకూ మా చెల్లెలికి ఫీజులు వచ్చాయి. 

అక్కకి కొంత ఊరట. రెండో అక్కకి, మూడో అక్కకి కాలేజీ ఫీజులు కట్టాల్సి వచ్చేది. వాళ్ళు రోజూ మా వూరి పక్కనే 3 km. దూరంలో వున్న పెంటపాడు వెళ్ళడానికి బస్ కి రోజుకి రాను పోనూ 50 పైసలు. ఇద్దరికీ కలిపి రూపాయి. అంటే నెలకి సెలవులు పోనూ... 20 రూపాయలు అయ్యేది.  అందుకని అక్కలిద్దరూ అప్పుడప్పుడూ కాలేజీ నుంచి నడుచుకుంటూ వచ్చేవారు.  అక్కలిద్దరనీ రమా, ఉమా అని పిలిచేవారు. వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. క్లాసులో ఫస్ట్ సెకండ్.  వీళ్ళిద్దరూ వ్యాసరచన, ఉపన్యాసాల పోటీలకి వెడుతుంటే అమ్మో రమా, ఉమా వస్తున్నారుట. మనకేం ప్రైజ్ రాదులే అని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇక ధైర్యం చేసి కొంతమంది వెెళ్ళేవారు కానీ, ప్రైజు మాత్రం వీళ్ళిద్దరికే వచ్చేది.  పరీక్షలకి చదువుకునేటప్పుడు ఇద్దరూ కలిసి చదువుకునేవాళ్ళు. చదువులో కూడా మంచి మార్కులు వచ్చేవి. 

***

పొట్టు పొయ్యి



పెంటపాడు నుంచి వచ్చేదారిలో  ఒక దుంగలని కట్ చేసే మిషను వుండేది. అవన్నీ కట్ చేసినప్పుడు వచ్చే సన్నటి రజనుని అమ్మ పొట్టు పొయ్యిలోకి వాడేది. పొట్టు  పొయ్యి వాడకం చాలామందికి తెలిసే వుంటుంది. కానీ ఆ పొయిలో పొట్టు కూరేటప్పుడు మధ్యలో పచ్చడి బండ పెట్టి దాని చుట్టూరా పొట్టు వేస్తూ, నీళ్ళు చల్లుతూ చేత్తో గట్టిగా అదుముతూ వుండాలి. అలా పొయ్యి నిండేవరకు అదిమిన పొట్టులోంచి బండని తీసేటప్పుడు అది ఫిట్ గా వుండాలి. ఏమాత్రం గట్టిగా అదమక పోయినా పొట్టంతా కుప్పలా అయిపోతుంది. చివరికి పొట్టు గట్టిగా నిలబడిన తర్వాత కిందనించీ కొంత పొట్టుని తీసెయ్యాలి. అప్పుడు అక్కడ కట్టెపుల్లలు పెడితే మంట బండ తీసినప్పుడు వచ్చిన హోల్ లోకి వెళ్ళి గిన్నెని వేడెక్కేలా చేస్తుంది. 


అమ్మ కుంపటి, పొట్టు పొయ్యి వాడేది. పొట్టు అయిపోయినప్పుడు అక్కలు ఆ మిల్లుకి వెళ్ళి బస్తా వేయించుకుని వచ్చేవారు. అది చాలా రోజులు వచ్చేది. రిక్షాలో బస్తా వేయించుకుని దాని మీద కూచుని వచ్చేవారు. ఏమిటో నామోషీ అసలు వుండేది కాదు. అలాగే బొగ్గులకి కూడా బస్తా వేయింకునేవాళ్లం. 




4, డిసెంబర్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 32 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -3

 

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 32  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -3



చిన్నపాప గీతాని మేడ మీద తిప్పుతూ, గోడమీద నడిపిస్తూ అన్నం పెట్టేవాళ్ళం. ఒకరోజు మేమందరం కూచుని మాట్లాడుకుంటుంటే... అటూ ఇటూ పరుగులు పెడుతోంది. ఉన్నట్టుండి అమ్మ మీద పడింది. నవ్వుతున్న అమ్మ పన్ను తలకి  గుచ్చుకుని ఉన్నట్టుండి బిగుసుకుపోయింది. నల్లగా అయిపోయింది. చాలా భయం వేసింది. నేను పెద్దక్క భుజం మీద వేసుకుని రోడ్డు మీద పరుగులు పెట్టుకుంటూ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గిరకి బయల్దేరాం. రాత్రి ఏడు గంటలు కావడంతో లైట్ల వెలుతురులో ఉన్నట్టుండి భుజం మీంచి లేచి "లైట్లు లైట్లు" అని అరిచింది. మాకు అమ్మయ్య అనిపించింది. అసలే నాన్నగారు పోయిన కొత్తలు పాప ఇలా కంగారు పెట్టేసరికి చాలా దిగులు వచ్చేసింది. మొత్తానికి చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాం. 


నాన్నగారు ఉన్నప్పటి నుంచీ జోగిరాజు అని ఆయుర్వేదం డాక్టరు, మూర్తి గారని ఆర్ ఎమ్ పి డాక్టరు. వీళ్ళిద్దరే మా కుటుంబ వైద్యులు. 

నాన్న లేని జీవితానికి అలవాటు పడుతున్నాం. ఇంతలోనే సుబ్బారాయుడి షష్ఠి రోజు  తాతగారు పెనుగొండ (పశ్చిమగోదావరి జిల్లా) నుంచి అంబాసీడర్ కారు పంపించారు -  అమ్మమ్మ చనిపోయింది. అందరూ కారులో వచ్చెయ్యండి అని డ్రైవరుతో కబురు చేశారు. నాన్నగారి రెండో అక్క సతీదేవిగారు. మా అమ్మకి మారుటి తల్లి. కానీ పెళ్ళయ్యాక మా అమ్మని బాగా చూసుకునేది తమ్ముడి భార్యగా.  సతీదేవిగారికి, మా నాన్నగారికి విడదీయరాని అనుబంధం. అక్క, తమ్ముడు ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ. ఆవిడకి తోచనప్పుడల్లా తమ్ముడి దగ్గరికి వచ్చేసేది. మా అమ్మ వంట అంటే ఆవిడకి చాలా ఇష్టం. అక్కలు ముగ్గురూ అంటే కూడా ఇష్టం. అక్కలతో కబుర్లు బాగా చెప్పేది. ఇంత అనుబంధం ఉన్న అమ్మమ్మ మా నాన్నగారు చనిపోయేసరికి బెంగ పెట్టుకుంది. అసలే మధుమేహవ్యాధిగ్రస్తురాలు. నాన్న గారి పుట్టిన రోజునే ఆవిడ కూచున్నావిడ కూచున్నట్టు ప్రాణాలు విడిచింది.    

అప్పుడు మా బామ్మ (అంటే సతీదేవిగారి తల్లి) మా దగ్గిరే వుంది. ఆవిడకి చెప్పదన్నారు. అందరం చిన్న పిల్లలమే కాబట్టి అంబాసీడర్ కారులో సరిపోయాం. తాడేపల్లి గూడెం నుంచి పెనుగొండ గంట ప్రయాణం. దారిలో బామ్మ ఇంకెవరో పోయారనుకుని వాళ్ళగురించి మాట్లాడుతూ కూచుంది. 

పెనుగొండ వెళ్ళాం. అసలే పల్లెటూరు, అమ్మమ్మ కౌన్సిలర్ గా చేసింది. తాతగారు సినిమాహాలు మేనేజర్, ఒక చిన్న సైజు జమీందారులులా వుండేవారు. ఇక ఊరు ఊరంతా అక్కడే వుంది. ఇంటి నిండా బంధువులు. 

అమ్మమ్మా వాళ్ళు లింగధారులు కాబట్టి అమ్మమ్మని గోడకి ఆనుకోపెట్టి కూచోపెట్టారు. నోట్లో బెల్లం ముక్క పెట్టారు. మాకు ఒక పక్క భయం, ఇంకోపక్క వింతగానూ అనిపించింది. నాన్నగారి తర్వాత మరో మరణం. మాకు తెలిసీ తెలియని వయసులు.  బాగా ఏడుపు వచ్చింది. బామ్మ అస్సలు తట్టుకోలేకపోయింది. ఒకపక్క కొడుకుపోయి కోలుకుంటుంటే, ఇంకోపక్క కూతురు. ఆవిడ బాధ వర్ణనాతీతం. 

చెయ్యవలసిన కార్యక్రమాలు చేశారు. లింగధారులు ఖననం చేస్తారు. అలా అమ్మమ్మ మాకు దూరమయ్యింది. 

పదిరోజులు అక్కడే వుండి మళ్ళీ తాడేపల్లి గూడెం వచ్చేశాం. 

మళ్ళీ మా కార్యక్రమాలలో పడ్డాం. నేను 9వ తరగతి చదువుతున్నాను. అక్కలిద్దరూ మాకు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంటపాడులో ఉన్న ఏకైక గవర్నమెంటు కాలేజీలో ఇంటరులో చేరారు. ఇద్దరూ చదువులో ముందు వుండేవారు. ఫీజు సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఎలా తిప్పలు పడి కట్టిందో అక్క తెలియదు. 

తాతగారు స్వాతంత్ర్య సమరయోధులు కాబట్టి, అప్పట్లో స్వాతంత్ర్యసమరయోధుల మనవలకి సంవత్సరానికి ఒకసారి స్కూలు ఫీజులు ప్రభుత్వం నుంచి ఇచ్చేవారు. అది అక్కకి కొంత ఊరటగా వుండేది. కానీ బియ్యం ఒక బస్తా  వేయించుకుంటే, టిఫిన్లు వుండేవి కాదుకాబట్టి, ఒక రెండు నెలలు వచ్చేది.  బస్తా 70 రూపాయలు ఒకోసారి ఆ డబ్బులు ఇవ్వడం కష్టంగానే వుండేది. అమ్మ బియ్యంలో వచ్చిన నూకలతో రవ్వ, పిండి చేసేది. అది వాడుకునేవాళ్ళం. ఒకోసారి నూకలు తక్కువని అవీ కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. అప్పట్లో చపాతీ తినడం తక్కువ. నాన్నగారు బంగాళదుంప వాడనిచ్చేవారు కాదు. ఎప్పుడైనా అమ్మ శనివారం టిఫినుగా చపాతీ చేసి, బంగాళదుంప కూర చేసేది. అదేదో అపురూపంగా వుండేది. ఏది తిన్నా అందరం ఆనందంగానే తినేవాళ్ళం. 

అమ్మ నేను ఇంటి ముందు ఉన్న ఖాళీస్థలంలో కాకరపాదు, దొండపాదు, బచ్చలిలాంటి మొక్కలు పెంచేవాళ్ళం. వంకాయ కూడా చాలా బాగా కాసేది. ఆ కూరలు బాగా ఆదుకునేవి. అప్పట్లో ఫ్రిజ్ లేదు కాబట్టి వారానికి ఒకసారి కూరలు తెచ్చుకునేవాళ్ళం. 

మాకు స్కూలు యూనీఫాం వుండేది కాబట్టి రోజూ బట్టలకి ఇబ్బంది వుండేది కాదు. కానీ అక్కలకి కాలేజీకి, పెద్దక్కకి బ్యాంక్ కి వెళ్ళడానికి బట్టలు కావాలి కాబట్టి. రోడ్డు చివర వున్న షాపులో నెలకి కొంత కొంత ఇచ్చి అక్క బట్టలు తీసుకునేది. జాకెట్లు మొదలైనవన్నీ అమ్మ ఇంట్లోనే కుట్టేది. ఆదివారం రోజు మాత్రం పెద్దక్క అమ్మకి కుట్టడం విషయంలో సాయం చేసేది. మాకు పండగ పేరుతో కొన్ని బట్టలు కుట్టించేవారు. ఏదైనా కుడా ఆడ పిల్లలం కాబట్టి బట్టల అవసరం బాగానే వుండేది. 

 

26, నవంబర్ 2021, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 31 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -2

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 31  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -2 

అమ్మ చిన్నపాపని తీసుకుని ఏలూరు నుంచి ఈ కొత్త ఇంటికి వచ్చింది. అమ్మమ్మ కూడా కొన్నాళ్ళు అమ్మకి తోడు వచ్చింది. వరసగా మూడు గదులు. వెనక కిందకి వున్న వంటగది. నాన్నగారు వున్నప్పుడు అందరం మంచాల మీద పడుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఇంట్లో మంచాలు వేసుకోవడానికి కొంచెం  ఇబ్బందిగానే వుండేది. మంచాలన్నీ బయట ఒక సందుంటే అందులో పెట్టి, ఒక పెద్ద మంచం మాత్రం ఇంట్లో వేసుకున్నాం. 

అమ్మమ్మ కొన్ని రోజులు వుండి (నర్సాపురం దగ్గర వున్న) పెనుగొండకి వెళ్ళిపోయింది. ఇక చిన్న పాప బాగా ఏడుస్తూ వుండేది. అమ్మకి పాపం నాన్న పోయి బాధలో పాపని అసలు పట్టించుకునేది కాదు. అంటే మళ్ళీ ఎత్తుకుని ముద్దులు పెట్టుకునేది. పాలిచ్చేది. ఇంట్లో పనికి పనిమనిషి, బట్టలకి చాకలి వున్నా... అమ్మకి వంటపని సరిపోయేది. ఇల్లంతా ఎప్పుడూ నీట్ గా పెట్టేది. 34 సంవత్సరాలకి నాన్న చనిపోతే అమ్మ పరిస్థితి ఎలావుండేదో అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంత చిన్న వయసులో ఎంత క్షోభపడిందో అని. 

మేమందరం భగవద్గీత నేర్చుకున్నామని చిన్న చెల్లెలుకి గీతాభవాని అని పేరు పెట్టాం. గీతా గీతా అని పిలిచేవాళ్ళం. అది ఏడుస్తుంటే నేను (కుడి నుంచి రెండు), మూడో అక్క ఉమ్మ (ఎడమ నుంచి రెండు)  ఇద్దరం దుప్పటీలో పడుకోపెట్టి అటూ ఇటూ వూపుతూ పాటలు పాడేవాళ్ళం. అది నిద్రపోయేది.  తర్వాత అమ్మ తీసుకెళ్ళి లోపల పడుకోపెట్టేది.

అక్క నాన్నగారు చేసిన ఆంధ్రాబ్యాంక్ లోనే పనిచేసేది కాబట్టి,   మేము ఆ ఇంటికి వచ్చాక అక్కకి బ్యాంక్ దగ్గరైంది. అక్క అప్పటి వరకూ చదువులోనే వుంది కాబట్టి సంసారం ఖర్చులు ఎక్కువ తెలిసేవి కాదు. ఉద్యోగం చేసి వచ్చి అలిసిపోయిందని అమ్మ ఏ పని చెప్పేది కాదు. అక్కంటే మా అందరికీ ప్రేమతో కూడిన భయం వుండేది. తన మాటకి ఎదురు చెప్పేవాళ్ళం కాదు.  రెండో అక్క అమ్మకి ఇంట్లో పనుల్లో సాయం చేసేది. ఇంక నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు.  నేను, మూడో అక్కా బజారు పనులన్నీ చూసుకునేవాళ్ళం. ప్రతి ఆదివారం సంతకి వెళ్ళి కూరలు కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. 

సంతలో అందరి దగ్గరా కూరలు చీప్ గానే వుండేవి కానీ, ఒకతని దగ్గరమాత్రం చాలా రేట్లు ఎక్కువ వుండేవి. ఎవరి దగ్గర దొరకని కూరలు  అతని దగ్గర దొరికేవి.  నాన్నగారు లేని లోటు తప్ప మిగిలిన విషయాల్లో అందరం ఆనందంగానే గడిపాం.

ఏదైనా సినిమా ఉంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. నాన్నగారు ఉన్నప్పుడు అక్కలని హిందీ పరీక్షలకి కట్టించి హిందీ రావాలని హిందీ సినిమాలకి తీసుకుని వెళ్ళేవారు.  అలా వాళ్ళకి హిందీ సినిమాలు అలవాటు అయ్యాయి. 


21, నవంబర్ 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 30 - మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు  30

మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు

మరియమ్మగారూ వాళ్ళు గులాబీ మొక్కలని పెంచేవారు. అవి చాలా పెద్ద పెద్ద పువ్వులు పూసేవి. అప్పుడప్పుడు ఆ పువ్వులు మాకు ఇస్తుండేవారు. అమ్మకి ఆ పువ్వులు పెట్టుకోవాలని వుండేది. నేనూ అమ్మా పెంచని మొక్కలేదు.  నాన్నగారు పోయిన కొత్త. ఆ బాధ ఒకవైపు. పెద్దక్క అమ్మతో అమ్మా... నీకు పెట్టుకోవాలని వుంటే పెట్టుకో... ఎవరిగురించో నీకెందుకు. ఇవన్నీ చిన్నప్పటి నుంచీ వచ్చినవి, చేసుకున్న వాళ్ళతో వచ్చినవి కాదు కదా... అంది. కానీ అమ్మ ఆ కోరికని తనలోనే అణిచేసుకుంది.   పల్లెటూరులో పుట్టింది. అందరి పెరళ్ళలో పువ్వుల మొక్కలు, తోటలు, పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగిన అమ్మ 34 సంవత్సరాలకే అన్నీ వదిలేసుకోవడం చాలా బాధ అనిపించింది.

మరియమ్మగారూ వాళ్ళు కోళ్ళని పెంచేవారు. నాలుగు కోళ్ళుండేవి. అవి లేత గులాబీ రంగులో అక్కడక్కడ గుడ్లు పెట్టేవి. మేము చూసి చెప్పేవాళ్ళం. ఆ కోళ్ళలో చుక్కల చుక్కల కోడి సన్నగా తిప్పుకుంటూ తిరిగేది. దానికి అక్కావాళ్ళు సైరాబాన్ అని పేరు పెట్టారు. చూడడానికి వింతగా వుండేది. అది మామూలు కోడే. నిప్పుకోడి కాదు. చిన్నగా ముద్దుగా వుండేది.  ఒకరోజు పొద్దున్న లేచేసరికి దాని దర్శనమవలేదు. మొత్తం పెరడంతా వెతికాం. ఒక మూల దాని ఈకలు కనిపించాయి. అవి క్రిస్ మస్ రోజులు. వాళ్ళు ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పాటలు పాడుతుండేవారు. అలా కలిసినప్పుడు మిఠాయిలు, పళ్ళు, వాళ్ళకి నచ్చినవి పంచిపెట్టుకునేవారు. ఈ కోడి కూడా అలాకలిసిపోయింది.

ఒకసారి మరియమ్మగారు, డా. లివింగ్ స్టన్ గారూ బాగా కొట్టుకున్నారు. మాకు చాలా భయం వేసింది. ఆవిడ సామాను సద్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆయన కూతురు, కొడుకులిద్దరూ వున్నారు. మళ్ళీ వారం రోజులకి పోయి ఆయనే ఆవిడని బతిమాలి తీసుకుని వచ్చాడు. వాళ్ళమ్మాయి మేరీ చాలా అందంగా వుండేది. తను మెడిసిన్ చెయ్యాలనుకుంది. ఒకసారి వాళ్ళ నాన్నతో నాన్నా నీకు ప్రాక్టీస్ నడుస్తోంది కానీ, మేము మెడిసిన్ చదివేనాటికి సంచులు బుజాన వేసుకుని తిరాగాలేమో... అనేది.  ఇది జరిగి దాదాపు 45 సంవత్సరాలు కావస్తోంది.

***

మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన ఇంకో ఘోరమైన సంఘటన – నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేసినప్పటి నుంచీ రామకృష్ణ అని ప్యూన్ వుండేవాడు. అక్క చేస్తున్నప్పుడు కూడా అతను ఉన్నాడు. అతని కొడుకు మా 6వ చెల్లెలు గాయత్రిని స్కూలుకి తీసుకుని వెళ్ళేవాడు. గాయత్రికన్నా 1 సంవత్సరం పెద్దవాడు. అయితే రెండు రోజులుగా అతను రావడం మానేశాడు. ఎందుకో అర్థం కాలేదు.  

అక్క ఇంటికి వచ్చి రామకృష్ణ కొడుకు కనిపించట్లేదు. కొడుకోసం అంజనాలు వేయించి అడుగుతున్నాడు. వాళ్ళు తూర్పువైపు వున్నాడని చెప్పారుట అంది. మాకు చాలా బాధగా అనిపించింది. తర్వాత రెండు రోజులకి తెలిసినది ఏమిటంటే... రామకృష్ణ ఆస్తికోసం వాళ్ళ బంధువులు పిల్లాడికి కాళ్ళూ చేతులూ కట్టేసి, అప్పట్లోకోరమాండల్ ఎక్స్ ప్రెస్ అని వచ్చేది దానికింద పడేశారుట. పైగా ఆ ఛిద్రమైన శరీరాన్ని రైల్వేట్రాక్ పక్కన పూడ్చిపెట్టారు. అదెలాగో బయటపడింది. మేము చాలా రోజులు మామూలుగా అవలేకపోయాం. ఇంత ఘోరంగా ఎలావుంటారా... అనిపించింది. మేము ఆ ఇంట్లో ఎక్కువరోజులు వుండలేదు.

*** 

అమ్మ డెలివరీకి ఎలూరు వెళ్ళింది కదా.... మేము పాపని చూసి వచ్చాం కదా... మేమున్న ఇల్లు అక్కడ ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు ఒకరోజు వచ్చి ఈ ఇల్లు మాకు కావాలి. మేమే వద్దామనుకుంటున్నాం అని చెప్పారు. ఇంక చేసేది ఏమీ లేదు.  మాకు ప్రతీ విషయానికి దిగులు పడే అలవాటు లేదు.

అనుకోకుండా మా నాన్నగారు వున్నప్పటి ఇల్లు దగ్గరే వేరే ఇల్లు దొరికింది. ఆ ఇల్లు గల ఆయన పేరు కలియుగార్జున్. ఆయనే ఆ పేరు పెట్టుకున్నాడు. బుధవారం బుధవారం మైక్ పెట్టి, భజనలు చేసేవారు. భజన అయ్యాక ప్రసాదం పంచిపెట్టేవారు. ఒక సంగీతం మేష్టారు హార్మొనీ వాయించేవారు. ఒక మద్దెల అతను మద్దెల వాయించేవాడు. గట్టిగా పాడేవారు. కృష్ణ భజనలు చేసేవారు. ఇక తప్పదు ఆ ఇల్లు అయితే అందరికీ అనుకూలంగా వుంటుంది.    


15, నవంబర్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 29 - దెయ్యాల భయం

 

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు 29 - దెయ్యాల భయం



దెయ్యాల భయం


అలా ఏలూరు నుంచి చిట్టి చెల్లాయిని చూసి వచ్చినప్పుడు పెద్దక్క ఒక్కత్తే ఇంట్లో వుంది. అక్క ఫ్రెండు రాజేశ్వరి సాయం వుంటానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. మేము రావడం లేటవుతోందని తెలిసి వెళ్ళిపోయింది.

అక్కని అదేమిటి అలా వెళ్ళిపోయిందని అడిగితే...

ఏమీలేదు గెరటరాజు గారి అబ్బాయి ఆరుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు కదా... వాళ్ళింటికి వెళ్ళే కాలవవడ్డున స్మశానంలోనే వాళ్ళని దహనం చేశారు కదా... రాత్రి పూట వాళ్ళ ఆత్మలు కాలవ ఒడ్డున కూచుంటాయిట. గజ్జెల చప్పుళ్ళు బాగా వినిపిస్తాయిట. అందుకని వెళ్ళిపోయిందని చెప్పింది.

***ఇంతకీ అసలు కథ ఏమిటంటే... గెరటరాజుగారని మా వూళ్ళో ఓ పెద్దమనిషి వున్నాడు. ఆయనకి 11 మంది పిల్లలు. వాళ్ళలో ఒకబ్బాయి సుబ్బారాయుడు పేట అని అక్కడ వుండేవాడు. ఆయనకి ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆయన బాగా డ్రింక్ చేసేవాడు.  బాగా అప్పులపాలయ్యాడుట. ఒక కంసాలి దగ్గిరకి వెళ్ళి సైనైడ్ తెచ్చుకుని నిద్రపోతున్న పిల్లలందరికీ వాసన చూపించి, తన కుక్కకి కూడా చూపించి, భార్యకి వాసన చూపించిన తర్వాత, ఫోన్ తీసి ఎదురగా వుండే బాబ్జీ అనే పేరున్న  ప్లీడరుకి  ఫోన్ చేసి మాట్లాడుతూ తనూ వాసన చూశాడుట. ఆవతల ఆయన ఫోన్ తీసేసరికి ఏమీ శబ్దం లేదు.

మర్నాడు పొద్దున్న పనిమనిషి వచ్చి తలుపు కొడితే ఎవరూ తియ్యలేదు. కిటికీలోంచి చూసి ఆ బాబ్జీ గారిని తీసుకుని వచ్చింది. ఆ తర్వాత కథ పోలీసులు, గోల అంతా మామూలే.... ***

ఇదీ సంగతి.

సరే మేమున్న పక్క వాటాలో లివింగ్ స్టన్ అని ఒక డాక్టరు వుండేవారు. ఆయనకి ఒక క్లినిక్ వుండేది. రోజూ వెళ్ళి వస్తుండేవారు. ఆయన అందరితో బాగా మాట్లాడేవారు. వాళ్ళావిడ మరియమ్మ గారెలు బాగా చేసేది. వాళ్ళు వేసకున్నప్పుడల్లా మాకు ఇచ్చేవారు. వాళ్ళకి ములక్కాడలు అంటే చాలా ఇష్టం. వెనకవైపు పెరడు బాగా వుండేది. అక్కడ కుర్చీలు వేసుకుని టిఫిన్ లా తింటూ వుండేవారు.

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే.... కొంత కథ చెప్పాలి కదా... ఈ ఇంటి కథ ఇంకా కొంచెం వుంది అది చెప్పేసి అసలు కథలోకి వెడతాను.

11, సెప్టెంబర్ 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 28 - కుటుంబ పెద్ద అయిన పెద్దక్క అన్నపూర్ణ

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 28 - 20 సంవత్సరాలకే కుటుంబ పెద్ద అయిన పెద్దక్క అన్నపూర్ణ


ఎడమ నుంచి 1 ఆరో అమ్మాయి గాయత్రి, 2 మూడో అమ్మాయి ఉమాదేవి, 3 పెద్దక్క అన్నపూర్ణ, అక్క ముందర నుంచున్నది గీతాభవాని 7వ అమ్మాయి

కుడి నుండి 1 ఐదో అమ్మాయి ప్రభావతి, 2 నేను - నాగలక్ష్మి, 3 రెండో అమ్మాయి రమాసుందరి
మధ్యలో అమ్మ

నాన్నగారు పోయేసరికి 7వ చెల్లెలు అమ్మ కడుపులో వుంది. అమ్మకి 7వ నెల. అప్పటి వరకూ అమ్మ ఏది అడిగినా నోట్లోంచి మాట రావడం తరువాయి తీసుకుని వచ్చేవారు. మా ఎవ్వరికీ ఏదీ కొనుక్కోవడం అలవాటు లేదు. అప్పుడప్పుడు నాన్నగారితో నేను కానీ, రెండో అక్క కానీ బజారుకి వెళ్ళేవాళ్ళం. బ్యాంక్ వాళ్ళు ఏడాదికి కావలసినవన్నీ ఏర్పాటు చేశారు.


నేను, మూడో అక్క ఉమాదేవి ప్రతి ఆదివారం సంతకి వెళ్ళి కూరలు తెచ్చేవాళ్ళం. ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ మేమిద్దరమే తెచ్చేవాళ్ళం. పొట్టు పొయ్యి కోసం పొట్టు బస్తా, కుంపటి కోసం బొగ్గుల సంగతి కూడా మేమే చూసేవాళ్ళం. రిక్షాలో పొట్టు బస్తా వేసి దాని మీద కూచుని వచ్చేవాళ్ళం. నామోషీ అంటే తెలియదు.


అక్కకి వచ్చి డబ్బుల లెక్కలన్నీ ఉమాక్కే చూసేది. పెద్దక్కకి ఇంట్లో పని ఎక్కువ అలవాటు వుండేది కాదు. బ్యాంకికి వెళ్ళడం రావడం, ఓవర్ టైము వుంటే చెయ్యడం చేసేది. వంటపని అమ్మ చూసుకునేది. రెండో అక్క ఇంటి పనుల్లో సాయం చేసేది. మిగతా వాళ్ళు చిన్న పిల్లలు. నాన్న ఉన్నప్పటి ఇల్లు మారిపోయి అక్కావాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోకి మారాం. ఊరికి కొంచెం దూరం. రెంటు లేకుండా మూడు నెలలకి ఇచ్చారు. తర్వాత అమ్మ వచ్చాక మళ్ళీ పాత ఇంటికి దగ్గరలో మారాం.


అమ్మని బామ్మ 9వ నెల రాగానే డెలివరీకి తీసుకుని వెళ్ళింది. అమ్మకి అమ్మమ్మే కాబట్టి, మా అమ్మమ్మ కూడా వెళ్ళింది. ఏలూరులో మా మేనత్త టీచర్ గా చేసేది. ఆవిడ ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునేది. డెలివరీ అయ్యిందని అక్కకి బ్యాంక్ కి ఫోన్ చేసి చెప్పారు. అమ్మకి మళ్ళీ పాప పుట్టింది. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీ అయ్యింది.


ఇంటికి తీసుకు వచ్చాక నేను, రెండో అక్క రమాసుందరి, మూడో అక్క ఉమాదేవి, పక్కింటి వాళ్ళ అమ్మాయి మేరీ కలిసి ఏలూరు చూడ్డానికి వెళ్ళాం. చిట్టి పాప ముద్దుగా వుంది. అమ్మ మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మాయి పుట్టినందుకు కాదు. నాన్నలేకపోవడం. మా బామ్మ నోటితో ఏమాట అంటే అదే అయిపోయేది. అమ్మని నీకు మగ పిల్లలు పుట్టరు. పుట్టినా బతకరు అని చెప్పిందిట. అలాగే మొట్ట మొదట ఒక అబ్బాయి, ఆరో అమ్మాయి గాయత్రి తరవాత ఒక అబ్బాయి పుడుతూనే పోయారు. ఈ అబ్బాయిన నేను చూశాను. దబ్బపండు ఛాయ, చక్కటి పొడుగు, అందమైన ఉంగరాల జుట్టు. నేను, పెద్దక్క అమ్మకి డెలివరీ అయిన టైములో అక్కడే వున్నాం. ఏమైతేనేం పుట్టిన బిడ్డ దక్కలేదు. నాన్న పడిన బాధ వర్ణనాతీతం. ఇక అమ్మ సంగతి చెప్పక్కరలేదు.


మేము పాపని చూసి రాత్రి బస్సులో తిరుగు ప్రయాణం అయ్యాం. గంటన్నర ప్రయాణం. తాడేపల్లి గూడెం ఇంకొద్ది సేపట్లో చేరతామనగా అంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో బస్సు ఆగిపోయింది. ఇక అక్కడ నుండీ నడుచుకుంటూ మొత్తం 5 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లిపోయాం.